త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Strike | అగ్గిరాజేసిన ఆత్మాహుతి.. మూడో రోజు ఆర్టీసీ స‌మ్మె ఉధృతం

RTC Strike | అసెంబ్లీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్ర‌క‌టించిన హామీ మేర‌కు త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేప‌ట్టిన స‌మ్మెబాట మూడో రోజుకు చేరింది. నిన్న న‌ర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంక‌ర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెంద‌డంతో.. వారి స‌మ్మె మ‌రింత ఉధృతంగా కొన‌సాగింది.

S

Telangana | Published On Apr 24, 2026, 8.20 pm IST

RTC Strike | అగ్గిరాజేసిన ఆత్మాహుతి.. మూడో రోజు ఆర్టీసీ స‌మ్మె ఉధృతం
Advertisement

డిపోల ముందు నిర‌స‌న‌లు
కాంగ్రెస్ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు
రేవంత్‌పై నిప్పులు చెరిగిన కార్మికులు
ముత్తోజిపేట‌లో ఉద్రిక్త‌త‌..
డ్రైవ‌ర్ అంత్య‌క్రియల‌ను అడ్డుకున్న కార్మికులు
డిపోకు డెడ్‌బాడీని తీసుకెళ్లాల‌ని ప‌ట్టు
మృత‌దేహానికి నివాళుల‌ర్పించిన బండి సంజ‌య్
బీఆర్ఎస్ నేత‌ల‌ను అరెస్టు చేసిన పోలీసులు
ఆత్మ‌హ‌త్య‌లు ప‌రిష్కారం కాద‌న్న‌ మంత్రివ‌ర్గం
శంక‌ర్ గౌడ్ కుటుంబానికి రూ. 10 ల‌క్ష‌ల ఆర్థిక సాయం, ఒక‌రికి ఉద్యోగం
ఐఏఎస్ అధికారుల‌తో ఆర్టీసీ కార్మిక సంఘాల చ‌ర్చ‌లు

RTC Strike | త్రినేత్ర‌.న్యూస్ : అసెంబ్లీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్ర‌క‌టించిన హామీ మేర‌కు త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేప‌ట్టిన స‌మ్మెబాట మూడో రోజుకు చేరింది. నిన్న న‌ర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంక‌ర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెంద‌డంతో.. వారి స‌మ్మె మ‌రింత ఉధృతంగా కొన‌సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. త‌మ డిమాండ్లను నెర‌వేర్చే వ‌ర‌కు స‌మ్మె కొన‌సాగిస్తామ‌ని తేల్చిచెప్పారు. ఆర్టీసీ కార్మికుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న రేవంత్ స‌ర్కార్‌కు త‌గిన బుద్ధి చెబుతామ‌ని హెచ్చ‌రించారు. ఆర్టీసీ డ్రైవ‌ర్ మృతికి కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించి, అత‌న్ని కుటుంబాన్ని ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు.

తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు డ్రైవ‌ర్ మృతి

న‌ర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ నిన్న మ‌ధ్యాహ్నం బ‌స్టాండ్‌లో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంగ‌తి తెలిసిందే. 80 శాతం కాలిన గాయాల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ను మెరుగైన చికిత్స నిమిత్తం హైద‌రాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు శంక‌ర్ గౌడ్ క‌న్నుమూసిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

డిపోకు తీసుకెళ్లాల‌ని ప‌ట్టు.. తీవ్ర ఉద్రిక్త‌త‌

డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ మృత‌దేహాన్ని న‌ర్సంపేట మండ‌లం ముత్తోజిపేట‌కు ప్ర‌త్యేక అంబులెన్స్‌లో త‌ర‌లించారు. డ్రైవర్ మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పిస్తామని కార్మికులు ఆందోళనకు దిగారు. వారి ఆందోళ‌న‌కు కుటుంబ స‌భ్యులు కూడా మ‌ద్ద‌తు ప‌లికారు. కానీ పోలీసులు అనుమ‌తించ‌లేదు. మొత్తానికి శుక్ర‌వారం 3 గంట‌ల స‌మ‌యానికి డిపోకు త‌ర‌లించ‌కుండానే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు కుటుంబ స‌భ్యుల‌తో పోలీసులు జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌లించాయి. దీంతో శంక‌ర్ గౌడ్ అంత్య‌క్రియ‌ల‌కు కుటుంబ స‌భ్యులు సిద్ధ‌మ‌య్యారు.

బీఆర్ఎస్ నేత‌ల అరెస్ట్.. పెద్ది ఆగ్ర‌హం

శంక‌ర్ గౌడ్ మృత‌దేహానికి నివాళుల‌ర్పించి, న‌ర్సంపేట డిపోకు త‌ర‌లించేందుకు య‌త్నించిన మాజీ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు పెద్దిని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్తుండగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్మికులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. కార్మికుల ఆందోళనతో ముత్తోజిపేటలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇక హైద‌రాబాద్ నుంచి న‌ర్సంపేట‌కు బ‌య‌ల్దేరిన మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డితో పాటు ప‌లువురు నేత‌ల‌ను అరెస్టు చేశారు.

డెడ్‌బాడీకి బండి సంజ‌య్ నివాళి

ఉద్రిక్త ప‌రిస్థితుల నడుమ‌ కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ మృత‌దేహానికి నివాళుల‌ర్పించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. అయితే శంక‌ర్ గౌడ్ డెడ్‌బాడీని న‌ర్సంపేట ఆర్టీసీ డిపోకు త‌ర‌లించాల‌న్న కార్మికుల డిమాండ్‌కు బండి సంజ‌య్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మృత‌దేహాన్ని డిపోకు త‌ర‌లించేందుకు బండి సంజ‌య్ కూడా య‌త్నించారు. ఈ క్ర‌మంలో పోలీసుల‌కు, బండి సంజ‌య్‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. చివ‌ర‌కు బండి సంజ‌య్ అరెస్టుకు కూడా పోలీసులు సిద్ధ‌మ‌య్యారు. కానీ చివ‌ర‌కు పోలీసులు వెన‌క్కిత‌గ్గారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు డిపో వద్దకు తీసుకెళ్లాలని బీజేపీ మద్దతుగా నిలబడింది.. అంతేకానీ పబ్లిసిటీ కోసం రాలేదు అని బండి సంజ‌య్ పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం : సీఎం రేవంత్

డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ ఆత్మ‌హ‌త్య‌తో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివ‌ర్గం స్పందించింది. డ్రైవ‌ర్ మృతిప‌ట్ల‌ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయ‌న‌ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.

రూ. 10 ల‌క్ష‌ల సాయం.. ఒక‌రికి ఉద్యోగం

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్ర‌క‌టించారు. శంకర్‌ గౌడ్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మంత్రి తెలిపారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల సాయం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు.

మంత్రుల బృందం సంతాపం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. సీఎస్‌ రామకృష్ణారావు, ప్రత్యేక సీఎస్‌ వికాస్‌రాజ్‌, సందీప్ కుమార్ సుల్తానియా, దాన కిశోర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కూడా హాజరయ్యారు. డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి పట్ల మంత్రులు, జేఏసీ నేతలు సంతాపం ప్రకటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జేఏసీ నేతల డిమాండ్లపై మంత్రులు చర్చించారు.

Advertisement
Advertisement