త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | రేవంత్‌తో అభిప్రాయ భేదాలు.. సాయంత్రానికే స‌రిచేసుకున్నాం

Mahesh Kumar Goud | సీఎం రేవంత్ రెడ్డితో త‌న‌కు ఎక్క‌డా గొడ‌వ జ‌ర‌గ‌లేదు.. పార్టీలో డిఫ‌రెన్స్ ఆఫ్ ఒపీనియ‌న్ స‌హ‌జ‌మే అని టీ పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మా మధ్య గ్యాప్ ఉందని పత్రికల్లో వస్తుంది.. కానీ గొడవ లేదు. రేవంత్‌తో అభిప్రాయ భేదాలు వచ్చినా సాయంత్రానికే సరిచేసుకున్నామ‌ని తెలిపారు.

S

Telangana | Published On Sep 15, 2026, 3.46 pm IST

Mahesh Kumar Goud | రేవంత్‌తో అభిప్రాయ భేదాలు.. సాయంత్రానికే స‌రిచేసుకున్నాం
Advertisement

సీఎంతో గొడ‌వ‌ల్లేవు.. అంత‌కంటే గ్యాప్ లేదు
పార్టీ వ్య‌వ‌హారాల్లో రేవంత్ జోక్యం చేసుకోలేదు
ఈ రెండేళ్ల‌లో పార్టీని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపాం
కుల స‌ర్వేను తొక్కిపెట్ట‌డం దుర‌దృష్ట‌క‌రం
ఎమ్మెల్యే టికెట్ విష‌యంలో డీసీసీల అభిప్రాయం చాలా కీల‌కం
గాంధీ భ‌వ‌న్‌లో మీడియాతో పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్ చిట్ చాట్

Mahesh Kumar Goud | త్రినేత్ర‌.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డితో త‌న‌కు ఎక్క‌డా గొడ‌వ జ‌ర‌గ‌లేదు.. పార్టీలో డిఫ‌రెన్స్ ఆఫ్ ఒపీనియ‌న్ స‌హ‌జ‌మే అని టీ పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మా మధ్య గ్యాప్ ఉందని పత్రికల్లో వస్తుంది.. కానీ గొడవ లేదు. రేవంత్‌తో అభిప్రాయ భేదాలు వచ్చినా సాయంత్రానికే సరిచేసుకున్నామ‌ని తెలిపారు. పార్టీ విషయంలో సీఎం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గాంధీ భ‌వ‌న్‌లో మ‌హేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ చేశారు.

ఈ నెలాఖరులోపు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చేస్తాం. సొసైటీ నియామకాల్లో మండల అధ్యక్షుల నిర్ణయానికే ప్రాధాన్యం ఉంటుంది. పీసీసీగా రెండేళ్ల ప్రయాణం ఎంతో ఉత్సాహంగా సాగింది. పీసీసీ పదవిని బాధ్యతగా, సంతృప్తిగా నిర్వహించాను. కార్యకర్తలకు భరోసా కల్పించి.. పార్టీకి బలాన్ని చేకూర్చాం. పార్టీని బూత్ స్థాయి వరకు బలోపేతం చేశాం. సీఎం రేవంత్ రెడ్డితో నా వేవ్‌లెన్త్ మ్యాచ్ అయింది. రెండేళ్లు సాఫీగా పార్టీని ముందుకు తీసుకెళ్లాం.. చిన్నచిన్న ఇబ్బందులు వచ్చినా అవలీలగా అధిగమించాం. రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, దీపాదాస్ మున్షీ సహకారంతో పార్టీని నడిపాం. సీఎం రేవంత్‌తో కలిసి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం. డీలిమిటేషన్ లేకపోతే తెలంగాణలో 17కి 17 లోక్‌సభ సీట్లు గెలిపించేందుకు కృషి చేస్తామ‌ని మ‌హేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

దేశ వ్యాప్తంగా కుల స‌ర్వే చేస్తాం

కుల సర్వేతో తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం జరిగింది. రాహుల్ గాంధీ ఆశయం కుల సర్వేను శాస్త్రీయంగా, సమర్థవంతంగా నిర్వహించిన రేవంత్‌కు ధన్యవాదాలు. కుల సర్వేను కేంద్రం తొక్కిపెట్టడం దురదృష్టకరం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల సర్వే అమలు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకుంటే డీసీసీ అధ్య‌క్షుడిని క‌ల‌వాలి

ఏఐసీసీ ఆదేశాలతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికలో కొత్త విధానం అమలు చేశాం. ఢిల్లీ నుంచి అబ్జర్వర్లను పంపించి సమీక్షించిన తర్వాత డీసీసీ అధ్యక్షులను ప్రకటించాం. ఎమ్మెల్యేల టికెట్ల విష‌యంలో డీసీసీ అధ్య‌క్షుల అభిప్రాయం కీల‌కం. పీఏసీలో ఎమ్మెల్యే టికెట్ చ‌ర్చ‌కు ముందు డీసీసీ అధ్య‌క్షుడి అభిప్రాయం తీసుకుంటాం. ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకునే వారు త‌ప్ప‌నిస‌రిగా డీసీసీ అధ్య‌క్షుడిని క‌ల‌వాలి. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ డీసీసీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకుంటున్నామ‌ని తెలిపారు.

కొండా సురేఖ‌ను తొల‌గించిన‌ప్పుడు బాధ‌ప‌డ్డా

బీసీ మంత్రిని తొలగించినప్పుడు నేను కూడా బాధపడ్డాను. సురేఖను తొలగించడానికి కారణాలు మీకు తెలుసు. ఏఐసీసీ నిర్ణయం మేరకే సురేఖపై చర్యలు తీసుకున్నాం. క్రమశిక్షణ తప్పి హద్దు దాటితే ఎవరిపైనా చర్యలు తప్పవు. క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఏఐసీసీ నిర్ణయించింది

Advertisement
Advertisement