త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | తెలంగాణ‌కు నిధులెందుకు ఇవ్వ‌రు?.. బీజేపీ రాష్ట్ర‌ నాయ‌కులు స‌మాధానం చెప్పాలి

Ponnam Prabhakar | ప‌క్క రాష్ట్రాల‌కు నిధులు ఇస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణకు ఎందుకు ఇవ్వ‌ద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌శ్నించారు. రాష్ట్ర‌ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము బీజేపీ నేతలకు లేదా అని నిల‌దీశారు. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం బీజేపీ నాయ‌కులు ముందుండాల‌ని కోరారు.

S

Telangana | Published On Aug 22, 2026, 1.34 pm IST

Ponnam Prabhakar | తెలంగాణ‌కు నిధులెందుకు ఇవ్వ‌రు?.. బీజేపీ రాష్ట్ర‌ నాయ‌కులు స‌మాధానం చెప్పాలి
Advertisement
  • రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రాన్ని అడ‌గ‌రా?
  • పెట్టుబ‌డుల కోసం సీఎం విదేశాల‌కు వెళ్లే హ‌క్కు లేదా?
  • రాజ‌కీయాలు ప‌క్క‌న పెట్టి అభివృద్ధికి స‌హ‌క‌రించాలి
  • ‘‘పల్లె పల్లెకు పొన్నం అన్న-పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్ర‌మంలో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ డిమాండ్‌

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్: ప‌క్క రాష్ట్రాల‌కు నిధులు ఇస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణకు ఎందుకు ఇవ్వ‌ద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌శ్నించారు. రాష్ట్ర‌ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము బీజేపీ నేతలకు లేదా అని నిల‌దీశారు. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం బీజేపీ నాయ‌కులు ముందుండాల‌ని కోరారు. ‘‘పల్లె పల్లెకు పొన్నం అన్న-పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా శ‌నివారం హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అక్కన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు స‌హ‌క‌రించ‌డం లేదో స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విఫలం అయ్యారు. తెలంగాణ రైజింగ్‌కు కేంద్ర సహకారం అవసరం. అడ్డంకులు సృష్టించడం సరికాదు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రధానమంత్రి చెబుతున్న వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలి.

అందులో తెలంగాణ కూడా కీలక భాగస్వామిగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ -2047 లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, దేశ అభివృద్ధి విషయంలో కేంద్రంతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడం, వివిధ అంతర్జాతీయ సదస్సుల్లో తెలంగాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం, అన్ని వర్గాలను కలుపుకొని సమగ్ర అభివృద్ధి సాధించడం మా లక్ష్యం.

విదేశాలకు వెళ్లే హక్కు లేదా?

అయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి అమెరికా, లండన్ విదేశీ పర్యటనలు చేపట్టాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించడం బాధాకరం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లే హక్కు కూడా లేదా? తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు, మౌలిక వసతుల విషయంలో కేంద్రం సహకరించాలి.

మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్లు, ఇంటర్నల్ రేడియల్ రింగ్ రోడ్లు వంటి కీలక ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ఇతర ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలి. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన ఆర్థిక సహకారం, నిధుల విషయంలో కూడా కేంద్రం సానుకూలంగా వ్యవహరించాలి. చిన్నచిన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధానం కాకుండా, రాష్ట్రాల అభివృద్ధికి సహకరించే సమాఖ్య స్ఫూర్తితో వ్య‌వహరించాలి.

తెలంగాణ బీజేపీ నాయకులు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? రాష్ట్ర ఏర్పాటు విషయంలో మీరు ఏ విధంగా వ్యవహరించారో ప్రజలకు తెలుసు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి విషయంలో కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం ఎందుకు గళమెత్తడం లేదు? బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఐక్యత కోసం కేంద్ర నాయకత్వం ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిలదీయడంలో మాత్రం ఆ ఐక్యత కనిపించడం లేదు.

తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. మేం రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ కేంద్రం సహాయ నిరాకరణ చేస్తే తెలంగాణ ప్రయోజనాల కోసం మేం తప్పకుండా ప్రశ్నిస్తాం. తెలంగాణ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదగాలి. చిన్న రాష్ట్రం అయినప్పటికీ అభివృద్ధిలో ముందుండాలి.

ప్రతి వర్గానికి సమగ్ర అభివృద్ధి అందాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని కూడా కోరుతున్నాం. మీరు ఐక్యంగా ఉన్నా, లేకపోయినా మీ ఇష్టం. కానీ తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో ముందుండండి. తెలంగాణ ప్రజల కోసం కేంద్రాన్ని ప్రశ్నించండి.

పక్క రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నప్పుడు తెలంగాణ కు నిధులు ఎందుకు ఇవ్వడంలేదు. దక్షిణ భారదేశాల నుండి మేం ఇస్తున్నది ఎంత? మీరు తిరిగి ఇస్తున్నది ఎంత? ఒకసారి గమనించుకోవాలి. తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పనిచేసినప్పుడే తెలంగాణ రైజింగ్ వికసిత్ భారత్ లక్ష్యాలు సాకారం అవుతాయి.

పల్లె పల్లెకు పొన్నం అన్న-పల్లె పల్లెలో ప్రజాపాలన

తెలంగాణ ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి? ఇంకా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి? అనే ఉద్దేశంతో హుస్నాబాద్ నియోజకవర్గంలోని 183 గ్రామాల్లో “పల్లె పల్లెకు ప్రజాపాలన – పల్లె పల్లెకు పొన్నం” కార్యక్రమాన్ని చేపట్టాం.

ఈ నెల 19 వ తేదీ నుంచి ప్రతి రోజు ఒక మండలంలో 5 నుంచి 6 గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో నేరుగా సమావేశమవుతున్నాం. ఇది నాలుగో మండలంలో కొనసాగుతున్న కార్యక్రమం. ప్రతి గ్రామంలో ప్రజలతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను ఓపికగా వింటున్నాం. ముఖ్యంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు, ఆయిల్‌పామ్ సాగు, ఇతర ప్రత్యామ్నాయ పంటలు, రైతులకు అవసరమైన సూచనలు, ఆరోగ్యం, విద్య, అంగన్‌వాడీ కేంద్రాలు, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, కొత్త పెన్షన్లు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.

ప్రజల సమస్యలను కేవలం వినడంతో ఆపకుండా, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. మండలస్థాయి అధికారులను కూడా ఈ సమావేశాల్లో భాగస్వాములను చేయడం వల్ల విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు వంటి చిన్నచిన్న సమస్యలు కూడా వెంటనే పరిష్కారమవుతున్నాయి.

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గించడమే లక్ష్యం

ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందించినా, నేరుగా చెప్పినా వాటిని సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించే బాధ్యత తీసుకుంటున్నాను. భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నా. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుంది.

పల్లెకు ప్రభుత్వం రావాలి.. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి అందాలి. ఇదే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement