త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

GST Income | రాష్ట్రంలో జీఎస్టీ రాబడులను పెంచడంతో పాటు పన్నుల వ్యవస్థలోని లోపాలు, లీకేజీలను అరికట్టేందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో విస్తృతంగా చర్చించారు.

P

Telangana | Published On Aug 7, 2026, 8.50 pm IST

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
Advertisement
  • రాబడుల పెంపు, లీకేజీల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
  • సీఎం రేవంత్‌తో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ

GST Income | రాష్ట్రంలో జీఎస్టీ రాబడులను పెంచడంతో పాటు పన్నుల వ్యవస్థలోని లోపాలు, లీకేజీలను అరికట్టేందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో విస్తృతంగా చర్చించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లోని బోధి పెవిలియన్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై ప్రధానంగా చర్చించారు. జీఎస్టీ అధికారులకు ఏఐ ఆధారిత సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి పన్నుల నిర్వహణను మరింత సమర్థంగా మార్చాలని సీఎం సూచించారు.

అదే సమయంలో వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సులభతర వాణిజ్యానికి భంగం కలగకుండా వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అరవింద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచుతూనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు అనుకూలంగా టెక్నాలజీని వినియోగించే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. భవన నిర్మాణ రంగంలో పన్నుల లీకేజీలను అరికట్టేందుకు మున్సిపల్, రేరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ ఆధారిత సమాచార సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు అనుమతులు మంజూరు చేసే దశలోనే నిర్మాణ సామగ్రి అవసరాలు, వాటికి సంబంధించిన పన్నుల అంచనాలను నమోదు చేసే విధానాన్ని అమలు చేయాలని సూచించారు.

మీసేవ, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సమీకృత డేటా వ్యవస్థలో అనుసంధానం చేస్తే పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమావేశంలో సీఎం సలహాదారు కె రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, కమర్షియల్ టాక్స్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement