త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UP Judge | యూపీ జ‌డ్జి సంచ‌ల‌నం.. నాలుగు నెల‌ల్లోనే 22 మందికి మ‌ర‌ణ‌శిక్ష‌

UP Judge | ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ (Muzaffarnagar) అద‌న‌పు జిల్లా, సెష‌న్స్ జ‌డ్జి (UP Judge) ర‌వి కుమార్ దివాక‌ర్ త‌న తీర్పుల‌తో వార్త‌ల్లో నిలిచారు. నాలుగు నెల‌ల్లోనే 10 కేసుల్లో కీల‌క తీర్పులు వెలువ‌రించిన ఆయ‌న ఏకంగా 22 మందికి మ‌ర‌ణ‌శిక్ష విధించ‌డం (22 Death Sentences) దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

D

National | Published On Aug 17, 2026, 4.47 pm IST

UP Judge | యూపీ జ‌డ్జి సంచ‌ల‌నం.. నాలుగు నెల‌ల్లోనే 22 మందికి మ‌ర‌ణ‌శిక్ష‌
Advertisement

UP Judge | త్రినేత్ర‌.న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ (Muzaffarnagar) ఫాస్ట్-ట్రాక్ కోర్టుకు చెందిన ఒక న్యాయమూర్తి (UP Judge) త‌న తీర్పుల‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. నాలుగు నెల‌ల్లోనే 10 కేసుల్లో కీల‌క తీర్పులు వెలువ‌రించారు. ఏకంగా 22 మందికి మ‌ర‌ణ‌శిక్ష (22 Death Sentences) విధించారు. కిడ్నాప్‌, దోపిడీ, హ‌త్య‌ వంటి కేసుల్లో దోషులుగా తేలిన వారికి ఈ శిక్ష విధించారు.

ముజఫర్‌నగర్ అద‌న‌పు జిల్లా, సెష‌న్స్ జ‌డ్జి ర‌వి కుమార్ దివాక‌ర్ (Ravi Kumar Diwakar).. 2022లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలో (Gyanvapi complex) వీడియో సర్వేకు ఆదేశించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. లక్నోకు చెందిన 46 ఏళ్ల ర‌వి కుమార్ 2009లో అజమ్‌గఢ్‌లో అదనపు సివిల్ జడ్జిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మే 2015లో సుల్తాన్‌పూర్‌లో సివిల్ జడ్జిగా, సుమారు ఐదు నెలల అనంతరం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా పదోన్నతి పొందారు. నవంబర్ 2025 నుంచి ముజఫర్‌నగర్‌లో అదనపు జిల్లా, సెషన్స్ కోర్డు జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగ‌స్టు మ‌ధ్య‌ ఆయ‌న 10 కేసుల్లో తీర్పులు వెలువ‌రించి.. 22 మందికి మ‌ర‌ణ‌శిక్ష విధించారు. 12 ఏళ్ల నాటి హ‌త్య కేసులో దోషులుగా తేలిన న‌లుగురికి ఆగ‌స్టు 13న మ‌ర‌ణ‌శిక్ష విధించారు. అంత‌కు ముందు రోజే అంటే ఆగ‌స్టు 12న‌ డ‌బ్బు కోసం ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి హ‌త్య చేసిన కేసులో ఓ వ్య‌క్తికి మ‌ర‌ణ‌దండ‌న విధించారు. షామ్లీ జిల్లాలో 2011లో దోపిడీ ప్ర‌య‌త్నంలో ఓ రైతును హ‌త్య చేసినందుకు గానూ జులై 17న న‌లుగురు వ్య‌క్తుల‌కు, జూలై 6న, 2010 నాటి ఒక హత్య కేసులో మాజీ గ్రామ సర్పంచ్, అత‌ని స‌హ‌చ‌రుడికి మ‌ర‌ణ శిక్ష విధించారు.

ఇలా ఏప్రిల్‌లో ఏడుగురికి, మే నెలలో ఒకరికి, జూన్‌లో ఇద్దరికి, జూలైలో ఏడుగురికి, ఆగస్టు 13 నాటికి ఐదుగురికి మొత్తంగా కేవ‌లం నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలోనే 22 మందికి మరణశిక్ష విధించారు. హత్య, హైవే దోపిడీ, ఆర్థిక లాభం కోసం కిడ్నాప్ చేసి హత్య చేయడం వంటి అత్యంత క్రూరమైన నేరాల్లో దోషులుగా తేలిన వారికి ఈ శిక్ష విధించారు. ఈ కేసుల‌ను న్యాయ‌మూర్తి అత్యంత అరుదైన కేసుల కోవ‌లోకి వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. సెషన్స్ కోర్టు విధించిన మరణశిక్షలు అమలు కావాలంటే నిబంధనల ప్రకారం హైకోర్టు వాటిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. అలాగే, ఈ తీర్పులను సవాలు చేస్తూ నిందితులకు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే చట్టపరమైన అవకాశం కూడా ఉంటుంది. ఇదిలా ఉండ‌గా.. జడ్జి దివాకర్ గతంలో బరేలీలో పనిచేస్తున్న సమయంలోనూ 13 మందికి మరణశిక్ష విధించిన చరిత్ర ఉంది. దీంతో ఆయన ఇప్పటివరకు తన పదవీ కాలంలో మొత్తం 35 మందికి మరణశిక్ష విధించినట్లైంది.

Also Read..

బీజేపీ కొత్త కార్యవర్గం: తెలంగాణకు బిగ్ షాక్.. ఏపీకి మూడు కీలక పదవులు!

‘డెవలప్డ్‌ ఇండియా’ కోసం బ్యాంకింగ్‌ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ

న్యూయార్క్‌లో పూజా హెగ్డే సంద‌డి - ఇండియా డే ప‌రేడ్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా బుట్ట‌బొమ్మ‌

Advertisement
Advertisement