త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | 60 రూపాయల‌తో ఎట్ల బ‌తుకుమంట‌వ్‌.. సర్వేయ‌ర్లు తిర‌గ‌బ‌డ‌క‌ముందే పిలిచి మాట్లాడు

Harish Rao | ఎక‌రానికి రూ.60 తీసుకొని లైసెన్స్ స‌ర్వేయ‌ర్ల‌ను ఎట్ల బ‌తుకుమంటావ‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హ‌రీశ్‌రావు సీఎం రేవంత్‌ను ప్ర‌శ్నించారు. 6,000 మంది సర్వేయర్లు, వారి వెనకున్న 6,000 కుటుంబాలు ఒక శక్తిగా మారి తిరగబడితే ఏమవుతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆలోచించుకోవాలన్నారు.

S

Telangana | Published On Aug 19, 2026, 2.11 pm IST

Harish Rao | 60 రూపాయల‌తో ఎట్ల బ‌తుకుమంట‌వ్‌.. సర్వేయ‌ర్లు తిర‌గ‌బ‌డ‌క‌ముందే పిలిచి మాట్లాడు
Advertisement
  • ఢిల్లీలో ఏమైందో రేవంత్‌, పొంగులేటి ఆలోచించుకోవాలి
  • పైగా లంచాలు తీసుకోవాల‌ని చెప్ప‌డం దివాళాకోరుత‌నమే
  • ప్ర‌భుత్వం స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోకుంటే ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్షం వ‌ద్ద‌కే వ‌స్తారు
  • చిన్నారెడ్డి సీఎంవో స్పెషల్ సెక్రటరీ శేషాద్రితో మాట్లాడితే సీఎం ఈగో హర్ట్ అయింద‌ట‌
  • మీకు ఈగోలు ముఖ్యమా? ప్రజా సమస్యలు ముఖ్యమా?
  • లైసెన్స్‌ స‌ర్వేయ‌ర్ల స‌మావేశంలో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

Harish Rao | Harish Rao |త్రినేత్ర‌.న్యూస్: ఎక‌రానికి రూ.60 తీసుకొని లైసెన్స్ స‌ర్వేయ‌ర్ల‌ను ఎట్ల బ‌తుకుమంటావ‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హ‌రీశ్‌రావు సీఎం రేవంత్‌ను ప్ర‌శ్నించారు. 6,000 మంది సర్వేయర్లు, వారి వెనకున్న 6,000 కుటుంబాలు ఒక శక్తిగా మారి తిరగబడితే ఏమవుతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆలోచించుకోవాలన్నారు. యువత తిరగబడే పరిస్థితి రాకముందే, వెంటనే సర్వేయర్లను పిలిచి మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. మొన్న ఢిల్లీలో విద్యార్థులు తిర‌గ‌బ‌డితే సాక్షాత్తు కేంద్ర‌మంత్రే రాజీనామా చేశార‌న్న విష‌యాన్ని గుర్తెర‌గాల‌న్నారు. ముఖ్యమంత్రికి మీ దెబ్బేంటో అర్థమయ్యేలా గట్టిగా పోరాడాల‌ని, మీ వెన్నంటి మేముంటామ‌ని లైసెన్స్ సర్వేయర్లకు భ‌రోసా ఇచ్చారు. అధైర్య‌ప‌డి ప్రాణాలు తీసుకోవ‌ద్దని సూచించారు. బుధ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో లైసెన్స్ సర్వేయర్లతో సమావేశమైన అనంత‌రం ఆయన మాట్లాడారు.

తమ హక్కుల కోసం 6 వేల మంది లైసెన్స్ సర్వేయర్లు ధర్నా చేస్తే.. వాళ్లను పశువుల్లా ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. కనీసం వారికి అన్నం కూడా పెట్టకుండా హింసించడం దారుణం. మీరు హరీశ్ రావు దగ్గరికి, బీఆర్ఎస్ నాయకుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? అని సర్వేయర్లను ప్రభుత్వం బెదిరించడం సిగ్గుచేటు. ప్రభుత్వం సమస్యలను పట్టించుకోనప్పుడే ప్రజలు ప్రతిపక్షం దగ్గరికి వస్తారు, అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. కష్టాల్లో ఉన్న ప్రజల పక్షాన నిలబడి, ప్రభుత్వ మెడలు వంచడానికే ప్రతిపక్షంగా మేమున్నాం.

