త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLCs | నిరీక్ష‌ణ‌కు తెర‌.. 11 గంట‌ల‌కు ఎమ్మెల్సీలుగా కోదండ‌రాం, అజారుద్దీన్ ప్ర‌మాణ‌స్వీకారం

MLCs | సుమారు ఎనిమిది నెల‌ల నిరీక్ష‌ణ‌కు మ‌రో రెండు గంట‌ల్లో తెర‌ప‌డ‌నుంది. ప్రొఫెస‌ర్ కోదండ‌రాం (Kodandaram), మంత్రి అజారుద్దీన్ (Azharuddin) ఎట్టకేల‌కు ఎమ్మెల్సీలుగా (MLCs) ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

G

Telangana | Published On Apr 27, 2026, 9.16 am IST

MLCs | నిరీక్ష‌ణ‌కు తెర‌.. 11 గంట‌ల‌కు ఎమ్మెల్సీలుగా కోదండ‌రాం, అజారుద్దీన్ ప్ర‌మాణ‌స్వీకారం
Advertisement

MLCs | త్రినేత్ర‌.న్యూస్‌: సుమారు ఎనిమిది నెల‌ల నిరీక్ష‌ణ‌కు మ‌రో రెండు గంట‌ల్లో తెర‌ప‌డ‌నుంది. ప్రొఫెస‌ర్ కోదండ‌రాం (Kodandaram), మంత్రి అజారుద్దీన్ (Azharuddin) ఎట్టకేల‌కు ఎమ్మెల్సీలుగా (MLCs) ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి త‌న కార్యాల‌యంలో వారితో ప్ర‌మాణం చేయించ‌నున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల ఫైల్​పై గవర్నర్ గ‌త శ‌నివారం సంతకం చేసిన విషం తెలిసిందే. దీంతో గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌ల నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎనిమిది నెలలుగా కొన‌సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.

మూడేండ్లుగా వివాదం..

గ‌త మూడేండ్లుగా గవర్నర్​ కోటా ఎమ్మెల్సీలపై వివాదం కొనసాగుతున్న‌ది. వాస్త‌వానికి ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు 2023, మే 27న‌ ఖాళీ అయ్యాయి. అప్పుడు అధికారంలో ఉన్న‌ కేసీఆర్ స‌ర్కార్ బీఆర్ఎస్ (BRS) నేత‌లు దాసోజు శ్రవణ్ కుమార్‌, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. అయితే అప్పటి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ వీరి పేర్ల‌ను తిరస్కరించారు. ఆ త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం, బీఆర్ఎస్ అధికారం కోల్పోవ‌డం, ప్ర‌భుత్వం మార‌డం జ‌రిగిపోయాయి.

సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ నేత‌లు

2023లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఈ రెండు సీట్లకు కోదండరాం, అమెర్‌ అలీఖాన్‌ల పేర్లను ప్రతిపాదించింది. గవర్నర్‌ ఆమోదంతో కొద్ది నెలల పాటు వారు ఎమ్మెల్సీలుగా కొనసాగారు. అయితే ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్‌ తిరస్కరించడం, కొత్త వారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయ‌డం రాజ్యాంగ వ్యతిరేకమంటూ దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ 2024 ఆగస్టు 4న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం గతేడాది ఆగస్టు 13న కోదండరాం, అమేర్ అలీఖాన్‌‌‌‌ నియామకాన్ని కోర్టు రద్దు చేసింది. అదే సమయంలో కొత్త పేర్లను గవర్నర్​కు సిఫార్సు చేయవచ్చని సూచించింది.

దీంతో కోదండరాం పేరును కొనసాగిస్తూ.. అమెర్‌ అలీఖాన్‌ స్థానంలో అజారుద్దీన్‌ పేరును అప్పటి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు 8 నెలల కింద గవర్నర్‌‌‌‌కు సిఫార్సు చేశారు. కేసు విచారణలో ఉండటంతో గవర్నర్‌ ఆ ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టారు. తాజాగా చేసిన సూచన మేరకు గ‌త ఆదివారం (ఏప్రిల్ 19న‌) సీఎం రేవంత్‌రెడ్డి కొత్త గవర్నర్‌ శివప్రసాద్‌ శుక్లాను కలిసి వారిద్ద‌రిని ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేయాలని కోరారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న గవర్నర్‌.. కోదండరాం, అజారుద్దీన్‌లను శనివారం నామినేట్‌ చేశారు.

అజారుద్దీన్‌కు టెన్ష‌న్‌..

జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అజారుద్దీన్‌ను సీఎం రేవంత్ రెడ్డి త‌న కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో గ‌తేడాది అక్టోబరు 31న ఆయ‌న‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌కు మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ‌ను కేటాయించారు. అయితే ఏ స‌భ‌లో స‌భ్యుడు కాక‌పోవ‌డం, అస‌లు ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలుపుతారో? లేదో? అనే సందేహాల న‌డుమ అజారుద్దీన్ మంత్రి ప‌ద‌వి ఉంటుందా? పోతుందా? అనే ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి. అజారుద్దీన్‌ మంత్రిగా కొనసాగాలంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆరునెలలలోపు శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఆ గడువు 30వ తేదీతో ముగిసిపోనుంది. అయితే వీట‌న్నింటికీ చెక్ పెడుతూ.. గ‌వ‌ర్న‌ర్‌ను సీఎం రేవంత్ క‌ల‌వ‌డం, ఆయ‌న ఆమోదించ‌డం వారం రోజుల్లో జ‌రిగిపోయాయి. దీంతో అజారుద్దీన్‌కు టెన్ష‌న్‌కు ఫుల్‌స్టాప్ ప‌డిన‌ట్ల‌యింది.

Advertisement
Advertisement