త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Nadu | త‌మిళ‌నాడు రైతుల‌కు విజ‌య్ గుడ్‌న్యూస్‌.. రూ.75వేల దాకా పంట రుణాల‌మాఫీ

Tamil Nadu | త‌మిళ‌నాడు రైతుల‌కు ముఖ్య‌మంత్రి విజ‌య్ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. రైతుల రుణాల మాఫీపై అసెంబ్లీ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పంట‌ల రుణాల మాఫీని ప‌రిధిని విస్త‌రిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. దాదాపు 13.34 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ. 6,220కోట్ల రుణాల‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

P

Telangana | Published On Aug 17, 2026, 3.36 pm IST

Tamil Nadu | త‌మిళ‌నాడు రైతుల‌కు విజ‌య్ గుడ్‌న్యూస్‌.. రూ.75వేల దాకా పంట రుణాల‌మాఫీ
Advertisement
  • అసెంబ్లీలో ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌

Tamil Nadu | త‌మిళ‌నాడు రైతుల‌కు ముఖ్య‌మంత్రి విజ‌య్ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. రైతుల రుణాల మాఫీపై అసెంబ్లీ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పంట‌ల రుణాల మాఫీని ప‌రిధిని విస్త‌రిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. దాదాపు 13.34 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ. 6,220కోట్ల రుణాల‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతులపై ఉన్న భారాన్ని త‌గ్గించేందుకే తీప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చిన‌ట్లుగా విజ‌య్ ప్ర‌క‌టించారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తికావస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రజల జీవనోపాధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ బలోపేతమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ‘‘తమిళనాడు ప్రజలే మా ప్రాణమైతే.. రైతులే మా జీవనాడి. రైతుల జీవనోపాధిని కాపాడటం, రుణభారం తగ్గించడం, వ్యవసాయాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత’’ అని అన్నారు.

రూ.75 వేల వరకు పూర్తి మాఫీ

సహకార బ్యాంకుల నుంచి రూ.75 వేల వరకు పంట రుణం తీసుకున్న రైతుల రుణాన్ని పూర్తిగా మాఫీ చేయనున్నట్లు విజ‌య్ వెల్లడించారు. రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఉన్న రుణాల విషయంలో గరిష్ఠంగా రూ.75వేల వరకు మాఫీ వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయంతో 2,38,264 మంది రైతులకు అదనంగా గరిష్టంగా రూ.40వేల వరకు ప్రయోజనం లభించనుంది. రూ.లక్షకు పైగా ఉన్న పంట రుణాలపై స్థిరంగా రూ.35 వేల రుణమాఫీ అందించనున్నట్లు సీఎం చెప్పారు. పథకం పరిధి విస్తరణతో అదనంగా రూ.953.06 కోట్లను కేటాయించాల్సి వస్తుందని తెలిపారు. దీంతో మొత్తం పంట రుణమాఫీ వ్యయం రూ.6,220 కోట్లకు చేరిందన్నారు.

ఇప్పటికే రూ.5,267 కోట్లు జమ

జూలై 31 నాటికి 13.34 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.5,267 కోట్లను జమ చేసినట్లు విజయ్‌ జోసెఫ్‌ తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమమన్న విధానంతో రూ.6,220 కోట్ల విలువైన పంట రుణమాఫీని అమలు చేస్తున్నామని చెప్పారు. మే 25న ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే రూ.50 వేల వరకు ఉన్న పంట రుణాలను తొలిసారిగా మాఫీ చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. అనంతరం రైతు సంఘాలతో విస్తృతంగా చర్చలు జరిపి జూన్‌ 19న పథకం పరిధిని మరింత విస్తరించామని తెలిపారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రుణభారం తగ్గించేందుకు ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.

Advertisement
Advertisement