త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha | నేన్ గెల‌వంగ‌నే నా ఎన‌కాల్నే టీఆర్ఎస్‌ల‌కొచ్చిండు.. ఆ జెండాతోటి మ‌ళ్ల ఇటొచ్చిండు

Konda Surekha | ఇటీవ‌ల త‌ర‌చూ వార్తల్లో నిలిచిన మాజీ మంత్రి, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను వ‌రంగ‌ల్‌లో గెల‌వంగ‌నే క‌డియం శ్రీ‌హ‌రి నాతోపాటే 2014లో టీఆర్ఎస్‌లోకి వ‌చ్చి ఎమ్మెల్సీ తీసుకున్నాడ‌న్నారు. ప‌ద‌వొచ్చినంక గుండు సుధారాణి క‌నీసం ఫోన్ కూడా చేయ‌లేద‌న్నారు.

S

Telangana | Published On Sep 13, 2026, 3.20 pm IST

Konda Surekha | నేన్ గెల‌వంగ‌నే నా ఎన‌కాల్నే టీఆర్ఎస్‌ల‌కొచ్చిండు.. ఆ జెండాతోటి మ‌ళ్ల ఇటొచ్చిండు
Advertisement
  • గుండు సుధారాణికి చైర్మ‌న్ ప‌ద‌వి రాసిచ్చినం
  • ప‌ద‌వొచ్చినంక ఆమె ఫోన్ గూడా చేయ‌లే
  • వ‌రంగ‌ల్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఎమ్మెల్యే కొండా సురేఖ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Konda Surekha | త్రినేత్ర‌.న్యూస్: ఇటీవ‌ల త‌ర‌చూ వార్తల్లో నిలిచిన మాజీ మంత్రి, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను వ‌రంగ‌ల్‌లో గెల‌వంగ‌నే క‌డియం శ్రీ‌హ‌రి నాతోపాటే 2014లో టీఆర్ఎస్‌లోకి వ‌చ్చి ఎమ్మెల్సీ తీసుకున్నాడ‌న్నారు. మ‌ళ్ల కాంగ్రెస్ అధికారంల‌కు రాంగ‌నే ఆ జెండాతోటి ఇక్క‌డికొచ్చిండ‌ని విమ‌ర్శించారు. ఇక గుండు సుధారాణికి కుడా చైర్మ‌న్ ప‌ద‌విని రాసిచ్చామ‌ని వ్యాఖ్యానించారు. ప‌ద‌వొచ్చాక క‌నీసం ఆమె ఫోన్ కూడా చేయ‌లేద‌న్నారు. ఈ మేర‌కు వ‌రంగ‌ల్‌లో ఆదివారం నిర్వ‌హించిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆమె మాట్లాడారు.

ఎత్తులు మాట్లాడుతున్నోళ్లంతా ఇక్క‌డే పుట్టి ఇక్క‌డే ఉంటున్న‌ట్టు మాట్లాడుతున్న‌రు. నేన్ వ‌రంగ‌ల్‌లో గెల‌వంగ‌నే కొన్నిరోజుల‌కు ఆ సో కాల్డ్‌ నాయ‌కుడు, మంత్రి నా ఎన‌కాల్నే టీఆర్ఎస్‌లోకొచ్చిండు. ఆడ ఎమ్మెల్సీ తీసుకున్న‌డు. మ‌ళ్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలకి రాంగ‌నే ఒక నెల రెండు నెల్లు కూడా ఆగ‌లేదు. అక్క‌డ గెల్సి ఆ జెండాతోటి ఇక్క‌డికొచ్చిండు.

ఒస్తొస్త‌ది లేక‌పోతే లేద‌న్నా..

మ‌రి ఇప్పుడున్న కొంత‌మంది ప‌ద‌వొచ్చినోళ్లు గూడా ఆరోజు మ‌నం అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచ‌న‌లో ఉంటే అన్న ద‌గ్గ‌ర‌కొచ్చిర్రు. అన్నా నువ్ స‌హ‌క‌రించాలే అని అడిగిర్రు. అవిశ్వాస తీర్మానం పెట్టొద్ద‌ని సుధారాణి దండం పెడితే ఆరోజు అవిశ్వాస తీర్మానం పెట్ట‌కుండా ఆపాడు. లేక‌పోతే ఆరోజే ఆమె ప‌ద‌వి పోయిండేది. మ‌ళ్లీ వ‌చ్చి ఆమెకేదో మంచి మాట‌లు చెప్పినం. కుడా చైర్మ‌న్ ఒస్తొస్త‌ది లేక‌పోతే లేద‌న్నా అని రాసి ఇయ్యి అని అడిగితే ఈరోజు అన్న ఉదార స్వ‌భావంతోటి రాసిచ్చిండు. క‌నీసం ప‌ద‌వొచ్చినంక మాకు ఫోన్ కూడా చేయ‌లే.

మా అనుచ‌రుల మీద గెలువ్ ఫ‌స్ట్‌..

బసవరాజు సారయ్య, నాయిని రాజేందర్ రెడ్డిలకు కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. మైక్ చూడక చాలా రోజులు అయిందని, మైక్ కనబడగానే ఊగిపోతున్నరు. బసవరాజు సారయ్య నా మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తా అంటున్నడు. ముందు మా అనుచరుల మీద కార్పొరేటర్‌గా గెలువు. నాయిని రాజేందర్ రెడ్డి ఆనాడు వినయ్ భాస్కర్‌ను తట్టుకోలేక నియోజకవర్గంలోని కార్యక్రమాలకు మమ్మల్ని బతిమాలి తీసుకెళ్లేటోడు. భద్రకాళి ఆలయ పదవి విషయంలో హంగామా చేసిన నాయిని రాజేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి కుడా పదవి పోతే మౌనంగా ఎందుకు ఉన్నడు?

కేసీఆర్‌ పిలిచి టికెట్ ఇచ్చిండు..

మంత్రి పదవి నుంచి తీసేసినందుకు బాధ లేదు. అకారణంగా తొలగించినందుకు బాధ‌నిపిస్తుంది. ప్రస్తుతం అవకాశవాద రాజకీయాలు ఎక్కువైన‌య్‌. ఎంపీపీ నుంచి మంత్రి స్థాయి వరకు వచ్చిన‌. కొందరు ఉదయం ఒకపార్టీలో ఉండి.. మధ్యాహ్నం మరో పార్టీలోకి వెళ్తున్నరు. మేం నమ్మిన రాజశేఖర్‌రెడ్డి కోసం గతంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన‌. కొందరు వార్డు మెంబర్‌గా కూడా రాజీనామా చేయరు. గతంలో కొందరు గుంటనక్కలు మాకు టికెట్‌ రాకుండా చేసిర్రు. కాంగ్రెస్‌లో టికెట్‌ రాకపోతే.. కేసీఆర్‌ పిలిచి వరంగల్‌ ఈస్ట్‌ టికెట్ ఇచ్చిండు. కేసీఆర్‌ టికెట్‌ ఇచ్చినందుకు అప్పుడు మంత్రిగా ఉన్న వ్యక్తిని ఓడ‌గొట్టినం. వరంగల్‌ ఈస్ట్‌లో మేం గెలిచినందుకే ప్రజలు ప్రశాంతంగా ఉన్న‌రు. కొండా మురళి ఉన్నారనే ధైర్యంతో ఉండేటోళ్లు.

అల్ల‌ర్లు చేయాల్నా అని ఫోన్లు చేసిర్రు..

బర్తరఫ్‌ తర్వాత అల్లర్లు చేయాల్నా అని కొందరు మాకు ఫోన్ చేసిర్రు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వారికి చెప్పిను. నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు. రేవంతన్నా.. నీలాంటి మాస్‌ లీడర్‌ కాంగ్రెస్‌కు అవసరమని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. అదృష్టంకొద్ది కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. నాకు మంత్రి పదవొచ్చింది. పదవి అనేది అలంకారమే. పదవి లేకున్నా పనులు చేయొచ్చు. మంత్రి పదవి పోయిందని ఇంట్లో కూర్చోం. ప్రజల్లోనే ఉంటాం. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుస్తాం అని సురేఖ అన్నారు.

ఇటీవల మంత్రి పదవి నుంచి సురేఖను తొలగించిన తర్వాత తొలిసారిగా కొండా సురేఖ, కొండా మురళీధర్‌రావు వరంగల్‌కు వచ్చారు. వరంగల్‌లోని నాయుడు ఫంక్షన్‌ హాల్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వరంగల్‌ తూర్పుతో పాటు పరకాల, భూపాలపల్లి ప్రాంతాల నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, మహిళా నాయ‌కురాళ్లు సమావేశానికి హాజరు కావ‌డంతో ప్రాధాన్యం సంత‌రించుకుంది. కొండా సురేఖ‌ను తిరిగి మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌ని కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేశారు.

సురేఖ‌కు ఢిల్లీ పిలుపు!

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఇటీవల కొండా సురేఖతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆమె సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సురేఖను ఢిల్లీకి రావాలని అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చినట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ కొన‌సాగుతోంది. సోమవారం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ పెద్దలను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement