త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Ramchandar Rao | ఇక దుష్ప్రచారం ఆపండి.. బీఆర్ఎస్‌కు వేరే ప‌ని లేదా?: రాంచంద‌ర్‌రావు

BJP Ramchandar Rao | రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. బండి సంజయ్, బీజేపీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంద‌ని, రూ.కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రమంతా పోస్టర్లు వేశారన్నారు.

S

Telangana | Published On May 18, 2026, 1.59 pm IST

BJP Ramchandar Rao | ఇక దుష్ప్రచారం ఆపండి.. బీఆర్ఎస్‌కు వేరే ప‌ని లేదా?: రాంచంద‌ర్‌రావు
Advertisement
  • అమ్మాయి కుటుంబాన్ని రోడ్డుకు లాగొద్దు
  • ఎవ‌రికి అన్యాయం జ‌రిగినా కోర్టులు ఉన్న‌య్‌
  • కోట్లు ఖ‌ర్చు పెట్టి రాష్ట్ర‌మంతా పోస్ట‌ర్లు వేస్తున్న‌రు
  • మీ హ‌యాంలో మ‌హిళ‌ల‌పై నేరాలు పెరిగాయి
  • మీ ఆడ‌ప‌డుచు లిక్క‌ర్ కేసులో ఇరుక్కుంటే మీరు రాజీనామా చేశారా?
  • ఇప్పుడు బండి సంజ‌య్ కుటుంబం మీద ప‌డుతున్నారు
  • బీజేపీని ఎదుర్కోలేకుంటే రాజ‌కీయాల నుంచి వైదొల‌గండి
  • బీఆర్ఎస్‌పై బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు ధ్వ‌జం

BJP Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్: రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. వ్యక్తిని, కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బండి సంజయ్, బీజేపీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంద‌ని, రూ.కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రమంతా పోస్టర్లు వేశారన్నారు. బండి సంజయ్ తప్పు చేయలేదని, ఆయన కుటుంబీకులు తప్పు చేస్తే న్యాయపరంగా చర్యలుంటాయని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

బెయిల్ రాక‌పోతే స‌రెండ‌ర్ అయ్యాడు..

రాష్ట్రంలో కొన్ని పార్టీలు బీజేపీని బ‌ద్నాం చేస్తున్న‌య్‌. ఒక వ్య‌క్తి కుటుంబ స‌భ్యుల‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న‌రు. బీఆర్ఎస్ కు ఏ కార్య‌క్ర‌మం లేన‌ట్లు కోట్ల రూపాయ‌లు పెట్టి పోస్ట‌ర్లు అతికించ‌డం, మీడియాను వాడుకోవ‌డం ప‌నిగా పెట్టుకుంది. బీఆర్ఎస్ సోష‌ల్ మీడియాను నేను హెచ్చ‌రిస్తున్నా. నేను ఆరోజే చెప్పాను. బండి సంజ‌య్ త‌ప్పు చేసుంటే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని. ఆయ‌న త‌ప్పు చేయ‌లే. ఆయ‌న కొడుకు మీద కేసుంటే న్యాయ‌బ‌ద్ధంగా విచార‌ణ జ‌ర‌గాల్సిందే. బెయిల్ రాక‌పోతే స‌రెండ‌ర్ అయ్యాడు. కాళేశ్వ‌రం మీద ఎంక్వ‌యిరీ పెడితే మీరు హైకోర్టుకు పోలేదా? ఎవరైనా ఒక స్టెప్ తీసుకుంటారు. మీకేం బాధ‌? అని ప్ర‌శ్నించారు.

2014లో తెలంగాణ‌లో 14,147 మ‌హిళ‌ల మీద‌ నేరాలు జ‌రిగాయి. 2023లో 23,679 కేసులు న‌మోద‌య్యాయి. అంటే 69 శాతం మ‌హిళ‌ల మీద దాడులు పెరిగిన‌య్‌. కేటీఆర్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 2022లో ఆసిఫాబాద్లో 30 ఏళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. వ‌రంగ‌ల్‌లో డా.ప్రీతిని వేధిస్తే ఆమె చ‌నిపోయింది. అది మీ ప్ర‌భుత్వం బాధ్య‌త కాదా? మీ పార్టీ స‌ర్పంచే మీ ఎమ్మెల్యే మీద వేధింపుల ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ పార్టీ వ్య‌క్తి పి.ర‌వి అనే వ్య‌క్తి రేప్ కేసులో ఇన్‌వాల్వ్ అయ్యాడు. ఇలా ఎన్నో ఘ‌ట‌న‌లు మీ పాల‌న‌లో జ‌రిగాయి. మీరా ఇప్పుడు మ‌హిళ‌ల గురించి మాట్లాడేది అని రాంచంద‌ర్‌రావు నిల‌దీశారు.

ఫార్ములా కేసులో అరెస్టు అయితాన‌ని కేటీఆర్‌కు భ‌యం..

మీ ప్ర‌భుత్వంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగితే మీరు రాజీనామా చేశారా? మీ ఇంట్లో ఆడ‌ప‌డ‌చు త‌ప్పు చేస్తే మీరెందుకు రాజీనామా చేయ‌లే? మీరు ఫార్ములా కేసులో అరెస్టు అయితార‌నో, కాళేశ్వ‌రం కేసులో ఇరుక్కుంటార‌నో భ‌యానికే మీరు ఈరోజు బీజేపీ మీద అబండాలు వేస్తున్న‌రు. మీరు బీజేపీని త‌ట్టుకోలేక‌పోతే రాజ‌కీయాల నుంచి వైదొల‌గండి. రాజ‌కీయంగా మాతో కొట్లాడండి.

కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉంది..

పోక్సో కేసు న‌మోదైంది. అమ్మాయికి న్యాయం జ‌ర‌గాల‌ని పోలీసులు ప్ర‌య‌త్నం చేస్తున్న‌రు. ఇక ఆపండి. మిమ్మ‌ల్నీ ప్ర‌జ‌లు నమ్మ‌రు. అవ‌త‌లి కుటుంబాన్ని రోడ్డున వేయొద్దు. బాధ్య‌త‌గా ప్ర‌వ‌ర్తించండి. కాంగ్రెస్ నాయ‌కుల‌కు ద‌మ్ముంటే బీఆర్ఎస్ వాళ్ల‌ను కాళేశ్వ‌రం కేసులో అరెస్టు చేయాలి. ఈ కేసును సీబీఐకి ఇయ్య‌లే. ఇచ్చిన‌ట్లు డ్రామాలు ఆడారు. బీఆర్ఎస్ వాళ్లు అవినీతి చేస్తే మీకు ఓటేశారు. మీరు చేయాల్సిన ప‌ని మాతో చేయిస్తే ఎట్లా అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ సంప‌ద‌ను దోచుకొంటే కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉన్న‌ది. మీరు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోండి.

తెలంగాణ‌లో బీజేపీ వాతావ‌ర‌ణం నిర్మిత‌మైంది....

మొన్న మోదీ మీటింగ్‌తో తెలంగాణ‌లో బీజేపీ వాతావ‌ర‌ణం నిర్మిత‌మైంది. తెలంగాణ‌లో బీఆర్ఎస్ లేదు. కేవ‌లం సోష‌ల్ మీడియా, మీడియాకే ప‌రిమిత‌మైంది. ఇటువంటి వాళ్ల మాట‌లు న‌మ్మొద్ద‌ని తెలంగాణ ప్ర‌జ‌లను కోరుతున్నా. ఎవ‌రికి అన్యాయం జ‌రిగినా కోర్టులు తీర్పులు ఇస్తాయి. కానీ ఇలాంటివి రాజ‌కీయం చేయొద్దు. బీజేపీ రైతు ప‌క్షాన ఎల్ల‌ప్పుడూ పోరాటం చేస్తది అని రాంచంద‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు.

చ‌మురు కొర‌త ఉంది..

ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌మురు కొర‌త ఉన్న‌ది. మ‌న దేశంలో కేవ‌లం రూ.3 మాత్ర‌మే పెంచాం. ఇది ప్ర‌పంచం దేశాల‌తో పోలిస్తే త‌క్కువనే పెంచుకున్నం. ఇరాన్‌, ఇజ్రాయెల్, ర‌ష్యా, యుక్రెయిన్‌ యుద్ధాలు న‌డుస్తున్నాయి. దేశంలో చ‌మురు కొర‌త రావొచ్చు. మ‌రి దేశాన్ని కాపాడాలంటే మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండాలి. క్ర‌మ శిక్ష‌ణ‌తో పొదుపు చేసుకోవాలి. అందుకే ఎల‌క్ట్రిక్ వెహికిల్స్‌లో వెళ్ల‌డం, వ‌ర్క్ ఫ్రం హోం చేయ‌డం, ప్ర‌జా ర‌వాణాను వినియోగించుకోవ‌డం వంటివి చేయాలి అని ఆయ‌న కోరారు. మోదీ తీర్పు ఇచ్చిన త‌ర్వాత మెట్రోలో వెళ్లాను. ఈరోజు నా స్నేహితుడి ఎల‌క్ట్రిక్ కారులో వ‌చ్చాను. ఇదేదో ఫొటో కోస‌మో, మీడియా కోస‌మో కాదు. మేరా భార‌త్ యోగ్‌దాన్ చేయ‌బోతున్నాం. వాతావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణకు పాటుప‌డాలి. చెట్లు నాటాలి. ఆత్మ నిర్భ‌ర్ భార‌త్‌, విక‌సిత్ భార‌త్ బాట‌లో ప‌య‌నిద్దాం అని రాంచంద‌ర్‌రావు పిలుపునిచ్చారు.

అంత‌కుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు పార్టీ కార్యాలయానికి ఎలక్ట్రిక్ వాహనంలో వచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, మోదీ ప్రధానిగా పుష్కర కాలం పూర్తి చేసుకోనుండటంతో నిర్వహించే కార్యక్రమాలపై సన్నాహక సమావేశానికి హాజరయ్యేందుకు ఎలక్ట్రిక్ వాహనంలో పార్టీ ఆఫీసుకు వచ్చి స్ఫూర్తిగా నిలిచారు.

 

Advertisement
Advertisement