త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Valigonda Narasimha | మేస్త్రీ ప‌ని చేస్తూనే ఓయూ డాక్ట‌రేట్ సాధించాడు.. వ‌లిగొండ న‌ర‌సింహ స‌క్సెస్ స్టోరీ ఇదీ..

Valigonda Narasimha | లక్ష్యం స్పష్టంగా ఉండి, చేసే కృషిలో పట్టుదల ఉంటే పేదరికం ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించారు నల్లగొండ జిల్లాకు చెందిన వలిగొండ నరసింహ( Valigonda Narasimha ). రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, చిన్ననాటి నుంచే కూలీ పని, మేస్త్రీ పని చేస్తూనే ఉన్నత చదువుల వైపు అడుగులు వేశాడు. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University ) 85వ స్నాతకోత్సవంలో రాజనీతి శాస్త్రంలో (Political Science) PhD డాక్టరేట్ అందుకొని నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు.

S

Telangana | Published On Sep 12, 2026, 8.11 am IST

Valigonda Narasimha | మేస్త్రీ ప‌ని చేస్తూనే ఓయూ డాక్ట‌రేట్ సాధించాడు.. వ‌లిగొండ న‌ర‌సింహ స‌క్సెస్ స్టోరీ ఇదీ..

సంక్షిప్త సారాంశం

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహాపురుషులవుతారు.. క‌ఠిన శ్రమ, పట్టుదల ఉంటే సామాన్య మానవులు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి మార్గదర్శకులుగా మారగలరు. ఓ యువకుడు కూడా పేద‌రికంలో పుట్టి క‌ష్టాల‌ను సైతం అధిగ‌మించి ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాడు. రెక్కాడితే కాని డొక్కాడ‌ని ఆ నిరుపేద యువ‌కుడు.. ప్ర‌భుత్వ బ‌డులు, కాలేజీల్లోనే త‌న విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. క‌డుపు నింపుకునేందుకు, కుటుంబాన్ని పోషించేందుకు ఓ వైపు మేస్త్రీ ప‌ని చేస్తూనే.. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఉస్మానియా యూనివ‌ర్సిటీ( Osmania University )లో రాజ‌నీతి శాస్త్రం( Political Science )లో పీహెచ్‌డీ( PhD ) పూర్తి చేసి డాక్ట‌రేట్ పుచ్చుకున్నాడు. మ‌రి మేస్త్రీ ప‌ని చేస్తూనే ఓయూ డాక్ట‌రేట్ సాధించిన ఆ యువ‌కుడు ఎవ‌రో కాదు.. ఉస్మానియా వేదిక‌గా సామాజిక ఉద్య‌మాల్లో పాల్గొంటూ అంద‌రికీ సుప‌రిచితులైన వ‌లిగొండ న‌ర‌సింహ‌( Valigonda Narasimha )నే ఆయ‌న‌.

Advertisement

Valigonda Narasimha | వ‌లిగొండ న‌ర‌సింహ‌( Valigonda Narasimha ).. న‌ల్ల‌గొండ జిల్లా, చిట్యాల మండ‌లం, ఏపూరు గ్రామవాసి. చిన్న‌త‌నంలోనే త‌న త‌ల్లిని కోల్పోయాడు. తండ్రే అన్ని తానై చూసుకున్నాడు. ప్రాథ‌మిక విద్య నుంచి మొద‌లుకుంటే పీహెచ్‌డీ ( PhD )వ‌ర‌కు అంతా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, కాలేజీల్లోనే. 1 నుంచి 7వ త‌ర‌గ‌తి వ‌ర‌కు కోతులాపురం, ఏపూరు ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో, 8 నుంచి 10 వ‌ర‌కు గుండ్రాంప‌ల్లి జ‌డ్పీహెచ్ఎస్‌లో చ‌దివాడు.

పాఠ‌శాల విద్య అనంత‌రం ఇంట‌ర్ బైపీసీ చౌటుప్ప‌ల్‌లోని మాతృశ్రీ జూనియ‌ర్ కాలేజీలో అభ్య‌సించాడు. ఓయూ ప్రొఫెస‌ర్ రామ్ రెడ్డి దూర విద్యా కేంద్రం( PGRRCDE ) నుంచి బీఏ, నిజాం కాలేజీ( Nizam College ) నుంచి ఎంఏ పొలిటిక‌ల్ సైన్స్( Political Science ) పూర్తి చేశాడు.

ఉద్యమబాట.. పరిశోధనల వేట..

ఎంఏ పొలిటిక‌ల్ సైన్స్ పూర్తి చేశాక ఉస్మానియా యూనివ‌ర్సిటీ( Osmania University )లో అడుగు పెట్టాడు. ఓయూ కేంద్రంగా దళిత, బహుజన విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూనే, అకడమిక్‌గా తన ప్రతిభను చాటుకున్నారు. UGC-NET , తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS-SET) అర్హత సాధించి రీసెర్చ్ వైపు అడుగులు వేశారు. ఓయూ పొలిటికల్ సైన్స్ విభాగంలో డాక్టర్ ఎం. రమణ పర్యవేక్షణలో 'డిమాండ్ ఫర్ స్టేట్ అటానమి అండ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఫెడరల్ సిస్టమ్: ఏ స్పెషల్ స్టడీ ఆన్ తమిళనాడు స్టేట్' అనే అంశంపై ప్రతిష్టాత్మక పరిశోధన చేశారు. భారత సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల స్వయంప్రతిపత్తి డిమాండ్లు, వాటి ప్రభావంపై ఆయన చేసిన అధ్యయనానికి గాను ఈ డాక్టరేట్ లభించింది.

ఘనంగా డాక్టరేట్ ప్రదానం

ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధ్యక్షతన, భారత్ బయోటెక్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం. ఎల్లా, ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం చేతుల మీదుగా నరసింహ పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు.

తన తండ్రికి అంకితం..

"నా చదువుకు, ఎదుగుదలకు అడుగ‌డుగునా అండ‌గా నిలిచిన నా తండ్రి దివంగ‌త వ‌లిగొండ మార‌య్య‌కు ఈ డాక్ట‌రేట్‌ను అంకితం ఇస్తున్నాన‌ని న‌ర‌సింహ ఆనంద‌భాష్పాలు రాల్చాడు. ఇటీవ‌లే త‌న తండ్రి చ‌నిపోయారని భావోద్వేగానికి లోన‌య్యాడు. పీహెచ్‌డీ ప‌ట్టా అందుకునే స‌మ‌యానికి త‌న తండ్రి చ‌నిపోవ‌డం బాధాక‌రంగా ఉంద‌న్నాడు. నాన్న ఈ ప‌ట్టాను చూసి ఉంటే మురిసిపోయేవాడు అని క‌న్నీరు పెట్టుకున్నాడు వ‌లిగొండ న‌ర‌సింహ‌. త‌న‌ను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు, అధ్యాపకులకు, మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు.

గ్రామ‌స్థులు హ‌ర్షం

ప్రస్తుతం ఓయూ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో కొసాగుతున్న నరసింహ, ఉన్నత విద్యలో డాక్టరేట్ సాధించడం పట్ల ఏపూరు గ్రామస్థులు, పలువురు ప్రజాప్రతినిధులు, దళిత-బహుజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement