త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PRLIS | పాలమూరు డీపీఆర్‌ను వెనక్కి పంపడం దుర్మార్గం : నిరంజన్‌రెడ్డి

PRLIS | పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కేంద్రం వెనక్కి పంపడం దుర్మార్గమని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్రా అధికారుల చేతుల్లో పెట్టిందని, చంద్రబాబు ప్రయోజనాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.

P

Telangana | Published On Aug 10, 2026, 6.58 pm IST

PRLIS | పాలమూరు డీపీఆర్‌ను వెనక్కి పంపడం దుర్మార్గం : నిరంజన్‌రెడ్డి
Advertisement

PRLIS | పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కేంద్రం వెనక్కి పంపడం దుర్మార్గమని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్రా అధికారుల చేతుల్లో పెట్టిందని, చంద్రబాబు ప్రయోజనాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులకు లేని అభ్యంతరాలు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రా ప్రయోజనాల కోసం బీజేపీ తెలంగాణను బలిపెడుతోందని ఆరోపించారు.

తెలంగాణకు చెందిన ఎనిమిది మంది బీజేపీ, ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎంపీలు చేతులు ముడుచుకుని కూర్చున్నారని, రాష్ట్ర ప్రాజెక్టుల కోసం పార్లమెంట్‌లో ఒక్కరు కూడా గళమెత్తడం లేదని విమర్శించారు. కర్ణాటకకు చెందిన ఓ ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్రం.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయహోదా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌, బీజేపీలు కపట నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే హైడ్రాలజీ మినహా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అవసరమైన అన్ని అనుమతులు సాధించామని తెలిపారు. చివరి నిమిషంలో డీపీఆర్‌ను వెనక్కి పంపడం సరికాదన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు కూడా క్లియరెన్స్‌ ఇచ్చిన నేపథ్యంలో పర్యావరణ అనుమతి కూడా ప్రాజెక్టుకు వచ్చినట్లేనని పేర్కొన్నారు. ఇక నీటి కేటాయింపులతో కూడిన హైడ్రాలజీ అంశం మాత్రమే మిగిలిందని, అది కూడా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ పరిధిలో ఉందని వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం తనకున్న నీటి కేటాయింపుల నుంచే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలను ఇప్పటికే కేటాయించుకుందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే డీపీఆర్‌ను ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. డీపీఆర్‌ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షంతో కూడిన ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపాలని సూచించారు. పాలమూరు రైతాంగానికి అన్యాయం జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు చరిత్రలో శాశ్వత ద్రోహులుగా నిలిచిపోతారని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.

Advertisement
Advertisement