త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivasa Reddy | 5 నుంచి అమ‌ల్లోకి రానున్న స‌వ‌రించిన భూముల ధ‌ర‌లు : మంత్రి పొంగులేటి

Ponguleti Srinivasa Reddy | రాష్ట్రంలో ఎట్ట‌కేల‌కు స‌వ‌రించిన భూముల ధ‌ర‌లు ఈ నెల 5వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానున్న‌ట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. భూముల మార్కెట్ విలువల సవరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టాం.. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా కొత్త విలువల నిర్ణయించామ‌ని మంత్రి తెలిపారు.

S

Telangana | Published On Jun 3, 2026, 6.06 pm IST

Ponguleti Srinivasa Reddy | 5 నుంచి అమ‌ల్లోకి రానున్న స‌వ‌రించిన భూముల ధ‌ర‌లు : మంత్రి పొంగులేటి
Advertisement

స‌వ‌ర‌ణ శాస్త్రీయం, హేతుబ‌ద్ధంగా చేప‌ట్టాం..
క్షేత్ర‌స్థాయి అధ్య‌య‌నం త‌ర్వాతే కొత్త విలువ‌లు

Ponguleti Srinivasa Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఎట్ట‌కేల‌కు స‌వ‌రించిన భూముల ధ‌ర‌లు ఈ నెల 5వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానున్న‌ట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. భూముల మార్కెట్ విలువల సవరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టాం.. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా కొత్త విలువల నిర్ణయించామ‌ని మంత్రి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌న మేర‌కు ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక ప్రకారం ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించి శాస్త్రీయ పద్ధతిలో కొత్త విలువలను నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు.

ఆరు నెలల వ్యవధిలోనే రెండు సార్లు భూముల ధరలను పెంచారు.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సమగ్ర కసరత్తు లేకుండా, అశాస్త్రీయ పద్దతుల్లో 2021-22 సంవత్సరాల్లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రెండు సార్లు భూముల ధరలను పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సవరణలు క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా కేవలం శాతం గణనల ఆధారంగా, పట్టికల ప్రకారం చేపట్టడం వల్ల కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా విలువలు నిర్ణయించబడ్డాయని తెలిపారు.

వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య భారీ అంతరం

వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య భారీ అంతరం ఉండటం వల్ల భూ లావాదేవీలలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు రాష్ట్రంలోని అన్ని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల (SROలు) పరిధిలో మార్కెట్ విలువల పునర్విమర్శ చేపట్టామని మంత్రి వెల్లడించారు. గ్రామీణ, పట్టణ మార్కెట్ విలువల సవరణ కమిటీలు స్థానిక పరిస్థితులను పరిశీలించి సవరించిన విలువలను రూపొందించి ఆమోదించాయని చెప్పారు.

అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేస్తూ..

ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యం, వృద్ధి రేటు, ఇటీవల జరిగిన భూముల వేలాలు, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, కొత్త రహదారులు, వృద్ధి కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR), పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్ విలువలను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఫ్లాట్ల విషయంలో గతంలో కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ అంతస్తుల వారీగా అధిక రేట్లు నిర్ణయించడం వల్ల అసమానతలు ఏర్పడ్డాయని, అలాంటి ప్రాంతాల్లో అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేస్తూ మార్కెట్ విలువలను హేతుబద్ధీకరించినట్లు వివరించారు. ఇప్పటికే అధిక మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు ప్రతిపాదించలేదన్నారు.

ఆర్‌సీసీ, నాన్-ఆర్‌సీసీ నిర్మాణాల రేట్ల స‌వ‌ర‌ణ‌..

అదేవిధంగా ప్రాంతాల అభివృద్ధి స్థాయిని బట్టి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA), CURE పరిధి మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కనీస ప్రాథమిక రేట్లను కూడా నిర్ణయించినట్లు తెలిపారు. నిర్మాణ వ్యయాలను కూడా 2021 తర్వాత సవరించలేదని, గత ఐదేళ్లలో నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో నిర్మాణ రేట్ల సవరణ అవసరమైందని మంత్రి పేర్కొన్నారు. అనేక మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ కావడం, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆర్‌సీసీ, నాన్-ఆర్‌సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సవరించినట్లు వెల్లడించారు.

పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సవరణలు

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ సవరణలు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, భూ లావాదేవీలలో పారదర్శకత పెంపునకు, ప్రభుత్వ ఆదాయ వృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement