త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

#StandWithHer | మౌనం వీడుదాం.. బాసటగా నిలుద్దాం: డీజీ చారుసిన్హా

#StandWithHer | త్రినేత్ర‌.న్యూస్‌: మహిళలపై వేధింపులు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా నేరమేనని, ఆ నిశ్శబ్దాన్ని వీడి బాసటగా నిలవడమే అసలైన పౌర బాధ్యతని ఉమెన్ సేఫ్టీ వింగ్‌ డీజీ చారు సిన్హా (Charu Sinha) అన్నారు.

G

Telangana | Published On May 13, 2026, 11.04 am IST

#StandWithHer | మౌనం వీడుదాం.. బాసటగా నిలుద్దాం: డీజీ చారుసిన్హా
Advertisement

#StandWithHer | త్రినేత్ర‌.న్యూస్‌: మహిళలపై వేధింపులు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా నేరమేనని, ఆ నిశ్శబ్దాన్ని వీడి బాసటగా నిలవడమే అసలైన పౌర బాధ్యతని ఉమెన్ సేఫ్టీ వింగ్‌ డీజీ చారు సిన్హా (Charu Sinha) అన్నారు. కేవలం చట్టాలు, పోలీసుల నిఘాతోనే భద్రత సాధ్యం కాదని, ప్రతి పురుషుడి ఆలోచనలో మార్పు వచ్చినప్పుడే మహిళలకు అసలైన రక్షణ లభిస్తుందని (Women's Safety) చెప్పారు. ఇందులో భాగంగా పురుషులను సామాజిక పోరాటంలో భాగస్వాములను చేసేందుకు ‘స్టాండ్ విత్ హర్’ (#StandWithHer) అనే వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు. ఈ డిజిటల్ క్యాంపెయిన్ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్న‌దని, దీనికి మద్దతుగా సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రచారం చేస్తున్నారని వెల్ల‌డించారు.

సమాజంలో మహిళలపై జరిగే చిన్నపాటి అవహేళనలు మొదలుకుని దారుణమైన నేరాల వరకు చాలా సందర్భాల్లో పురుషులు మౌనంగా ఉండిపోతారని, అయితే ఆ నిశ్శబ్దం కూడా నేరానికి పరోక్షంగా మద్దతు ఇవ్వడమేనని స్ప‌ష్టం చేశారు. మౌనం వీడి బాధ్యతాయుతమైన పౌరులుగా గళమెత్తాలని, కేవలం ప్రేక్షకులుగా కాకుండా మార్పున‌కు నాంది పలికే నాయకులుగా ఎదగాలన్నదే ఈ కార్య‌క్ర‌మం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. డిజిటల్ వేదికగా సాగుతున్న ఈ కార్యక్రమంలో సినీ నటుడు అడివి శేష్‌తో పాటు విరాజిత, దీపక్ కరముంగికర్, శరత్ నల్లా, చిల్లర్ బాయ్ వంటి ప్రముఖులు భాగస్వాములయ్యారని తెలిపారు.

ఆ విధానం మారాలి..

ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఒక మహాసముద్రంతో పోల్చిన అడివి శేష్.. మహిళలపై వచ్చే అసభ్యకర వ్యాఖ్యలు, ట్రోలింగ్‌ను అంటుకునే ఇసుకగా అభివర్ణించారని, ఆ ఇసుకను తుడిచేయాల్సిన బాధ్యత ప్రతి పురుషుడిపై ఉందని సందేశమిచ్చారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఏదైనా ఫొటో లేదా వీడియోను షేర్ చేసే ముందు సదరు మహిళా మిత్రుల అనుమతి తీసుకోవడం ప్రాథమిక సంస్కారమని, అది వారి హక్కు అని గుర్తుచేశారు. వీధుల్లోనే కాకుండా కార్యాలయాలు, కుటుంబాల్లోనూ ఆడవారి పట్ల గౌరవం పెరగాలని, వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక వెక్కిరించడం లేదా బాడీ షేమింగ్ చేయడం వంటి ధోరణులు మారాలని సూచించారు.

రోల్ మోడల్‌గా..

ప్రతి పురుషుడు తన రోజువారీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని, తోటి పురుషులకు ఆదర్శంగా నిలిచి మహిళలకు భరోసా ఇచ్చేలా రోల్ మోడల్‌గా మారాలని ఆకాంక్షించారు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయంగా మారినప్పుడే సమాజంలో నిజమైన మార్పు వస్తుందన్నారు. ఇంట్లోని ఆడబిడ్డను ఎంతగా ఆదరిస్తామో, బయటి మహిళల పట్ల కూడా అదే గౌరవం చూపినప్పుడే సురక్షిత వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ఈ గొప్ప మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని, ఎక్కడైనా తప్పు జరుగుతున్నప్పుడు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోకుండా ధైర్యంగా ప్రశ్నించాలని చెప్పారు.

Advertisement
Advertisement