త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Seethakka | గుత్తికోయ‌లను గాయ‌ప‌రిచారు.. మాన‌వ‌తా దృక్పథంతో న్యాయం చేయండి

Seethakka | గుత్తికోయ‌ల జీవ‌నోపాధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని మంత్రి సీత‌క్క అట‌వీ శాఖ మంత్రి కొండా సురేఖ‌ను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండ‌లంలోని మనుబోతులగూడెంలో పోడు భూముల వ్యవహారంలో గుత్తికోయలకు, అటవీశాఖ అధికారులకు మధ్య జరిగిన ఘర్షణ విష‌యాన్ని సీతక్క కొండా సురేఖ దృష్టికి తీసుకొచ్చారు.

S

Telangana | Published On Jul 19, 2026, 1.41 pm IST

Seethakka | గుత్తికోయ‌లను గాయ‌ప‌రిచారు.. మాన‌వ‌తా దృక్పథంతో న్యాయం చేయండి
Advertisement
  • అట‌వీ శాఖ మంత్రి కొండా సురేఖ‌కు మంత్రి సీత‌క్క విజ్ఞ‌ప్తి
  • వెంట‌నే నివేదికివ్వాల‌ని అధికారుల‌కు సురేఖ ఆదేశం

Seethakka | త్రినేత్ర‌.న్యూస్‌: గుత్తికోయ‌ల జీవ‌నోపాధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని మంత్రి సీత‌క్క అట‌వీ శాఖ మంత్రి కొండా సురేఖ‌ను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండ‌లంలోని మనుబోతులగూడెంలో పోడు భూముల వ్యవహారంలో గుత్తికోయలకు, అటవీశాఖ అధికారులకు మధ్య జరిగిన ఘర్షణ విష‌యాన్ని సీతక్క కొండా సురేఖ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ సంద‌ర్భంగా సీత‌క్క మాట్లాడారు. ఈ ఘటనలో గుత్తికోయలు ఇబ్బందిపడ్డారు. గుత్తికోయల సమస్యలను సానుభూతితో పరిగణనలోకి తీసుకోవాలి. అడవుల పరిరక్షణతో పాటు వారి జీవన హక్కులు కూడా కాపాడేలా తగిన నిర్ణయాలు తీసుకోవాలి అని మంత్రి సీతక్క కోరారు.

దీనిపై మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ వెంటనే అటవీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుంటానని సీతక్కకు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అడవుల సంరక్షణ ప్రభుత్వ ప్రాధాన్యం అయినప్పటికీ, జీవనోపాధి కోసం అడవులను ఆశ్రయిస్తున్న గిరిజనులు, గుత్తికోయల సమస్యలపై సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అడవుల పరిరక్షణతో పాటు గిరిజనుల హక్కులు, సంక్షేమం, జీవనోపాధికి సమాన ప్రాధాన్యం ఇస్తుందని సురేఖ పేర్కొన్నారు. స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించడంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని ఆమె పేర్కొన్నారు.

మనుబోతులగూడెం, వేములూరు గ్రామాల్లో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు జేసీబీలతో ట్రెంచులు తవ్వుతుండగా ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో అటవీ శాఖ సిబ్బంది, మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కొందరు గిరిజన మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి సీతక్క స్పందించారు. మరోవైపు సిబ్బందిపైనే దాడికి దిగడంతో ఆత్మరక్షణ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

Advertisement
Advertisement