త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | పెంచిన గ‌డువును అవ‌కాశంగా తీసుకోండి.. క్షేత్ర‌స్థాయికి వెళ్లండి

Revanth Reddy | ఎస్‌ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారని.. దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రేపు (సోమవారం) 10 మంది ఇన్‌చార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్‌ఐఆర్‌పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారన్నారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని కోరారు.

S

Telangana | Published On Jul 19, 2026, 12.51 pm IST

Revanth Reddy | పెంచిన గ‌డువును అవ‌కాశంగా తీసుకోండి.. క్షేత్ర‌స్థాయికి వెళ్లండి
Advertisement
  • ఇన్‌చార్జ్ మంత్రులు రేపు అన్ని జిల్లాల్లో ఎస్‌ఐఆర్‌పై స‌మీక్ష‌లు చేయాలి
  • పార్ల‌మెంట్ స‌మావేశాలున్నా ఎంపీలు స‌మీక్ష‌లు చేయాల్సిందే
  • బాగా ప‌నిచేసిన 100 బీఎల్ఏల‌కు రాహుల్‌గాంధీతో ఫొటో దిగే అవ‌కాశం ఉంటుంది
  • ఎస్‌ఐఆర్‌పై జూమ్ స‌మావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి సూచ‌న‌లు

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఎస్‌ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారని.. దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రేపు (సోమవారం) 10 మంది ఇన్‌చార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్‌ఐఆర్‌పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారన్నారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని కోరారు. ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామ‌ని హెచ్చ‌రించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్‌ఐఆర్‌కు నియమించిన పార్టీ ఇన్‌చార్జ్‌లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేన‌ని తేల్చి చెప్పారు. రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు గాంధీభవన్‌కు రావొద్ద‌న్నారు. ఆదివారం ఎస్ఐఆర్‌పై నిర్వ‌హించిన జూమ్ స‌మావేశంలో రేవంత్ మాట్లాడుతూ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు.

అటువంటి వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దు..

119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌పై 489 సమావేశాలు జరిగాయి. బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలి. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీభవన్ చుట్టూ తిరగొద్దు. అలాంటి వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దు. రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు గాంధీభవన్‌కు రావొద్దు. కొందరు నాయకులు హైదరాబాద్‌లో కూర్చొని పనిచేయడం లేదు. పార్టీ పరంగా ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జీలుగా ఉన్నవారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, చైర్మన్లు బీఎల్‌వోల రిపోర్టుల కంటే బీఎల్‌ఏల రిపోర్టులను పరిశీలించాలి. బీఎల్‌వోల రిపోర్టుల మీద మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు ఉంటాయి అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చ‌రించారు.

గాంధీభ‌వ‌న్ టీం ప‌రిశీలించాలి..

పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్‌ఏలను నాయకులు సమర్థవంతంగా ఉపయోగించాలి. పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలి. హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదు. వచ్చే పది రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలి. బీఎల్‌ఏ, బీఎల్‌ఓ రిపోర్టులను గాంధీభవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఎస్‌ఐఆర్‌ను ఇన్‌చార్జ్ మంత్రులు పూర్తి పర్యవేక్షణ చేయాల్సిందే. అన్నింటికీ వారిదే బాధ్యత. ఈ నెల 30వ తేదీన మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తాం. అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటాం అని స్ప‌ష్టం చేశారు.

పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లను సమన్వయం చేయాలి. ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్‌పై సీరియస్‌గా దృష్టి సారించాలి. బాగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫొటో దిగే అవకాశం కల్పించాలి అని రేవంత్ పేర్కొన్నారు.

ఈ జూమ్ స‌మావేశంలో డీప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్, ఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు, ఎస్‌ఐఆర్‌ కో ఆర్డినెటర్స్ పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement