త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SERF | గ్రామీణ మహిళల జీవ‌నోపాధి ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు.. పీవీఎన్ఆర్‌టీయూతో సెర్ప్ ఒప్పందం..

SERF | గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత, పశుసంవర్ధక ఆధారిత ఉపాధి అవకాశాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్‌ఆర్‌టీయూ) మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది.

P

Telangana | Published On May 11, 2026, 5.26 pm IST

SERF | గ్రామీణ మహిళల జీవ‌నోపాధి ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు.. పీవీఎన్ఆర్‌టీయూతో సెర్ప్ ఒప్పందం..
Advertisement

SERF | గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత, పశుసంవర్ధక ఆధారిత ఉపాధి అవకాశాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్‌ఆర్‌టీయూ) మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రెండు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు పాల ఉత్పత్తి, గొర్రెలు, మేకల పెంపకం, బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ రంగాల్లో శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం అందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.

ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ దివ్య దేవ‌రాజ‌న్‌ మాట్లాడుతూ గ్రామీణ పేద కుటుంబాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా పేదరిక నిర్మూలనకు దోహదం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు వెటర్నరీ యూనివర్సిటీతో ఈ భాగస్వామ్యం కుదిరిందన్నారు. నైపుణ్య ఆధారిత ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించి మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, సమాఖ్యలను మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ మహిళల్లో స్వావలంబన పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు బ్యాంకు లింకేజీలు, రివాల్వింగ్ ఫండ్లు, సబ్సిడీల ద్వారా ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.

కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (సీఐఎఫ్), రుణాల ద్వారా పొట్టేళ్ల యూనిట్లు, గొర్రె-మేక పిల్లల నర్సరీలు, బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ మదర్ యూనిట్లు, పక్షుల యూనిట్ల ఏర్పాటు కోసం ఆర్థిక సహకారం అందించనున్నట్లు తెలిపారు. అవగాహన ఒప్పందం ప్రకారం పీవీఎన్‌ఆర్‌టీయూ, సెర్ప్ లబ్ధిదారులకు సాంకేతిక నైపుణ్యాలు, సామర్థ్యాభివృద్ధి శిక్షణ అందించనుంది. పశు పోషణ, ఆరోగ్య సంరక్షణ అంశాల్లో శాస్త్రీయ మార్గదర్శకత్వం ఇవ్వనుంది. పీవీఎన్‌ఆర్‌టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎ శరత్ చంద్ర మాట్లాడుతూ, పాల ఉత్పత్తి, గొర్రెలు, మేకల పెంపకం, బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ రంగాల్లో సెర్ప్ మహిళలకు విశ్వవిద్యాలయం పూర్తి స్థాయి సాంకేతిక సహకారం అందిస్తుందని తెలిపారు. పశువుల ఉత్పాదకతను ప్రభావితం చేస్తున్న ప్రధాన సమస్యల్లో పోషకాహార లోపం, ఖనిజాల కొరత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక మినరల్ మిశ్రమాన్ని అభివృద్ధి చేశామని, దాన్ని సెర్ప్‌కు అనుబంధంగా ఉన్న రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పంచాయ‌తీరాజ్ మంత్రి అన‌సూయ సీత‌క్క మాట్లాడుతూ గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు పశుసంవర్ధక రంగం బలమైన ఆధారమని తెలిపారు. సంప్రదాయ ఉపాధికి పరిమితం కాకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ఆదాయ వనరులు పెంచుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సెర్ప్-పీవీఎన్‌ఆర్‌టీయూ భాగస్వామ్యంతో మహిళలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్య శిక్షణ, మార్కెట్ అవగాహన అందుతుందని, దీని ద్వారా మహిళల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ కుటుంబాల పోషక భద్రత కూడా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement