త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | త్వరలో “సాదాబైనామా” పరిష్కారం

Ponguleti Srinivas Reddy | రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్ లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

A

Telangana | Published On Mar 24, 2026, 12.49 pm IST

Ponguleti Srinivas Reddy | త్వరలో “సాదాబైనామా” పరిష్కారం
Advertisement

కొనుగోలుదారు అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది
దరఖాస్తుదారులకు మేలు జరిగేలా జీవో 76
శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్ లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శాస‌న‌మండ‌లిలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు పొంగులేటి సమాధానమిస్తూ నాటి బీఆర్ఎస్‌ ప్రభుత్వం సాదబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిందని, కానీ 2020 ఆర్.ఓ.ఆర్. చట్టంలో పరిష్కారం మార్గం చూపించలేదన్నారు. భూ భారతి చట్టంలో ఈ సమస్యకు పరిష్కారం చూపించామ‌ని, కానీ కొనుగోలుదారు, అమ్మ‌కందారు ఇద్ద‌రి నుంచి అఫిడ‌విట్ తీసుకోవాల‌న్న నిబంధ‌న ఉండ‌డంతో క్షేత్ర‌స్థాయిలో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని చెప్పారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు జీ.ఓ. 76 ను విడుదల చేశామ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో తొమ్మిది లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయ‌ని, వీట‌న్నింటికీ ప‌రిష్కారం ల‌భించ‌బోతోంద‌ని చెప్పారు.

ఆధార్ మాదిరిగానే భూధార్

నక్షా లేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాల్లో ప్రయోగాత్మమకంగా రీ సర్వే నిర్వహించామని పొంగులేటి తెలిపారు. ఆ గ్రామాల‌లో ప్రతీ సర్వే నెంబర్‌కు భూధార్ సంఖ్య కేటాయించామ‌ని చెప్పారు. ఆధార్ మాదిరిగానే భూదార్ సంఖ్య కూడా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని వివ‌రించారు. త్వరలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో ప్రతీ జిల్లాలో 70 గ్రామాల చొప్పున భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించామ‌న్నారు. దశల వారిగా భూ సర్వే నిర్వహించి భూధార్ సంఖ్య‌ను కేటాయిస్తామ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.

అవినీతికి పాల్పడితే ఎవరిని ఉపేక్షించబోం

ధరణి పోర్టల్‌లోని లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకుని కొంత‌మంది మీ సేవ‌ నిర్వాహకులతో కలిసి రూ.3.99 కోట్ల ప్రభుత్వ సొమ్మును కాజేశారని మంత్రి తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించామని చెప్పారు. ఎమ్మెల్సీ తాతా మధుసుదన్ అడిగిన ప్రశ్నకు మంత్రి స‌మాధాన‌మిస్తూ తప్పుచేసిన వారి నుంచి ఆ సొమ్మును రికవరీ చేస్తామన్నారు. ఇందులో అధికారుల పాత్ర ఉంటే ఏ స్థాయిలో ఉన్నా కూడా ఉపేక్షించబోమని స్ప‌ష్టం చేశారు. గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో ధరణి పోర్టల్‌ను నాలుగు గోడల మధ్య ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి తీసుకొచ్చారని ఆరోపించారు. దీని వ‌ల‌నే కొత్తగా భూ సమస్యలు పుట్టుకొచ్చాయని విమర్శించారు. ధరణి పోర్టల్‌లో 40, 41 మాడ్యుల్స్ ఉంటే భూ భారతి పోర్టల్ లో 6కు కుదించామని చెప్పారు. ధరణి పోర్టల్‌ను అర్ధ‌రాత్రి ఒక్కరోజు మార్చేది కాదని, దశలవారీగా మార్పులు చేసుకుంటూ వస్తున్నామని, వివ‌రించారు. ఈ ఏప్రిల్ చివరి నాటికి పూర్తి స్థాయిలో భూ భారతి పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement