త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ప్రజా శ్రేయస్సు కోసం ఆర్టీసీ సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం విజ్ఞప్తి

Ponnam Prabhakar | సంస్థ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె (RTC Strike) విరమించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. సమస్యకు సమ్మె పరిష్కారం కాదని ఆర్టీసీ (TGS RTC) కార్మకులకు తెలిపారు.

G

Telangana | Published On Apr 22, 2026, 10.54 am IST

Ponnam Prabhakar | ప్రజా శ్రేయస్సు కోసం ఆర్టీసీ సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం విజ్ఞప్తి
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: సంస్థ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె (RTC Strike) విరమించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. సమస్యకు సమ్మె పరిష్కారం కాదని ఆర్టీసీ (TGS RTC) కార్మకులకు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్ర‌భుత్వం న‌లుగురు అధికారులతో కమిటీ వేసింద‌న్నారు. నాలుగు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించామ‌ని తెలిపారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నామనడం పొరపాటని చెప్పారు. కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. అవి వెంటనే పరిష్కారం చేయదగినవేనని వివరించారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల అంశం పెండింగ్​లో ఉందని చెప్పారు. ఈ రెండు అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చరించాల్సి ఉంద‌ని, వాటిని అధ్యయనం చేయడానికి నాలుగు వారల గడువు అడిగామ‌న్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సీఎం, డిప్యూటీ సీఎం దగ్గర చర్చిస్తామని చెప్పారు.

ఒక‌టో తారీఖునే జీతాలు..

`ఆర్టీసీ విలీనం ఆలస్య‌మైనా ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు వస్తున్నాయి. గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం, నాయకత్వ అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడగానే గతంలో పెండింగ్‌లో ఉన్న 2017 పీఆర్సీ క్లియర్ చేశాం.పెండింగ్ డీఏలు లేకుండా క్లియర్ చేశాం. 2013 పెండింగ్ బాండ్స్ క్లియర్ చేశాం. రూ.1205 కోట్లు ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించాం. రూ.690 కోట్లు ఉన్న సీసీఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించాం. ఇవే కాకుండా నెల వారీగా పీఎఫ్, సీసీఎస్‌కి రూ.75 కోట్లు చెల్లిస్తున్నాం.

ఉద్యోగులపై పని భారం పడకుండా ఉండడానికి 4538 ఉద్యోగాల నియామకాలు భర్తీ త్వరలోనే పూర్తవుతుంది. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 1134 కారుణ్య నియామకాలు చేపట్టాం. గత ప్రభుత్వంలో వివిధ కారణాలతో శాశ్వతంగా సర్వీసు నుంచి తొల‌గించిన వారిలో ఇప్పటి వరకు దాదాపు 250 మందికి తిరిగి ఉద్యోగాలు ఇచ్చాం. అన్ని అంశాలు పరిష్కారం చేస్తాం. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న‌ది. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు వద్దు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఆర్టీసీలో ఏం జరిగిందో కార్మికులందరికీ తెలుసు.

ఆర్టీసీలో ప్రయాణించేది పేదలు, గ్రామీణ ప్రాంత ప్రజలు, మన అక్కా చెల్లెల్లు. ప్రతి రోజు 65 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే అందులో 45 లక్షల మంది మహిళలే ఉన్నారు. ఆర్టీసీలో నిత్యం ఉపాధి కోసం, విద్య, వైద్యం కోసం పోయే పరిస్థితి. ప్రభుత్వం పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్న.. సమ్మె వద్దు`

మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు..

ప్రజాస్వామ్య పద్ధతి లో మీ నాయకులు నిరసన తెలుసుకోవచ్చు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు. పేద ప్రజల ప్రయాణాలకు ఇబ్బందులు కలగజేయవద్దు.పేద ప్రజలకు కార్లలో పోయే స్థోమత లేదు. ప్రతి ఒక్క ఆర్టీసీ కుటుంబ సభ్యుడికి విజ్ఞప్తి చేస్తున్న.. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరుపున కొట్లాడి సాధించుకుందాం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. మీ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉన్నాం. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దు.

నేను విద్యార్థి నాయకుడిని కార్మికులకు అండగా ఉంటా. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లైఫ్ లైన్ అయిన ఆర్టీసీ.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. మీ నాయకుల‌కు నిరసనలు తెలుపుకొనే హ‌క్కు ఉంది. మిగతా వారంతా విధుల్లో చేరి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్న` అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు.

Advertisement
Advertisement