త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Police Jobs | తెలంగాణ పోలీస్ ఉద్యోగాల రాత ప‌రీక్ష‌ల తేదీలు వ‌చ్చేశాయ్‌..!

TG Police Jobs | తెలంగాణ పోలీస్‌ శాఖలో ఖాళీల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఎస్ఐ స్థాయి పోస్టులకు నవంబర్‌ 29న, కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు డిసెంబర్‌ 20న రాత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (TSLPRB) చైర్మ‌న్ వీవీ శ్రీ‌నివాస‌రావు గురువారం ప్ర‌క‌టించారు.

P

Telangana | Published On Sep 17, 2026, 6.47 pm IST

TG Police Jobs | తెలంగాణ పోలీస్ ఉద్యోగాల రాత ప‌రీక్ష‌ల తేదీలు వ‌చ్చేశాయ్‌..!
Advertisement
  • ఎస్ఐ పోస్టులకు నవంబర్‌ 29న.. కానిస్టేబుల్‌ పోస్టులకు డిసెంబర్‌ 20న ప‌రీక్ష‌లు

TG Police Jobs | తెలంగాణ పోలీస్‌ శాఖలో ఖాళీల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఎస్ఐ స్థాయి పోస్టులకు నవంబర్‌ 29న, కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు డిసెంబర్‌ 20న రాత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (TSLPRB) చైర్మ‌న్ వీవీ శ్రీ‌నివాస‌రావు గురువారం ప్ర‌క‌టించారు. పోలీస్, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్, అగ్నిమాపక-విప‌త్తు నిర్వ‌హ‌ణ‌, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి గత జూలై 29న నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపారు. వీటిలో పోలీస్‌ శాఖలో 200 ఎస్ఐ, ఏఎస్ఐ, 4,800 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో 44 ఎస్ఐ, 1,380 కానిస్టేబుల్‌, అగ్నిమాపక శాఖలో 39 ఎస్సై, 751 కానిస్టేబుల్‌, జైళ్ల శాఖలో 15 ఎస్ఐ, 208 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు.

4.29 లక్షల మంది నుంచి 5.77 లక్షల దరఖాస్తులు

ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు 28 రోజులపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించగా.. మొత్తం 4.29ల‌క్ష‌ల మంది అభ్యర్థుల నుంచి 5,77,064 దరఖాస్తులు వచ్చినట్లు శ్రీ‌నివాస‌రావు వెల్ల‌డించారు. సగటున ఒక్కో అభ్యర్థి 1.34 దరఖాస్తులు చేసినట్లు వెల్లడించారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 68.45 శాతం మంది ఒకే పోస్టుకు, 28.88 శాతం మంది రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2.423 శాతం మంది మూడు పోస్టులకు, 0.2 శాతం మంది నాలుగు పోస్టులకు, 0.046 శాతం మంది ఐదు పోస్టులకు దరఖాస్తు చేసినట్లు వివరించారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 1,35,359 మంది అభ్యర్థులకు ఉమ్మడి శారీరక పరీక్షల కారణంగా ఫీజు రాయితీ కల్పించినట్లు తెలిపారు.

బీసీల నుంచి అత్యధిక దరఖాస్తులు

సామాజిక వర్గాల వారీగా చూస్తే మొత్తం దరఖాస్తుల్లో 49.19 శాతం బీసీ, 43.60 శాతం ఎస్సీ-ఎస్టీ, 7.20 శాతం ఓసీ కేటగిరీల నుంచి వచ్చాయి. ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించినట్లు తెలిపారు. ఓసీ కేటగిరీలో 3.45 శాతం దరఖాస్తులు ఇతర రాష్ట్రాల అభ్యర్థుల నుంచి వచ్చినట్లు వెల్లడించారు. జెండ‌ర్ ఆధారంగా చూస్తే పురుష అభ్యర్థుల నుంచి 4,30,844 (74.66 శాతం) దరఖాస్తులు, మహిళా అభ్యర్థుల నుంచి 1,46,220 (25.33 శాతం) దరఖాస్తులు వ‌చ్చాయ‌ని వివ‌రించారు. నియామక ప్రక్రియలో పారదర్శకత పెంచడంతోపాటు నకిలీ దరఖాస్తులను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌ను 97.4 శాతం మంది అభ్యర్థులు మొబైల్‌ ఫోన్ల ద్వారా విజయవంతంగా పూర్తి చేసినట్లు చైర్మన్‌ తెలిపారు. సాంకేతిక కారణాలతో పూర్తి చేయలేకపోయిన మిగిలిన 2.6 శాతం మంది అభ్యర్థులకు ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ లాగిన్‌లో ఫేస్‌ అథెంటికేషన్‌ పూర్తి చేసిన తర్వాతే అప్లికేషన్‌ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

పోస్టుల వారీగా ఎంపిక ప్రక్రియ

ఎస్ఐ సివిల్‌, కానిస్టేబుల్‌ సివిల్‌ పోస్టులకు ప్రాథమిక రాత పరీక్షతో ప్రారంభమయ్యే మూడు దశల ఎంపిక ప్రక్రియ ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. ఏఎఐ ఎఫ్‌పీబీ, డ్రైవర్‌ పీసీ, మెకానిక్‌ పీసీ పోస్టులకు శారీరక పరీక్షలతో ప్రారంభమయ్యే రెండు దశల ఎంపిక ప్రక్రియ ఉంటుందని వివరించారు. ఏఎస్ఐ ఎఫ్‌పీబీ పోస్టులకు 11,992, డ్రైవర్‌ పీసీకి 12,495, మెకానిక్‌ పీసీకి 2,465 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. పరీక్షల మాధ్యమానికి సంబంధించి 56.84 శాతం మంది తెలుగును, 43.02 శాతం మంది ఇంగ్లిష్‌ను, 0.12 శాతం మంది ఉర్దూను ఎంచుకున్నట్లు బోర్డు చైర్మ‌న్ వెల్లడించారు. నవంబర్‌ 29న జరిగే ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్షను ఉమ్మడి 10 జిల్లాల కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 20న జరిగే కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 18 ప్రాంతాల్లో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ శ్రీనివాసరావు వివ‌రించారు.

Advertisement
Advertisement