త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana RTC employees | ఆర్టీసీ లాభాల్లో ఉంటే ఆ బకాయిల సంగతేంటి?

ఆర్టీసీ లాభాల్లో ఉందని సీఎం రేవంత్ చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంత? రూ.2,600 కోట్ల బకాయిలు, రిటైర్డ్ కార్మికుల కష్టాలపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

J

Telangana | Published On Sep 2, 2026, 6.13 pm IST

Telangana RTC employees | ఆర్టీసీ లాభాల్లో ఉంటే ఆ బకాయిల సంగతేంటి?
Advertisement
  • ఆర్టీసీ లాభాల్లో ఉందని సీఎం చెబుతుంటే, ప్రభుత్వం నుంచి రూ.2,600 కోట్లు రావాలని ఎండీ లేఖ రాయడంపై హరీశ్ రావు విమర్శలు
  • రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక సుమారు 18 వేల మంది విశ్రాంత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన
  • ఆర్థిక కష్టాలతో ఇప్పటికే 400 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడి
  • వెంటనే ప్రభుత్వ బకాయిలు విడుదల చేసి, కార్మికులకు గ్రాట్యుటీ, పీఆర్సీ ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్

Telangana RTC employees | త్రినేత్ర.న్యూస్ : ఆర్టీసీ లాభాలపై వేదికల మీద సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీ బకాయిలు, రిటైర్డ్ కార్మికుల కష్టాలపై ఎక్స్ వేదికగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

కాగితాల మీదే లాభాలు.. ఇదొక ప్రచార ప్రభుత్వం

వేదికల మీద సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆర్టీసీ వేల కోట్ల లాభాల్లో ఉందని గొప్పలు చెబుతున్నారని, కానీ వాస్తవానికి ప్రభుత్వం నుంచి సంస్థకు రూ. 2,600 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని హరీశ్ రావు గుర్తుచేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ (RTC MD) స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేవలం కాగితాల మీద మాత్రమే సంస్థ లాభాల్లో ఉందని, క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, విశ్రాంత కార్మికులను అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజా ప్రభుత్వం కాదని, ప్రచార ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు.

400 మంది కార్మికుల బలిదానం

ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో అటు ఉద్యోగులకు పీఆర్సీ (PRC), ఏరియర్స్ (Arrears) అందడం లేదని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 30–40 ఏళ్ల పాటు సంస్థకు సేవలందించిన 18 వేల మంది విశ్రాంత ఉద్యోగులు నేటికీ తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ (Retirement Benefits) కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. పెన్షన్ సౌకర్యం లేని ఈ కార్మికులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ (Leave Encashment) మాత్రమే చివరి ఆసరా అని, అవి కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే 400 మంది విశ్రాంత ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే బకాయిలు విడుదల చేయాలి

"రేవంత్ రెడ్డి గారూ.. మైకుల ముందు గొప్పలు చెప్పడం కాదు, ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో అలుముకున్న చీకట్లను చూడండి. మీ పాలనలో భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతున్న ఆర్టీసీ సంస్థను గమనించండి" అని హరీశ్ రావు సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ. 2,600 కోట్ల బకాయిలను రిలీజ్ చేయాలని, కార్మికులకు రావాల్సిన ఏరియర్స్, గ్రాట్యుటీ వెంటనే చెల్లించి వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement