త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

National Handloom Day | చేనేత రంగం పున‌రుజ్జీవానికి ప్రాధాన్యం : మంత్రి తుమ్మ‌ల‌

National Handloom Day | దేశానికి అన్నం అందించే రైతన్నకు, వస్త్రం అందించే నేతన్నకు సమాన ప్రాధాన్యం ఇస్తూ వారి సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం కట్టుబడి పనిచేస్తుంద‌ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు సంక్షేమంతో పాటు చేనేత రంగ పునరుజ్జీవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.

P

Telangana | Published On Aug 7, 2026, 3.29 pm IST

National Handloom Day | చేనేత రంగం పున‌రుజ్జీవానికి ప్రాధాన్యం : మంత్రి తుమ్మ‌ల‌
Advertisement

National Handloom Day | దేశానికి అన్నం అందించే రైతన్నకు, వస్త్రం అందించే నేతన్నకు సమాన ప్రాధాన్యం ఇస్తూ వారి సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం కట్టుబడి పనిచేస్తుంద‌ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు సంక్షేమంతో పాటు చేనేత రంగ పునరుజ్జీవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో మంత్రి సీత‌క్క‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారాలకు ఎంపికైన కళాకారులను సత్కరించి అభినందించారు. చేనేత రంగ అభివృద్ధికి వారు అందిస్తున్న సేవలు యువతకు ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు.

అనంతరం పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత కళాకారులు ఏర్పాటు చేసిన 100కు పైగా స్టాల్స్‌ను సందర్శించి వస్త్రాలను పరిశీలించారు. సంప్రదాయ నైపుణ్యాన్ని ఆధునిక డిజైన్లతో మేళవించి రూపొందించిన ఉత్పత్తులను ఆయన ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రదర్శన ఆగస్టు 7 నుంచి 16 వరకు కొనసాగుతుందని, ప్రజలు పెద్ద సంఖ్యలో సందర్శించి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా నేతన్నలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చేనేత కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వానికి ప్రతీక అని అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అంతరించిపోతున్న సంప్రదాయ చేనేత కళలకు పునర్వైభవం తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

తెలంగాణ చేనేత ఉత్పత్తులు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందాయని మంత్రి తెలిపారు. గద్వాల చీరలు, పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట వస్త్రాలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్ దర్రీస్, కరీంనగర్ బెడ్‌షీట్లు రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చాయని చెప్పారు. సంప్రదాయాన్ని ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చేనేత రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. చేనేత కార్మికుల జియో ట్యాగింగ్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) ద్వారా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఆ సంస్థలో శిక్షణ పొందిన వగ్గు శ్రీరామ్ రూపొందించిన ‘ఎర్గోనామిక్ బ్యాక్ సపోర్ట్ సిస్టమ్’ జాతీయ స్థాయిలో తొలి బహుమతి సాధించడం రాష్ట్ర చేనేత శిక్షణా వ్యవస్థ ప్రతిభకు నిదర్శనమని అన్నారు.

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పథకాల వివరాలను కూడా మంత్రి వెల్లడించారు. నేతన్న పొదుపు పథకాన్ని రెండేళ్ల కాలపరిమితితో అమలు చేస్తున్నామని, నేతన్నకు భద్రత పథకం ద్వారా మరణించిన చేనేత కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం అందిస్తున్నామని తెలిపారు. చేనేత రుణమాఫీ కోసం రూ.49.27 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. అలాగే నేతన్న భరోసా పథకం కింద చేనేత కార్మికులకు ఏటా రూ.18 వేల చొప్పున, అనుబంధ కార్మికులకు రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు రూ.15 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకట్ రమణ, టెస్కో అధికారులు, చేనేత రంగ ప్రముఖులు, అవార్డు గ్రహీతలు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement