త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | రేవంత్‌, ఉత్త‌మ్ ఫొటోల‌కు 100 కోట్లు దండ‌గ.. ఇది పచ్చి రాజ్యాంగ ఉల్లంఘనే

Dasoju Sravan | రేషన్ కార్డులపై రేవంత్, ఉత్తమ్‌ల ఫొటోల కోసం దాదావు రూ.100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్ ఫైరయ్యారు. సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కి మంత్రి ఫొటో ముద్రించడం పచ్చి రాజ్యాంగ ఉల్లంఘనేన‌ని మండిప‌డ్డారు.

S

Telangana | Published On Aug 16, 2026, 7.08 pm IST

Dasoju Sravan | రేవంత్‌, ఉత్త‌మ్ ఫొటోల‌కు 100 కోట్లు దండ‌గ.. ఇది పచ్చి రాజ్యాంగ ఉల్లంఘనే
Advertisement
  • ప్ర‌జ‌ల జేబు కొట్టి సొంత డ‌బ్బా కొట్టుకుంటున్న‌రు
  • నాడు మోదీ ఫొటోలపై నీతులు చెప్పిన కాంగ్రెస్.. నేడు గల్లీలో చేస్తున్నది నగ్న ద్వంద్వ నీతి కాదా?
  • "ప్రజాధనంతో మన ఫోటోలు వద్దు" అని తిరస్కరించిన సంస్కారం కేసీఆర్‌ది
  • అధికారిక రాజముద్రతో కూడిన సాధికారిక కార్డులను ప్రజలకు ఇవ్వాలి
  • కాగ్‌తో విచార‌ణ జరిపించి బాధ్యుల నుంచి రికవరీ చేయాలి
  • నిబంధనలకు విరుద్ధంగా మంత్రి ఫొటో ముద్రించినందుకు రాజ్యాంగపరమైన చర్యలు చేపట్టాలి
  • ఎన్నికల కోడ్ వస్తే ఈ 1.05 కోట్ల కార్డుల మాటేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి
  • ఎక్స్ వేదిక‌గా రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డిన దాసోజు శ్ర‌వ‌ణ్‌

Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్‌: రేషన్ కార్డులపై రేవంత్, ఉత్తమ్‌ల ఫొటోల కోసం దాదావు రూ.100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్ ఫైరయ్యారు. సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కి మంత్రి ఫొటో ముద్రించడం పచ్చి రాజ్యాంగ ఉల్లంఘనేన‌ని మండిప‌డ్డారు. నాడు మోదీ ఫొటోలపై నీతులు చెప్పిన కాంగ్రెస్.. నేడు గల్లీలో చేస్తున్నది నగ్న ద్వంద్వ నీతి కాదా? అని ధ్వ‌జ‌మెత్తారు. రేపు స్థానిక సంస్థ‌లు, జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ వస్తే ఈ 1.05 కోట్ల కార్డుల మాటేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈమేర‌కు ఆదివారం దాసోజు ఎక్స్ వేదిక‌గా తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

తెలంగాణలోని నిరుపేదల ఆకలి తీర్చే రేషన్ కార్డులను తమ సొంత రాజకీయ ప్రచార కరపత్రాలుగా మార్చుకొని, పేదల రక్తం పంచుకున్న ప్రజా ధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బరితెగించి దుర్వినియోగం చేస్తోంది. మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనెలా తయారైంది కాంగ్రెస్ దర్జా! నిన్న ఆగస్టు 15న సంగారెడ్డితో పాటు 119 నియోజకవర్గాల్లో ప్రారంభించిన 1.05 కోట్ల లామినేటెడ్ రేషన్ కార్డుల పంపిణీ పేరిట జరిగిన భారీ దుబారా జరుగుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి పైసల్లేవు కానీ.. సొంత ప్రచార డబ్బాకు వంద కోట్ల దోపిడీయా? ఇప్పటికే ఉన్న ఈ-కార్డులను రద్దు చేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫొటోలతో కూడిన లామినేటెడ్ కార్డుల కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలు తగలేయడం సిగ్గుచేటు.

క్లౌడ్ సర్వర్లు, స్పెషల్ వెబ్‌సైట్లు, ప్రింటింగ్, లామినేషన్, 33 జిల్లాల్లో రవాణా పేరిట ప్రజల జేబులు కొట్టి సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వద్దకు అధికారులు వెళ్లి భూముల పట్టా పుస్తకాలపై, రేషన్ కార్డులపై తన ఫోటో పెడదామంటే, "ప్రజాధనంతో మన ఫోటోలు వద్దు" అని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన సంస్కారం కేసీఆర్‌ది.

కాంగ్రెస్ పచ్చి ద్వంద్వ నీతి బయటపడింది. 2021లో కోవిడ్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ముద్రిస్తే.. ప్రియాంక గాంధీ మొదలుకొని గల్లీ లీడర్ దాకా "ప్రజల ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్లు మోదీ వ్యక్తిగత ప్రచార సాధనాలుగా మారాయి" అని నానా యాగీ చేశారు. వారి ఒత్తిడికి తలొగ్గి, గోవా, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్, మోదీ ఫొటోలను తొలగించాలని ఆదేశించింది.

మరి అప్పుడు మోదీకి వర్తించిన నియమాలు నేడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వర్తించవా? రేషన్ కార్డు అనేది జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కు. అది రేవంత్, ఉత్తమ్‌లు తమ సొంత జేబుల్లోంచి ఇస్తున్న దానధర్మం కాదు! 2016 నాటి స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ కామన్ కాజ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పు ప్రకారం.. ప్రభుత్వ ప్రకటనలపై సిట్టింగ్ సీఎం ఫొటోకు మాత్రమే పరిమిత మినహాయింపు ఉంది. ఏ కేబినెట్ మంత్రి ఫొటో కూడా పెట్టడానికి వీల్లేదు. కానీ నిబంధనలను తుంగలో తొక్కి పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటో ముద్రించడం పచ్చి రాజ్యాంగ విరుద్ధం. రేపు స్థానిక సంస్థలు లేదా జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ రాగానే ఈ కార్డులన్నీ రద్దువుతాయి లేదా ఫొటోలు తొలగించాల్సి వస్తుంది. మళ్లీ రీ-ప్రింటింగ్ కోసం ఇంకో 100 కోట్లు బొక్కబెడతారా?

పేద ప్రజల అన్నం కార్డులపై తమ ముఖాలు ముద్రించుకుని ప్రచారం చేసుకోవడం సంక్షేమం కాదు.. అది పేదవాళ్లు పాలకవర్గాల దయాదాక్షిణ్యాలతో కడుపు నింపుకుంటున్నారు అనే ఫ్యూడలిస్ట్ ఆధిపత్య అహంకార సందేశమిస్తూ పేదలను అవమానించడం పక్కా రాజకీయ దివాళాకోరుతనం. తక్షణమే ఈ ఫొటో కార్డుల డ్రామా ఆపి, ప్రజల సొమ్మును ప్రజా సంక్షేమాకే ఖర్చు చేయాలి అని దాసోజు శ్ర‌వ‌ణ్ డిమాండ్ చేశారు.

ఇవే మా డిమాండ్స్‌

1. రేషన్ కార్డులపై నుంచి వెంటనే ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రుల ఫొటోలను తొలగించి, అధికారిక రాజముద్రతో కూడిన సాధికారిక కార్డులను ప్రజలకు ఇవ్వాలి
2. ఈ 100 కోట్ల దుబారాపై తక్షణమే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ - CAG) తో సమగ్ర ఆడిట్ జరిపించి, బాధ్యులైన వారి నుంచి రికవరీ చేయాలి
3. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా మంత్రి ఫొటో ముద్రించినందుకు న్యాయపరమైన, రాజ్యాంగపరమైన చర్యలు చేపట్టాలి
4. ఎన్నికల కోడ్ వస్తే ఈ 1.05 కోట్ల కార్డుల మాటేమిటో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి

 

Advertisement
Advertisement