త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana 3rd DISCOM | తెలంగాణలో రైతు డిస్కం.. మూడో డిస్కం సీఎండీగా ముషారఫ్ అలీ ఫరూఖీ

తెలంగాణలో విద్యుత్ పంపిణీ కోసం టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL), టీజీఎన్‌పీడీసీఎల్ (TGNPDCL) లతో పాటు అదనంగా ప్రభుత్వం మూడో డిస్కంను ఏర్పాటు చేసింది. కొత్త డిస్కం పేరు 'తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL)'. దీన్ని సాధారణంగా 'రైతు డిస్కం' (Rythu DISCOM) గా పిలుస్తారు.

J

Telangana | Published On Mar 11, 2026, 4.34 pm IST

Telangana 3rd DISCOM | తెలంగాణలో రైతు డిస్కం.. మూడో డిస్కం సీఎండీగా ముషారఫ్ అలీ ఫరూఖీ
Advertisement

వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు

Telangana 3rd DISCOM | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ పంపిణీ చేస్తున్న రెండు డిస్కంలకు (TGSPDCL, TGNPDCL) అదనంగా మూడో డిస్కంను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు (G.O.Ms.No.4) జారీ చేసింది.

'రైతు డిస్కం'గా నామకరణం

కొత్తగా ఏర్పాటు చేసిన ఈ మూడో డిస్కంకు "తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్" (TGRPDCL) అని నామకరణం చేశారు. దీన్ని 'రైతు డిస్కం' (Rythu DISCOM) అని కూడా పిలుస్తారు. ఈ నూతన సంస్థకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా (CMD) యువ ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ ఫరూఖీని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఈ సంస్థ రిజిస్టర్డ్ ఆఫీసును ఏర్పాటు చేయనున్నారు.

కొత్త డిస్కం లక్ష్యం ఇదే..

సాధారణ గృహ, వాణిజ్య అవసరాలకు కాకుండా.. కేవలం వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన విద్యుత్ పంపిణీ, నిర్వహణ కోసం మాత్రమే ఈ మూడో డిస్కంను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వ్యవసాయ కనెక్షన్లు, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ / సీపీడబ్ల్యూఎస్, హైదరాబాద్ జలమండలి, మున్సిపల్ వాటర్ కనెక్షన్లు లాంటి విభాగాలకు టీజీఆర్‌పీడీసీఎల్ విద్యుత్ సరఫరా చేస్తుంది.

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు వీళ్లే

కొత్తగా ఏర్పాటైన టీజీఆర్‌పీడీసీఎల్‌కు సీఎండీగా ముషారఫ్ అలీ ఫరూఖీ వ్యవహరించనుండగా.. డైరెక్టర్లుగా వంటేరు తిరుపతి రెడ్డి, పి.కృష్ణారెడ్డి, వంగూరు మోహన్ రావు, ఎన్.నరసింహులు వ్యవహరించనున్నారు. ఈ సంస్థను రూ.5 కోట్ల ప్రారంభ మూలధనంతో ఏర్పాటు చేశారు. ఈ నిధులను ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలు సమానంగా సమకూర్చనున్నాయి.

కొత్త వ్యవసాయ కనెక్షన్ల జారీ, విద్యుత్ కొనుగోళ్లు, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందించడం ఈ 'రైతు డిస్కం' ప్రధాన బాధ్యతగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

https://x.com/JacobBhoompag/status/2031672170280264087

 

Advertisement
Advertisement