త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Petrol-Diesel Price | పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గొచ్చు..! సంకేతాలిచ్చిన కేంద్ర‌మంత్రి హ‌ర్దీప్ సింగ్

Petrol-Diesel Price | దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీని ఖర్చు కన్నా తక్కువ ధరలకు విక్రయించాల్సి రావడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీ గురువారం వెల్లడించారు. జూన్ 30 వరకు ఈ నష్టాలు రూ.74,781 కోట్లకు చేరుకున్నాయని ఆయన తెలిపారు.

P

National | Published On Jul 2, 2026, 7.47 pm IST

Petrol-Diesel Price | పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గొచ్చు..! సంకేతాలిచ్చిన కేంద్ర‌మంత్రి హ‌ర్దీప్ సింగ్
Advertisement

Petrol-Diesel Price | దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీని ఖర్చు కన్నా తక్కువ ధరలకు విక్రయించాల్సి రావడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీ గురువారం వెల్లడించారు. జూన్ 30 వరకు ఈ నష్టాలు రూ.74,781 కోట్లకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. వెస్ట్ ఆసియా ప్రాంతంలో ఉద్రిక‌త్త‌త‌ల నేపథ్యంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ, ప్రస్తుతం ధరలు కొంత తగ్గాయని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికీ కంపెనీలు ఆ సమయంలో ఎక్కువ ధరలకు కొనుగోలు చేసిన ముడి చమురునే శుద్ధి చేస్తున్నాయని ఆయన వివరించారు.

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గుతాయా? అన్న ప్ర‌శ్న‌కు కేంద్ర‌మంత్రి స్పందించారు. “ఇది సరైన ప్రశ్నే. కానీ, వచ్చే కొన్ని వారాల్లో ధరలు తక్కువగానే ఉంటేనే దానిపై మాట్లాడొచ్చు” అన్నారు. “మేం ఇప్పుడుపయోగిస్తున్న ముడి చమురు రెండు నెలల క్రితం కొనుగోలు చేసింది. ధరలు ఇంకా 2–3 నెలలు త‌క్కువ‌గా ఉంటే పరిస్థితి మారొచ్చు. కానీ అది ఇప్పటికీ ఊహాగానమే” అని స్పష్టం చేశారు. ఉద్రిక్త‌త‌ల స‌మ‌యంలో అభివృద్ధి చెందిన దేశాల్లో పెట్రోల్ ధరలు సుమారు 20 శాతం పెరిగితే.. భారత పొరుగు దేశాల్లో ఇది 35 శాతానికి చేరిందని మంత్రి తెలిపారు. అయితే, భారత్‌లో మాత్రం పెరుగుదల కేవలం 5.58 శాతం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. “దేశవ్యాప్తంగా ఉన్న 1,07,000 రిటైల్ అవుట్‌లెట్లలో ఎలాంటి సరఫరా అంతరాయం లేకుండా సేవలు కొనసాగించాం” అని చెప్పారు. ఇదే సమయంలో ప్రైవేట్ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ జులై 1 నుంచి తన నెట్‌వర్క్‌లో పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గించింది. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడం ప్రారంభమైన తర్వాత వచ్చిన తొలి ప్రధాన ధర తగ్గింపుగా దీన్ని భావిస్తున్నారు.

అయితే, నయారా గతంలో సంక్షోభ సమయంలో ధరలను పెంచిన నేపథ్యంలో తాజాగా త‌గ్గించింద‌ని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆ సమయంలో ధరలు పెంచలేదని ఆయన గుర్తుచేశారు. ఇరాన్–వెస్ట్ ఆసియా ఘర్షణ సమయంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లకు పైగా చేరడంతో భారత ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై పూర్తిగా మోపకుండా తాము భరిస్తూ వచ్చాయి. జూన్ రెండో అర్ధభాగంలో అమెరికా–ఇరాన్ ఒప్పందం తర్వాతే ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. సాధారణంగా ఆయిల్ కంపెనీలు ముడి చమురును కనీసం రెండు నెలల ముందుగానే కొనుగోలు చేస్తాయి. ప్రస్తుతం శుద్ధి చేస్తున్న చమురు ఏప్రిల్, మే ప్రారంభంలో అధిక ధరల సమయంలో కొనుగోలు చేసినదేనని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

Advertisement
Advertisement