త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Project Safe Stay | ప్రాజెక్ట్ సేఫ్ స్టేకు శ్రీకారం.. హాస్టళ్లు, పీజీల నమోదు ఇక తప్పనిసరి..!

Project Safe Stay | నగరంలోని మహిళా హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతుల నిర్వహణపై హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం నగరానికి వచ్చే మహిళలు, విద్యార్థినుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ‘ప్రాజెక్ట్ సేఫ్ స్టే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

P

Hyderabad | Published On Jul 17, 2026, 9.15 pm IST

Project Safe Stay | ప్రాజెక్ట్ సేఫ్ స్టేకు శ్రీకారం.. హాస్టళ్లు, పీజీల నమోదు ఇక తప్పనిసరి..!
Advertisement

Project Safe Stay | నగరంలోని మహిళా హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతుల నిర్వహణపై హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం నగరానికి వచ్చే మహిళలు, విద్యార్థినుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ‘ప్రాజెక్ట్ సేఫ్ స్టే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక నుంచి మహిళా హాస్టళ్లు, పీజీలు తప్పనిసరిగా పోలీసుల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో శుక్రవారం హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సంయుక్తంగా ‘సురక్ష నివాస్ 1.0’ మార్గదర్శకాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం హాస్టల్, పీజీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి భద్రతా ప్రమాణాలపై సూచనలు చేశారు.

సీపీ సజ్జనర్ మాట్లాడుతూ ప్రతి మహిళా హాస్టల్, పీజీ నిర్వాహకులు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. నిర్వహణకు సంబంధించి నిర్దేశిత ఫామ్-ఏను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. నగరంలోని 447 మహిళా హాస్టళ్లలో ప్రత్యేక బృందాలతో నిర్వహించిన తనిఖీల్లో పలు భద్రతా లోపాలు గుర్తించినట్లు సీపీ వెల్లడించారు. 97.5 శాతం హాస్టళ్లలో సీసీటీవీలు ఉన్నప్పటికీ, కేవలం 43 శాతం వసతి గృహాల్లోనే సరైన కాంపౌండ్ వాల్స్ ఉన్నాయని తెలిపారు. అగ్నిమాపక పరికరాలు 38.9 శాతం హాస్టళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చేందుకే కొత్త నిబంధనలు తీసుకొస్తున్నామని, నిర్వాహకులను ఇబ్బంది పెట్టడం లక్ష్యం కాదని సీపీ స్పష్టం చేశారు. త్వరలో మహిళా భద్రత కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున భవనాలను అద్దెకు తీసుకుని హాస్టళ్లుగా నిర్వహించడం వ్యాపార పరిధిలోకి వస్తుందని, నిర్వాహకులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ పొందాలని సూచించారు. భోజన సదుపాయాలు కల్పించే హాస్టళ్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ తప్పనిసరి అని తెలిపారు. హాస్టళ్లలోకి వచ్చే, వెళ్లే వారి వివరాలను నమోదు చేయడంతో పాటు, అక్కడ పనిచేసే సిబ్బందికి భద్రతా తనిఖీలు నిర్వహించాలని అధికారులు సూచించారు. కేవలం సీసీటీవీలు ఏర్పాటు చేయడం కాకుండా అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా పర్యవేక్షించాలని పేర్కొన్నారు.

అగ్నిమాపక శాఖ అధికారులు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలపై సూచనలు చేశారు. ప్రతి హాస్టల్‌లో ఫైర్ ఎక్స్‌టింగిషర్లు, అత్యవసర మార్గాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. వంటశాలల్లో పరిశుభ్రత పాటించాలని, ఆహార నాణ్యతలో రాజీ పడితే చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. హాస్టల్ నిర్వహణను కేవలం వ్యాపారంగా కాకుండా బాధ్యతాయుతమైన సేవగా చూడాలని హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు సూచించారు. భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారా నిర్వాహకులకు విశ్వసనీయత పెరుగుతుందని తెలిపారు.

Advertisement
Advertisement