త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Cabinet | వర్షాభావ ప‌రిస్థితుల‌పై కేంద్రానికి లేఖ‌.. ధరణి అక్రమాలపై సిట్.. పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం

TG Cabinet | రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ధరణి పోర్టల్ అక్రమాల విచారణ, ఇంజినీరింగ్ పనుల పర్యవేక్షణ, మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాల సవరణలు, హైస్పీడ్ రైలు కారిడార్లు, ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకం తదితర అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది.

P

Telangana | Published On Jul 17, 2026, 9.46 pm IST

TG Cabinet | వర్షాభావ ప‌రిస్థితుల‌పై కేంద్రానికి లేఖ‌.. ధరణి అక్రమాలపై సిట్.. పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం
Advertisement

TG Cabinet | రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ధరణి పోర్టల్ అక్రమాల విచారణ, ఇంజినీరింగ్ పనుల పర్యవేక్షణ, మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాల సవరణలు, హైస్పీడ్ రైలు కారిడార్లు, ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకం తదితర అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ శుక్ర‌వారం స‌మావేశ‌మైంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో దాదాపు 40 శాతం వర్షపాతం లోటు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపాలని కేబినెట్ నిర్ణయించింది.

పంటలు, తాగునీరు, సాగునీరు, విద్యుత్, ఉపాధిపై వర్షాభావ ప్రభావాన్ని వివరిస్తూ కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపాలని, ఎల్‌నినో కంటింజెన్సీ ప్రణాళికల అమలుకు ఆర్థిక సాయం అందించాలని కోరనుంది. తాగునీటి కొరత తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించాలని, ప్రాజెక్టుల్లోని నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యంగా వినియోగించాలని నిర్ణయించింది. రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించడంతో పాటు ఎల్‌నినోపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది.

ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందం (ఎస్‌ఈటీ) ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ఆమోదించింది. 2020 అక్టోబర్ 29 నుంచి జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, ప్రభుత్వ, అసైన్డ్ భూముల బదలాయింపులు సహా అన్ని అనుమానాస్పద లావాదేవీలను విచారించాలని నిర్ణయించింది. ఫోరెన్సిక్ ఆడిట్‌లో 10 వేలకుపైగా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన నేపథ్యంలో పోర్టల్ నిర్వహణ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ పాత్ర, టెండర్ ప్రక్రియ, డేటా భద్రతలో లోపాలపై కూడా విచారణ జరపనుంది. ప్రభుత్వ ఇంజినీరింగ్ పనుల్లో అంచనా వ్యయం, తుది వ్యయం మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రాజెక్టు ప్రతిపాదనల నుంచి భూసేకరణ, టెండర్లు, బిల్లుల చెల్లింపుల వరకు ఏకీకృత విధానం రూపొందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయనుంది.

సామాజిక సమానత్వానికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేలా తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019లో సవరణకు ఆమోదం తెలిపింది. అలాగే గ్రామపంచాయతీల నిధులను ట్రెజరీతో పాటు జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేసుకునేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో మార్పులకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్‌ను ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలతో అనుసంధానించే మూడు హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్‌మెంట్లు, స్టేషన్‌ల స్థానాలను కేబినెట్ పరిశీలించింది. శంషాబాద్ సమీపంలో రైల్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గోదావరి నదిపై కన్నెపల్లి నుంచి 4.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసి మంథని నియోజకవర్గంలోని 45 వేల ఎకరాలకు సాగునీరు అందించే ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం) పూర్తి చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

Advertisement
Advertisement