బీటెక్, ఎంటెక్, సివిల్ ఇంజినీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదివిన యువశక్తిని ఉద్దేశించి, ఐఏఎస్ అధికారి లోకేష్ కుమార్ గారు అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం దుర్మార్గం. తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన సర్వేయర్లను ఉద్దేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చేతిలో ఏది ఉంటే దానితో కొట్టడానికి ప్రయత్నించడం ఈ ప్రభుత్వ అహంకారానికి, అణచివేతకు నిదర్శనం.

విద్యార్థులు, యువకులు తిరగబడితే మొన్న ఢిల్లీలో ఏమైందో దేశం మొత్తం చూసింది. వాళ్ల దెబ్బకు కేంద్రమంత్రే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలే కదా అని చిన్నచూపు చూస్తే వాళ్లు చిచ్చరపిడుగులై వ్యవస్థలనే కదిలించారు. సీఎంవో అధికారుల తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. చిన్నారెడ్డి గారు లౌడ్ స్పీకర్ పెట్టి సీఎంవో స్పెషల్ సెక్రటరీ శేషాద్రి గారితో మాట్లాడితే.. ముఖ్యమంత్రి గారి ఈగో హర్ట్ అయింది, మీరు వాళ్లతో మాట్లాడొద్దు, వెళ్లగొట్టండి అని చెప్పడం అహంకారం కాదా? ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించాల్సిన తీరు ఇదేనా? మీకు ఈగోలు ముఖ్యమా? ప్రజా సమస్యలు ముఖ్యమా?

ఆకాశం నుంచి ఊడిప‌డ్డ‌వా రేవంత్‌?

రేవంత్ రెడ్డి ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? ముఖ్యమంత్రి పదవి ప్రజలు పెట్టిన భిక్ష. అధికారులకు జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టే పన్నుల నుంచే అన్న విషయం మర్చిపోవద్దు. అప్పులపాలై, కుటుంబం గడవక ఇద్దరు లైసెన్స్ సర్వేయర్లు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. స‌ర్వేయ‌ర్ల‌కు కనీస జీతం లేదు, టీఏ/డీఏలు లేవు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. సొంత డబ్బులు పెట్టుకుని సర్వే చేయాల్సిన దుస్థితి.

లంచాలు తీసుకోండని చెప్ప‌డం దివాళాకోరుతనం..

వంద రూపాయల పెట్రోల్ కొట్టి, 50 రూపాయలు పెట్టి అన్నం తిని.. ఎకరానికి కేవలం 60 రూపాయల చొప్పున సర్వే చేస్తే బతికేదెట్లా? ఇదే విషయం కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్తే.. మీరు లంచాలు తీసుకోండి, వసూలు చేసుకోండి అని చెప్పడం ఈ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం.

70 వేల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతూ డబ్బా కొట్టుకుంటున్నాడు. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు పెట్టి, రిజల్ట్స్ ఇస్తే.. వీళ్లు కేవలం నియామక పత్రాలు ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా మేం నిలదీస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 16,500 ఉద్యోగాలు మాత్రమే అని ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వచ్చి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.

ఇప్పుడేమో ఈ 6 వేల మందికి ఇచ్చిన లైసెన్స్‌ల‌ను కూడా ఉద్యోగాల ఖాతాలో వేసుకుని మోసం చేస్తున్నారు. లైసెన్స్ సర్వేయర్లు ఎవరూ ఆందోళన చెందవద్దు, అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దు. మీకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మీ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అన్ని జిల్లాల్లో మీరు చేసే ఆందోళన కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు అండగా ఉంటారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప. పోరాటమే సమస్యలకు పరిష్కారం అని హ‌రీశ్‌రావు ఉద్ఘాటించారు.

Advertisement
Advertisement