త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eatala Rajendar | రేవంత్‌! ఆటో డ్రైవ‌ర్లకు ఏం చేస్తే మంచిదో.. అది చేయండి

Eatala Rajendar |

S

Telangana | Published On Aug 23, 2026, 2.56 pm IST

Eatala Rajendar | రేవంత్‌! ఆటో డ్రైవ‌ర్లకు ఏం చేస్తే మంచిదో.. అది చేయండి
Advertisement
  • వాళ్ల‌కు నువ్వు ఇచ్చిన హామీలు అమలు చెయ్‌.. ఏడు లక్షల కుటుంబాలకు న్యాయం చేయండి
  • ఒక్క‌డే బ‌తికి, ఒక్కడే పెద్దోడు అయ్యేటువంటి దుర్మార్గమైన పద్ధతి మంచిది కాదు
  • డ్రైవ‌రన్న‌లూ! కొట్లాడదాం.. బ‌తుకుదాం. కానీ ఆత్మహత్యలు వద్దు
  • స‌మ్మెకు నా పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంది
  • షామీర్‌పేట నివాసంలో ఆటో డ్రైవ‌ర్ల జేఏసీ నేత‌ల‌కు ఎంపీ ఈటల రాజేందర్ భ‌రోసా

Eatala Rajendar | త్రినేత్ర‌.న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు ల‌క్ష‌ల ఆటో డ్రైవ‌ర్ల కుటుంబాల‌కు ఏం చేస్తే బాగుప‌డ‌త‌రో అది చేయాల‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. గత మూడు నాలుగు ఏళ్లుగా ఓలాలు, ఉబర్లు, ర్యాపిడోలు, ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల బతుకులన్నీ చిన్నాభిన్నం అయ్యాయని వాపోయారు. రేవంత్‌రెడ్డి గ‌తంలో ఇచ్చిన హామీలు అమ‌లు చేసి వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌న్నారు. ఒక్క‌డే పెద్దోడు అయ్యే దుర్మార్గ‌మైన ప‌ద్ధ‌తి పోవాలన్నారు. ఆటో డ్రైవ‌ర్ల‌ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వంతో కొట్లాడ‌దామ‌ని.. ఎవ‌రూ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్ద‌ని కోరారు. షామీర్‌పేట నివాసంలో ఆదివారం ఆయ‌న్ను క‌లిసి స‌మ్మెకు మ‌ద్ద‌తు కోరిన ఆటో డ్రైవ‌ర్ల జేఏసీ నేత‌ల‌కు ఈట‌ల‌ భ‌రోసా క‌ల్పించారు.

వాళ్ల‌ దుఃఖం, వాళ్ల‌ కష్టం త‌మ‌ పిల్లలకు రావద్దని ఆటో డ్రైవర్లు అయిన‌ప్ప‌టికీ వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల‌లో చదివిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫీజులు కట్టలేకపోతే ఆ పిల్లల్ని క్లాస్ రూమ్లో నిలబెడుతున్నప్పుడు వారి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయ‌ని వాపోతున్నారు. ఇంటి కిరాయి కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయండని యజమానులు అనే మాటలకు ఆ కుటుంబాలు కుమిలిపోతున్నాయని బాధపడుతున్నారు.

కనిపెంచిన అమ్మ, నాన్నకు అన్నం పెట్టలేకపోతున్నాం, పాలబిల్లు కట్టలేకపోతున్నాం, ఆటోల ఫైనాన్స్ ఈఎంఐ కూడా కట్టలేక.. చావు తప్ప మరో మార్గం లేదని చెప్పి అన్ని ఆటో సంఘాలు సావో రేవో తేల్చుకోవడం కోసం “మేం బతుకుడా.. సచ్చుడా” తేల్చుకోవడం కోసం ఆటో సంఘాల జేఏసీలుగా ఏర్పడి వాళ్ళు మాతో చెప్తున్నప్పుడు మాలాంటివాళ్ళం కూడా కుంగిపోతూ ఉన్నాం.

ఇప్పటికే  200 మంది ఆటో డ్రైవ‌ర్ల ఆత్మ‌హ‌త్య‌..

ఈ వ్యవస్థలో ఎట్లా బతికటోడు అట్లా బతకాలి తప్పా ఒక్కడే బతికి, ఒక్కడే పెద్దోడు అయేటువంటి దుర్మార్గమైన పద్ధతి పోవాలి. ఒకవైపు లక్షల కోట్లకు పడిగలిత్తే వాడు ఒకవైపు ఉన్నాడు. కనిపెంచిన అమ్మా నాన్నకు, కన్న బిడ్డలకు కూడా అన్నం పెట్టలేక కుమిలిపోతున్న కుటుంబాలు ఒకవైపు ఉన్నాయి. ఇవాళ బయటికి వస్తలేవు కానీ అనేక రకాలుగా ఇప్పటికే 200 మంది పైబడి ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నారు. భర్త ఆటో నడితే తప్ప జీవనం లేని కుటుంబాలన్నీ కూడా అనాథ‌లుగా మారిపోయాయి.

చనిపోయిన వారి భార్యలు ఆ పిల్లలే సర్వసంగా నాలుగు ఇళ్లల్లో పని చేసుకొని బతికేటువంటి తీరు అత్యంత జుగుప్సాకరంగా, బాధాకరంగా పరిణమించింది. పాలకులుగా అన్ని రంగాల పట్ల.. సమాజంలో ఎవరెవరైతే ఇలాంటి దుస్థితి ఎదుర్కుంటున్నారో ఇలాంటి బాధలని వెళ్లబోసుకుంటున్నారో అలాంటి వాళ్ళకు ఇయాళ‌ ఏం చేస్తే బాగుపడతారు.. ఏ నిర్ణయాలు తీసుకుంటే వాళ్ల‌ కష్టం తీరుతదో అలాంటి నిర్ణయాలు తీసుకునే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.

ఆటోల సమ్మెకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. రేవంత్ రెడ్డి భూమి మీదకి వచ్చి.. నువ్వు గతంలో ఏ హామీలు అయితే ఇచ్చినావో ఆ హామీలు అమలు చేయండి. సమస్యలను పరిష్కరించి ఏడు లక్షల కుటుంబాలని ఆదుకోండి. వీరికి తెలంగాణ సమాజం, మేం అండగా ఉంటాం. ఆటో డ్రైవర్లకు నా విజ్ఞప్తి.. కొట్లాడదాం.. బ‌తుకుదాం. నిరాశలోకి వెళ్లకండి, ఆత్మహత్యలు చేసుకోకండి అని ఎంపీ ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. కాగా నేటి అర్ధ‌రాత్రి నుంచి ఆటోల బంద్‌కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే.

ఇవే ఆటో డ్రైవ‌ర్ల ప్రధాన డిమాండ్లు

  • ఆర్టీసీలో ఈ ఆటోల‌ ప్రతిపాదన విరమించుకోవాలి
  • ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
  • ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామని 12 వేల రూపాయలు బకాయిలతో సహా చెల్లించాలి
  • తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త పర్మిట్లు మంజూరు చేయాలి
  • కార్యాలయంలో కార్పొరేట్ రేడియం దందా నిలిపివేయాలి
Advertisement
Advertisement