త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR Seed Ganesh | కేటీఆర్‌కు ‘సీడ్ గణేశ్’.. నిమజ్జనం చేశాక పచ్చని మొక్కగా మారనున్న ఈ వినాయకుడు

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందం రూపొందించిన 'సీడ్ గణేశ్' విగ్రహాన్ని కేటీఆర్‌కు అందజేశారు. ఏంటి ఈ సీడ్ గణేశ్ ప్రత్యేకత?

J

Hyderabad | Published On Sep 2, 2026, 6.34 pm IST

KTR Seed Ganesh | కేటీఆర్‌కు ‘సీడ్ గణేశ్’.. నిమజ్జనం చేశాక పచ్చని మొక్కగా మారనున్న ఈ వినాయకుడు
Advertisement
  • తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు 'సీడ్ గణేశ్' విగ్రహాన్ని అందజేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందం
  • సహజ మట్టి, కోకోపీట్, కొబ్బరి పీచు, స్థానిక చెట్ల విత్తనాలతో పర్యావరణహితంగా ఈ విగ్రహాల తయారీ
  • నిమజ్జనం తర్వాత ఇంట్లోనే పచ్చని మొక్కగా మారనున్న సీడ్ గణేశ్
  • ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన ఈ సీడ్ గణేశ్ క్యాంపెయిన్

KTR Seed Ganesh | త్రినేత్ర.న్యూస్ : వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా (Eco-friendly) జరుపుకోవాలనే సదుద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవేందర్ 'సీడ్ గణేశ్' (Seed Ganesh) విగ్రహాన్ని అందజేశారు. ప్రకృతిని కాపాడేందుకు మట్టి వినాయకులను పూజించాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు పిలుపునిచ్చారు.

KTR Receives Seed Ganesh from Green India Challenge Team

ఏంటి ఈ సీడ్ గణేశ్ స్పెషాలిటీ?

సాధారణంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP), రసాయన రంగులతో చేసిన విగ్రహాలతో మన నీటి వనరులు తీవ్రంగా కలుషితం అవుతుంటాయి. వీటికి చెక్ పెడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందం పూర్తిగా సహజమైన మట్టి, కోకోపీట్, కొబ్బరి పీచుతో ఈ విగ్రహాలను తయారు చేస్తోంది. అంతేకాకుండా వీటిలో వేప, చింత వంటి స్థానిక వృక్షాల విత్తనాలను (Seeds) పొందుపరిచారు. పూజలు పూర్తయిన తర్వాత ఈ విగ్రహాన్ని ఇంట్లోని కుండీలో లేదా పెరట్లో పెట్టి నీళ్లు పోస్తే చాలు.. విగ్రహం కరిగిపోయి అందులోని విత్తనాలు మొలకెత్తి పచ్చని మొక్కగా రూపాంతరం చెందుతాయి. దీనిద్వారా భగవంతుడు మన ఇంట్లోనే సజీవంగా మొక్క రూపంలో ఉండిపోతాడని రాఘవేందర్ వివరించారు.

KTR Receives Seed Ganesh from Green India Challenge Team

చిరంజీవి లాంచింగ్.. హరితహారం స్ఫూర్తి

మాజీ సీఎం కేసీఆర్ (KCR) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'హరితహారం' స్ఫూర్తితో 2018లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభమైంది. "3 మొక్కలు నాటండి, 3 ఏళ్లు సంరక్షించండి, మరో 3 మందిని నామినేట్ చేయండి" అనే కాన్సెప్ట్‌తో ఈ ఉద్యమం విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే సీడ్ గణేశ్ క్యాంపెయిన్‌ను ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు. మొక్కలు నాటడం ఇకపై ఆప్షన్ కాదని, అది మన కనీస అవసరమని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పష్టం చేసింది. మేధావులు, సెలబ్రిటీలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్స్ (Apartment Associations), ఆలయ కమిటీలు అందరూ ఈ పర్యావరణహిత సీడ్ గణేశ్‌ను స్వీకరించి పండుగను అర్థవంతంగా జరుపుకోవాలని కోరింది.

Advertisement
Advertisement