త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్‌ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ కుమార్‌ తీవ్ర విమర్శలు చేశారు. కాగ్‌ నివేదికలోని గణాంకాలను ఉటంకిస్తూ రాష్ట్ర ఖజానాపై పెరుగుతున్న భారం, రెవెన్యూ లోటు, అప్పులు, వడ్డీలు, పెన్షన్లు, పెట్టుబడి వ్యయంపై ప్రశ్నలు లేవనెత్తారు. 2026–27 బడ్జెట్‌లో రూ.6,857.76 కోట్ల రెవెన్యూ మిగులును అంచనా వేసినప్పటికీ, ఆగస్టు నాటికి రూ.14,840.81 కోట్ల రెవెన్యూ లోటు నమోదైందని ఆయన పేర్కొన్నారు.

P

Telangana | Published On Sep 16, 2026, 8.10 pm IST

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్‌ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
Advertisement

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ కుమార్‌ తీవ్ర విమర్శలు చేశారు. కాగ్‌ నివేదికలోని గణాంకాలను ఉటంకిస్తూ రాష్ట్ర ఖజానాపై పెరుగుతున్న భారం, రెవెన్యూ లోటు, అప్పులు, వడ్డీలు, పెన్షన్లు, పెట్టుబడి వ్యయంపై ప్రశ్నలు లేవనెత్తారు. 2026–27 బడ్జెట్‌లో రూ.6,857.76 కోట్ల రెవెన్యూ మిగులును అంచనా వేసినప్పటికీ, ఆగస్టు నాటికి రూ.14,840.81 కోట్ల రెవెన్యూ లోటు నమోదైందని ఆయన పేర్కొన్నారు.

ఐదు నెలల్లో రూ.21 వేల కోట్ల ప్రాథమిక లోటు

మేలో రూ.5,038.34 కోట్లు, జూన్‌లో రూ.12,289.38 కోట్లు, జూలైలో రూ.19,266.83 కోట్ల రెవెన్యూ లోటు నమోదైనట్లు శ్రవణ్‌ తెలిపారు. ఐదు నెలల్లో ప్రాథమిక లోటు రూ.21,110.73 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. అప్పులపై వడ్డీల కోసం ఐదు నెలల్లోనే రూ.13,174.49 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఏడాది మొత్తానికి వడ్డీల కోసం కేటాయించిన రూ.21,304.39 కోట్లలో ఇది 61.84 శాతమని పేర్కొన్నారు. పెన్షన్ల కోసం కేటాయించిన రూ.14,736.56 కోట్లలో ఆగస్టు నాటికే రూ.12,487.73 కోట్లు ఖర్చయ్యాయని తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ రాబడి రూ.77,535.89 కోట్లు కాగా.. వడ్డీలు, పెన్షన్లు, జీతాలకు కలిపి రూ.47,198.71 కోట్లు ఖర్చవుతున్నాయని శ్రవణ్‌ పేర్కొన్నారు. అంటే రాష్ట్రానికి వచ్చే ప్రతి రూపాయిలో సుమారు 60.8 పైసలు ఈ మూడు ఖర్చులకే వెళ్తున్నాయని వివరించారు.

150 రోజుల్లో రూ.34 వేల కోట్ల అప్పు

2026–27 ఆర్థిక సంవత్సరానికి నికర అప్పుల పరిమితి రూ.58,458.71 కోట్లుగా ఉండగా, 150 రోజుల్లోనే రూ.34,285.21 కోట్ల నికర అప్పులు చేసినట్లు శ్రవణ్‌ తెలిపారు. ఇది వార్షిక పరిమితిలో 58.65 శాతమని పేర్కొన్నారు. ప్రభుత్వం అంచనా వేసిన పన్నుయేతర ఆదాయం, కేంద్ర గ్రాంట్లు, మద్యం, రిజిస్ట్రేషన్లు, భూ ఆదాయంలో లక్ష్యాలకు అనుగుణంగా రాబడులు రావడం లేదని ఆయన వివరించారు. పన్నుయేతర ఆదాయంలో రూ.35,730.20 కోట్ల లక్ష్యానికి రూ.5,475.65 కోట్లు, కేంద్ర గ్రాంట్లలో రూ.24,166 కోట్ల లక్ష్యానికి రూ.2,962.82 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలిపారు.

క్యాపిటల్‌ వ్యయంపై ప్రశ్నలు

పెట్టుబడి వ్యయం కింద బడ్జెట్‌లో రూ.47,267.28 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు రూ.12,412.53 కోట్లు మాత్రమే ఖర్చయినట్లు శ్రవణ్‌ పేర్కొన్నారు. ఇది 26.26 శాతానికి సమానమని తెలిపారు. గతేడాది ఇదే సమయంలో పెట్టుబడి వ్యయం 39.28 శాతంగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది గణనీయంగా తగ్గిందని విమర్శించారు. సామాజిక రంగంలో క్యాపిటల్‌ వ్యయం రూ.4,332.36 కోట్లతో 22.55 శాతానికి, సాధారణ రంగంలో రూ.351.22 కోట్లతో 14.99 శాతానికి పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement