త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Rajanarsimha | తలసేమియాపై అవగాహన క‌ల్పించాలి.. మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు..

Minister Rajanarsimha | వరల్డ్ తలసేమియా డే సందర్భంగా తలసేమియా, సికిల్‌సెల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవేర్‌నెస్ వాక్‌ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి, తలసేమియా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, వైద్యులు, యువతతో కలిసి వాక్‌లో పాల్గొన్నారు.

P

Telangana | Published On May 8, 2026, 4.11 pm IST

Minister Rajanarsimha | తలసేమియాపై అవగాహన క‌ల్పించాలి.. మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు..
Advertisement

Minister Rajanarsimha | వరల్డ్ తలసేమియా డే సందర్భంగా తలసేమియా, సికిల్‌సెల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవేర్‌నెస్ వాక్‌ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి, తలసేమియా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, వైద్యులు, యువతతో కలిసి వాక్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది కేవలం అవేర్‌నెస్ వాక్ మాత్రమే కాదని, తలసేమియా, సికిల్‌సెల్, ఇతర జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధులపై సమాజంలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యమన్నారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తలసేమియా, సికిల్‌సెల్ సొసైటీ సేవలను ప్రత్యేకంగా అభినందించారు. బాధితులు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

నివారించగలిగే వ్యాధులతో ఏ చిన్నారి కూడా బాధపడకూడదని మంత్రి అన్నారు. అవగాహన లేకపోవడం, సరైన సమయంలో నిర్ధారణ జరగకపోవడం, చికిత్స అందకపోవడం వల్ల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందన్నారు. తలసేమియా అంటువ్యాధి కాదని, ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అని వివరించారు. సమీప బంధువుల మధ్య వివాహాలు జరిగే సందర్భాల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అందుకే వివాహానికి ముందు యువత తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించారు. కొత్తగా వివాహమైన దంపతులు కూడా జన్యుపరమైన వ్యాధులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తలసేమియా, ఇతర జన్యుపరమైన వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే సికిల్‌సెల్ వ్యాధిపై దాదాపు 11 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్సతో పాటు అవసరమైన మందులు అందిస్తున్నామని పేర్కొన్నారు.

తలసేమియా బాధితులకు క్రమం తప్పకుండా రక్త మార్పిడి అవసరమవుతుందని, ఐరన్ చెలేషన్ థెరపీ వంటి చికిత్సలు కూడా అవసరమవుతాయని మంత్రి వివరించారు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరం అవుతుందని, ఈ చికిత్సల ఖర్చు కుటుంబాలపై భారీ భారం అవుతోందన్నారు. ఈ నేపథ్యంలో తలసేమియా, ఇతర రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి అన్ని దశల్లో అండగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్స్, అవసరమైన మందులు, అధునాతన చికిత్స సౌకర్యాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో తలసేమియా, సికిల్‌సెల్ కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో హిమోగ్లోబినోపథీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

అదేవిధంగా తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతర సేవలు అందించేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో డే కేర్ సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. అవగాహన, స్క్రీనింగ్, నివారణ, నాణ్యమైన చికిత్స ద్వారా తెలంగాణను దేశంలోనే తొలి తలసేమియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ అవేర్‌నెస్ వాక్ ద్వారా తలసేమియా, సికిల్‌సెల్ బాధితులు ఒంటరిగా లేరనే సందేశాన్ని సమాజానికి అందిస్తున్నామని అన్నారు. ఆరోగ్యకరమైన భావితరాల కోసం ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తలసేమియా–సికిల్‌సెల్ సొసైటీ ప్రతినిధులు, పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు, రక్తదాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement