త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కేసీఆర్ నువ్వో నేనో తేల్చుకుందాం.. కాటారం స‌భ‌లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | వ‌చ్చే ఎన్నిక‌ల్లో నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి స‌వాల్ విసిరారు. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా కాటారం మండ‌లం న‌స్తూరుప‌ల్లెలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రెండోవిడ‌త రైతుభ‌రోసా నిధుల‌ను విడుద‌ల చేశారు.

P

Telangana | Published On Apr 20, 2026, 9.32 pm IST

CM Revanth Reddy | కేసీఆర్ నువ్వో నేనో తేల్చుకుందాం.. కాటారం స‌భ‌లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌లు
Advertisement

CM Revanth Reddy | వ‌చ్చే ఎన్నిక‌ల్లో నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి స‌వాల్ విసిరారు. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా కాటారం మండ‌లం న‌స్తూరుప‌ల్లెలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రెండోవిడ‌త రైతుభ‌రోసా నిధుల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ దేశానికి రైతే వెన్నుముక‌ని, ఆ రైతును ఆదుకొని నిటారునిల‌బెట్టే బాధ్య‌త కాంగ్రెస్‌, ప్ర‌జాప్ర‌భుత్వం తీసుకుంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీకి రైతు సంక్షేమ‌మే నినాదం కాదు విధాన‌మ‌న్నారు. ఆనాడు రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టుల‌ను నిర్మించింద‌ని, బాంక్రానంగ‌ల్ డ్యామ్ నుంచి మొద‌లు పెడితే నాగార్జున‌సాగ‌ర్‌, శ్రీ‌శైలం, ఎస్సారెస్పీ వ‌ర‌కు పెద్ద‌పెద్ద న‌దుల‌పై ప్రాజెక్టుల‌ను క‌ట్టి రైతుల‌కు సాగునీరు అందించిన చ‌రిత్ర కాంగ్రెస్‌ద‌న్నారు.

రెండోవిడ‌త‌లో రూ.5700కోట్లు

పంట‌ల‌కు గిట్టుబాట ధ‌ర ఇచ్చే చ‌ట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేన‌ని, దేశంలో రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలి పార్టీ కాంగ్రెస్ అన్నారు. దేశ‌వ్యాప్తంగా రైతుల‌కు రూ.72వేల‌కోట్ల రుణ‌మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ అని, రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించి ఏడాదిలోనే చేసి చూపించామ‌న్నారు. 25.35ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లో రుణ‌మాఫీ కింద రూ.22వేల‌కోట్లు జ‌మ చేశామ‌ని తెలిపారు. గ‌త విడత‌లో రైతుభ‌రోసా కింద తొమ్మిదిరోజుల్లోనే రూ.9వేల‌కోట్లు జ‌మ చేశామ‌ని, ఇవాళ రెండో విడుత‌గా రూ.5700కోట్ల‌కుపైగా రైతుల ఖాతాల్లో జ‌మ చేస్తున్నామ‌న్నారు. మిగ‌తా రూ.3300కోట్లు వ‌చ్చే నెల‌లో రైతుల ఖాతాల్లో వేస్తామ‌న్నారు. రాష్ట్రంలో 3.5కోట్ల మంది పేద‌ల‌కు స‌న్న బియ్యం ఇస్తున్నామ‌ని, పేద‌ల‌కు స‌న్న‌బియ్యం ఇవ్వాల‌నే ఆలోచ‌న ఎవ‌రికైనా వ‌చ్చిందా? అంటూ ప్ర‌శ్నించారు.

పాపాల భైర‌వుడు ఎందుకు రావాలి..

ప్ర‌జాపాల‌న పోవాలి.. పాపాల‌భైర‌వుడు రావాల‌ని ఓ పెద్ద‌మ‌నిషి అంటున్నార‌ని, ఫామ్‌హౌస్‌లో పండుకునే పాపాల భైర‌వుడు మ‌ళ్లీ ఎందుకు రావాల‌ని ప్ర‌శ్నించారు. ల‌క్ష‌లాది మంది కార్య‌క‌ర్త‌లు జెండా మోస్తే ఈ ప్ర‌భుత్వం వ‌చ్చింద‌న్నారు. పాపాల భైర‌వుడు ఎందుకు రావాలో పార్టీ మారుతున్న పెద్ద మ‌నిషి చెప్పాల‌ని డిమాండ్ చేశారు. జీవ‌న్‌రెడ్డి చ‌రిత్ర‌, ఆయ‌న వెనుక‌న్న మ‌చ్చ‌ల‌న్నీ నాకు తెలుసున‌ని, మంత్రి ప‌ద‌వి ఇచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్క‌ర్‌రావు వెంట వెళ్లార‌న్నారు. 40 ఏళ్ల పాటు త‌న కుటుంబానికి ఎన్నో ప‌ద‌వులు ఇచ్చుకున్నార‌ని, 14 సార్లు కాంగ్రెస్ బీ ఫామ్ ఇస్తే మోసం చేసి వెళ్లిపోయార‌ని ఆరోపించారు. ఓడిపోయిన‌ప్ప‌టికీ ఎన్నోసార్లు ప‌ద‌వులు ఇచ్చి కాంగ్రెస్ గౌర‌వించింద‌న్నారు. ఏడాదిపాటు ప‌ద‌విలేక‌పోతే జీవ‌న్‌రెడ్డి కార్య‌క‌ర్త‌ల గుండెల‌మీద త‌న్ని శ‌త్రువు పంచ‌న చేశార‌ని ఆరోపించారు.

ఒక వ్య‌క్తికి ప‌ద‌వి రాక‌పోతే ప్ర‌జాప‌భుత్వం పోవ‌ల్నా..

70వేల ప్ర‌భుత్వ ఉద్యోగులు ఇచ్చినందుకు ప్ర‌జాప్ర‌భుత్వం పోవాలా? అంటూ ప్ర‌శ్నించారు. వ‌రివేస్తే ఊరే అని చెప్పి పంట‌కొనేది లేద‌న్న నేత మ‌ళ్లీ రావాల్నా? వాస్తు బాగా లేద‌ని బాగున్న స‌చివాల‌యం కూల్చి కొత్త‌గా క‌ట్టుకున్నార‌ని, బిడ్డ‌, కొడుకు, తండ్రి ఇలా త‌లో ఫామ్‌హౌస్ క‌ట్టుకున్నార‌ని, ఏనాడైనా పేద‌ల‌కు ఇండ్లు క‌ట్టించి ఇవ్వాల‌నే ఆలోచ‌న ఏడైనా వ‌చ్చిందా? అంటూ ప్ర‌శ్నించారు. నేరెళ్ల‌లో ఎస్సీల‌ను ఇసుక లారీల‌తో తొక్కించినందుకు పాపాల భైర‌వుడు మ‌ళ్లీ రావాల్నా.. ఖ‌మ్మంలో గిరిజ‌న రైతుల చేతుల‌కు బేడీలు వేసినందుకు పాపాల భైర‌వుడు రాలేద‌ని, కాళేశ్వ‌రం పేరిట రూ.ల‌క్ష కోట్ల‌ను గోదావ‌రిలో పోసి వృథా చేశార‌ని మండిప‌డ్డారు. కాళేశ్వ‌రం పేరిట చేసిన దోపిడీకి ఉరి వేసినా త‌ప్పులేద‌న్నారు. పేద‌లు, దొర‌ల‌గ‌డీల ముందు ఊడిగం చేస్తూ అలాగే ఉండాల‌ని భావించార‌న్నారు. పేద‌లు క‌ట్టుకునేందుకు ప‌నికిరాని బ‌తుక‌మ్మ చీర‌లు పంచార‌ని, ఒక్కాయ‌న‌కు ప‌ద‌వి రాక‌పోతే ప్రజాప్ర‌భుత్వం పోవాలా? అంటూ నిల‌దీశారు. స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ దేవ‌త‌ల‌ను ఏనాడైనా ద‌ర్శించుకున్నారా? వేముల‌వాడ‌కు రూ.100కోట్లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించి ప‌దేళ్ల‌లోఉ రూపాయి ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించారు.

జీవ‌న్‌రెడ్డిపై విమ‌ర్శ‌లు..

ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్‌లో చేరిన జీవ‌న్‌రెడ్డిపై సీఎం రేవంత్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ద‌ళిత‌బిడ్డ‌ను ఎమ్మెల్యేను కాకుండా మంత్రిని చేసినందుకు పార్టీ ఓడిపావాల్నా జ‌గిత్యాల‌లో.. బ‌ల‌హీన వ‌ర్గాల బిడ్డ పొన్నం ప్ర‌భాక‌ర్‌ను మంత్రి చేసినందుకు, ఆది శ్రీ‌నివాస్‌ను విప్ చేసిందుకు ప్ర‌జాపాల‌న పోవాల్నా.. శ్రీ‌ధ‌ర్‌బాబు నేతృత్వంలో న‌డుస్తున్న ప్ర‌భుత్వం పోవాల్నా అంటూ ప్ర‌శ్నించారు. ఇంత అసూయ‌, ఇంత ద్వేషం క‌డుపులో ఎవ‌రికైనా ఉంటుందా? ఇంత‌కాలం ముసుగు తొడుక్కొని బ‌తికిండ‌ని, ఇన్నాళ్ల‌కు ఆ ముసుగు తొల‌గిపోయింద‌ని ఆరోపించారు. ఆయ‌న క‌డుపునిండా విష‌మేన‌ని.. విష‌మున్నోళ్లు ఇద్ద‌రు క‌డుపులో క‌త్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్న‌ర‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ట‌? ఈయ‌న‌కు ప‌ద‌వి ఇస్త‌డట.. నీకున్న ప్ర‌తిప‌క్ష హోదా ఊడ‌గొట్ట‌క‌పోతే నా పేరు మార్చుకుంటు బిడ్డ కేసీఆర్ అంటూ స‌వాల్ విసిరారు.

కేసీఆర్‌ను పాత‌రేస్తం..

2023లో నిన్ను ఓడ‌గొట్టాన‌ని.. 2024 నీకు గుండుసున్న ఇచ్చాన‌ని, స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో పాత‌రేసిన‌.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఉక్కుపాత‌రేసిన‌. జూబ్లీహిల్స్‌, కంటోన్మెంట్‌లో నీకు ఘోరీ క‌ట్టాన‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ ఘోరీపై మా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు జెండా ఎగుర‌వేస్తాన‌ని, ఇదే నా స‌వాల్ అన్నారు. చూసుకుందాం కేసీఆర్ నువ్వోనేనో వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. ప్ర‌జాపాల‌న‌నా.. పాపాల‌భైర‌వుడా? మా కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లా? ఎన్నిక‌లు ఎన్న‌డు వ‌చ్చినా చ‌రిత్ర‌లో కేసీఆర్ జ‌గిత్యాల‌లో నిన్ను పాత‌రేసే కార్య‌క్ర‌మం మా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు తీసుకుంటార‌న్నారు.

రాహుల్‌ని పీఎం చేస్తాం..

తెలంగాణ‌లో ఓ చ‌రిత్ర ఉంద‌ని, 1994-2004 వ‌ర‌కు రెండుసార్లు తెలుగుదేశం, 2004-2014 వ‌ర‌కు వెస్సార్ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్‌, 2014 నుంచి 2023 వ‌ర‌కు కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప్ర‌భుత్వం ఉంద‌న్నారు. 2023 నుంచి 2034 వ‌ర‌కు మ‌హేశ్ గౌడ్ నాయ‌క‌త్వంలో ప్ర‌జాపాల‌న ఉంటుంద‌న్నారు. ఆ నాడు వైఎస్సార్‌, డీఎస్ రెండుసార్లు ఎలాగైతే పార్టీని అధికారంలోకి తెచ్చారో మ‌ళ్లీ.. అలాగే రెండోసారి అధికారంలోకి తెస్తామ‌న్నారు. చ‌రిత్ర పున‌రావృతం చేసే మాద‌ని, చ‌రిత్రలో సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించే బాధ్య‌త మాద‌న్నారు. హైద‌రాబాద్‌ను మ‌హాన‌గ‌రంగా నిర్మించుకునే, కూలిపోయిన కూళేశ్వ‌రాన్ని స‌రి చేసేకునే బాధ్య‌త మాది అన్నారు. దేశంలోనే అత్య‌ధిక మెజారిటీతో రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డ‌మే కాదు.. 15 పార్ల‌మెంట్ సీట్ల‌ను గెలిపించి రాహుల్‌ను ప్ర‌ధాన‌మంత్రిని చేసే బాధ్య‌త నాదేన‌న్నారు.

Advertisement
Advertisement