త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagadeesh Reddy | అప్పుడు బాబు.. ఇప్పుడు రేవంత్‌.. రైతుల‌ను దొంగ‌ల‌ను చేస్తున్న‌రు: మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

Jagadeesh Reddy | రైతుల పేరు మీద క‌రెంటు దొంగ‌త‌నానికి గుర‌వుతుంద‌ని.. అందుకే రైతు డిస్కంలు తెస్తున్నామ‌ని ప్ర‌భుత్వం చెప్ప‌డం అత్యంత దుర్మార్గ‌మ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ‌గ‌దీశ్‌రెడ్డి మండిప‌డ్డారు. రైతు డిస్కం అమలైతే ఒక మండలానికి ఒకరు లేదా ఇద్దరే లైన్‌మెన్లు ఉండే పరిస్థితి వస్తుందన్నారు.

S

Telangana | Published On May 29, 2026, 4.27 pm IST

Jagadeesh Reddy | అప్పుడు బాబు.. ఇప్పుడు రేవంత్‌.. రైతుల‌ను దొంగ‌ల‌ను చేస్తున్న‌రు: మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి
Advertisement
  • వాళ్ల పేరు మీద క‌రెంట్ దొంగ‌త‌నం జ‌రుగుతుంద‌ట‌
  • అందుకే రైతు డిస్కంలు తెస్తున్న‌ర‌ట‌
  • ఇదేం దిక్కుమాలిన కార‌ణం.. అత్యంత దుర్మార్గం కూడా
  • ఇగ మండ‌లానికి ఒక్క‌డే లైన్‌మెన్ ఉంట‌డు
  • రైతులు స‌బ్‌స్టేష‌న్ల‌కు పోలేరు.. ట్రాన్స్‌ఫార్మ‌ర్ ద‌గ్గ‌ర తొంగి చూసి రావాల్సిందే
  • ఇవి రైతుకు ఉరేసే డిస్కంలు
  • మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన‌ జ‌గ‌దీశ్‌రెడ్డి

Jagadeesh Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రైతుల పేరు మీద క‌రెంటు దొంగ‌త‌నానికి గుర‌వుతుంద‌ని.. అందుకే రైతు డిస్కంలు తెస్తున్నామ‌ని ప్ర‌భుత్వం చెప్ప‌డం అత్యంత దుర్మార్గ‌మ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ‌గ‌దీశ్‌రెడ్డి మండిప‌డ్డారు. ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం రైతులను దొంగలను చేస్తే.. ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా రైతులను దొంగలను చేసే ప్రయత్నం చేస్తున్నాడని విమ‌ర్శించారు. ఈఆర్సీ చేపట్టిన‌ రైతు డిస్కం ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లో పాల్గొని అనంత‌రం మీడియా స‌మావేశంలో మాట్లాడారు. రైతు డిస్కం అమలైతే ఒక మండలానికి ఒకరు లేదా ఇద్దరే లైన్‌మెన్లు ఉండే పరిస్థితి వస్తుందన్నారు. వేలాది వ్యవసాయ కనెక్షన్లు, వందలాది ట్రాన్స్‌ఫార్మర్ల బాధ్యత ఒక్కరి భుజాలపై పడుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈఆర్సీ అనుమ‌తి లేకుండానే..

రైతుల పేరు మీద కరెంట్ దొంగతనం జరుగుతున్నది అనడం దుర్మార్గం. రైతులకు ప్రస్తుతం ఉన్నట్లుగా సబ్‌స్టేషన్ల వద్ద అధికారులను నేరుగా సంప్రదించే అవకాశం కూడా పోతుంది. విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు రైతులకు వెంటనే సేవలు అందకపోయే ప్రమాదం ఉంది. విద్యుత్ రంగంలో ఏ చిన్న ప‌ని చేయాల‌న్నా, సంస్కర‌ణ‌లు చేయాల‌న్నా ఈఆర్సీ అనుమతి త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. దాని అనుమ‌తి లేకుండా ఎవ‌రు కూడా మాట్లాడ్డానికి వీల్లేదు. కానీ ఈఆర్సీ అనుమ‌తి లేకుండానే, చ‌ర్చ కూడా లేకుండానే ముఖ్య‌మంత్రి ప‌ది ప‌దిహేను రోజుల కింద‌నే జూన్ 2 నుంచి డిస్కంలు ప్రారంభిస్తున్న‌మ‌ని ప్ర‌క‌టించిండు. ఇదే విష‌యాన్ని మేం ఈఆర్సీ ముందుకు తీసుకొచ్చినం అని మాజీ మంత్రి పేర్కొన్నారు.

తాటిచెట్టు ఎందుకెక్కిన‌వు అంటే స‌ల్ల కొర‌కు ఎక్కిన అన్న‌ట్లుంది..

ఈఆర్సీ అనుమ‌తి లేకుండానే డిస్కంలు ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇందులో అనేక లొసుగులున్నాయి. ప్ర‌భుత్వం చెబుతున్న కార‌ణం.. తాటిచెట్టు ఎందుకు ఎక్కిన‌వు అంటే స‌ల్ల కొర‌కు ఎక్కిన అనే సామెత చెప్పిన‌ట్లు ఉంది త‌ప్పా ప్ర‌భుత్వం చెప్పే కార‌ణం ఏది స‌రైంది కాదు. డిస్కంల‌కు స‌మ‌స్య‌లొస్తే దానికి ప్ర‌త్యామ్నాయ ప‌ద్ధ‌తులున్న‌య్‌. ప్ర‌భుత్వాలు బాధ‌త తీసుకోవాలి అని జ‌గ‌దీశ్‌రెడ్డి సూచించారు.

ప్ర‌భుత్వం ఓ అధికారితో స్ప‌ష్టంగా చెప్పిచ్చింది. ఏమ‌నంటే రైతుల పేరు మీద దొంగ‌త‌నాలు జ‌రుగుతున్న‌య్ అని. ఈ ప్ర‌భుత్వం రైతుల‌ను దొంగ‌ల‌ను చేస్తోంది. గ‌తంలో చంద్ర‌బాబు రైతుల‌ను దొంగ‌ల‌ను చేశారు. ఇప్పుడు ఆయ‌న శిష్యుడు రేవంత్ కూడా అదే చేస్తున్నాడు. దొంగ‌త‌నాలు జ‌రుగుతున్న‌య్ కాబ‌ట్టి మేం సెప‌రేట్ డిస్కం చేస్తున్న‌మ‌ని మాట్లాడుతున్న‌రు. ఇది అత్యంత దుర్మార్గం అని ఎమ్మెల్యే జ‌గ‌దీశ్‌రెడ్డి ఫైర‌య్యారు.

ఒక్క లైన్‌మెన్ కింద 700 ట్రాన్స్‌ఫార్మ‌ర్లు..

మండ‌లానికి ఒక్క‌డే లైన్‌మెన్ ఉంట‌డు. ఆయ‌న కింద దాదాపు 700 ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ఉంట‌యి. వేలాది క‌నెక్ష‌న్లు ఉంటయ్‌. మ‌రి రైతులు ఫోన్ చేస్తే ఒక్క లైన్‌మెన్ ఏ ఊరికి పోవాలి.. ఏ ప‌ని చేయాలి? స‌బ్‌స్టేష‌న్ ద‌గ్గ‌ర‌కు కూడా పోవ‌డానికి వీల్లేదు. ట్రాన్స్‌ఫార్మ‌ర్ల వ‌ర‌కే రైతులు వెళ్లాలి. స‌బ్‌స్టేష‌న్ల‌న్నీ వేరేవాళ్ల‌కు పోతున్న‌య్‌. అవి రైతుల‌కు ఉండ‌డం లేదు. ఏం చూసినా ట్రన్స్‌ఫార్మ‌ర్ ద‌గ్గ‌ర‌కు పోయి తొంగి చూసి రావాలి త‌ప్పా ఏం చేయ‌లేని ప‌రిస్థితి ఉంట‌ది అని జ‌గ‌దీశ్‌రెడ్డి తెలిపారు.

తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నం..

క‌రెంటు పోతే లైన్‌మెన్ ను త‌ప్పా వేరే ఎవ‌రినీ అడిగే అవ‌కాశం ఉండ‌దు. గ‌తంలో క‌రెంటు పోతే ఏఈ, డీఈకి ఫోన్ చేసి కరెంటు తెప్పిచ్చుకున్న‌మ‌ని ఇదే ముఖ్య‌మంత్రి చెప్పిండు. ఇప్పుడు అలా ఫోన్ చేసే ప‌రిస్థితి ఉండ‌దు. అంత దుర్మార్గ‌మైన చ‌ట్టం తీసుకొస్తుండు. ఇది రైతుల‌కు ఉరి వేసే డిస్కం త‌ప్పా ఇంకోటి కాదు. దీన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేర‌కు రాత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేశాం అని జ‌గ‌దీశ్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement