త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth reddy | పాలిటెక్నిక్ కాలేజీల‌ను ప్రైవేటైజేష‌న్ చేసే ప్ర‌స‌క్తే లేదు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth reddy | పాలిటెక్నిక్‌లలో గతంలో సగం సీట్లు కూడా నిండేవి కాదని, ఈఏడాది 95శాతం సీట్లు నిండాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీల‌ను ప్రైవేటైజేష‌న్ చేసే ప్ర‌సక్తే లేద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Sep 11, 2026, 11.19 pm IST

CM Revanth reddy | పాలిటెక్నిక్ కాలేజీల‌ను ప్రైవేటైజేష‌న్ చేసే ప్ర‌స‌క్తే లేదు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth reddy | త్రినేత్ర‌.న్యూస్ : పాలిటెక్నిక్‌లలో గతంలో సగం సీట్లు కూడా నిండేవి కాదని, ఈఏడాది 95శాతం సీట్లు నిండాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీల‌ను ప్రైవేటైజేష‌న్ చేసే ప్ర‌సక్తే లేద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. పాలిటెక్నిక్‌ల అభివృద్ధికి ప్రయత్నిస్తుంటే అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సర్వీసు నిబంధనలు మార్చలేమని మార్చినా కోర్టులు ఊరుకోవన్నారు. శాస‌న‌స‌భ‌లో విద్యా వ్య‌వ‌స్థ‌పై జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా జీవో 97పై సీఎం మాట్లాడారు.

పాలిటెక్నిక్ కాలేజీలు ప్రైవేటు పరం అవుతాయని దుష్ప్రచారం చేస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనే ప్రసక్తే లేదు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చి టాటా సహకారంతో నైపుణ్యాన్ని అందిస్తున్నాం. అలాగని ఐటీఐలను ప్రైవేటు పరం చేసినట్టా? ఏటీసీలో చదివే వారికి ప్రతీ నెల 2 వేలు స్కాలర్ షిప్ అందించాలని చెప్పాం. మేం ఒక మంచి సంకల్పంతో పని చేస్తుంటే కొంతమంది విద్యార్థుల్లో అపోహలు కలిగిస్తున్నారు అని రేవంత్ మండిప‌డ్డారు.

కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి యంగ్ ఇండియా యూనివర్సిటీ పరిధిలోకి

భూములు అమ్ముకుంటారని, ఉద్యోగాలు పోతాయని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వమే అదనంగా 282 ఎకరాల రెవెన్యూ భూమిని ఏటీసీలకు బదలాయించింది. ఒక్కో ఏటీసీపై రూ.46 కోట్లు ఖర్చు చేశాం. పాలిటెక్నిక్ కాలేజీలు ప్రైవేటుపరం చేయబోం. ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి యంగ్ ఇండియా యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తున్నామ‌ని సీఎం తెలిపారు.

పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం

సాంకేతిక విద్యను పరిశ్రమల అవసరాలకు అనుసంధానించడమే ప్రభుత్వ ఉద్దేశం. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చి, పరిశ్రమల భాగస్వామ్యంతో ఆధునిక ల్యాబొరేటరీలు, పరికరాలు, శిక్షణా సదుపాయాలను అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యం. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశాలను పెంచాలని ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని రేవంత్ పేర్కొన్నారు.

స్కిల్స్ యూనివర్సిటీకే ఆ అప్రూవల్ తీసుకొస్తా

ఏఐ, రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి కొత్త రంగాలకు అనుగుణంగా కోర్సులను ఆధునీకరిస్తాం. పాలిటెక్నిక్ విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలానే మా తపన. సాంకేతిక విద్య–నైపుణ్యాభివృద్ధి విభాగం అనుసంధానంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉన్న మౌలిక వసతులు, ల్యాబ్‌లు, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తాం. విద్యార్థులలో అపోహలను తొలగిస్తాం, జీవోలో సవరణ కావాలంటే చేస్తాం. ఏఐసీటీఈ అప్రూవల్ లేదని అంటున్నారు.. స్కిల్స్ యూనివర్సిటీకే ఆ అప్రూవల్ తీసుకొస్తామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

పేద పిల్లలకు మేం అన్యాయం జరగనివ్వం..

మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకున్న హరీష్ రావు ఇపుడు ఆ వ్యవస్థనే ముందుకు వెళ్ళకుండా కుట్ర చేస్తున్నారు. కడుపులో కుల్లు, పేద పిల్లలపై ద్వేషంతో ఆ కుటుంబం కుట్ర చేస్తోంది. పేద పిల్లలకు మేం అన్యాయం జరగనివ్వం.. వారి భవిష్యత్ బాగుండాలనే మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం చేసే ఈ చర్యలను మీరు అడ్డుకోండి అని ముఖ్య‌మంత్రి సూచించారు.

ఫీజు రీయింబర్సుమెంట్ కాంగ్రెస్ పేటెంట్

ఫీజు రీయింబర్సుమెంట్ కాంగ్రెస్ పేటెంట్.. గత ప్రభుత్వం పోతూ పోతూ ఫీజు రీయింబర్స్ మెంట్ రూ. 5430 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారు. వారు బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన వాటిలో రూ. 1410 కోట్లు మేం చెల్లించాం. మా ప్రభుత్వం వచ్చాక కోతగా రూ.1475 కోట్లు చెల్లించాం. ఈ 32 నెలల్లో రూ. 3488 కోట్లు ఫీజు రీయింబర్సుమెంట్ కోసం చెల్లించాం అని సీఎం తెలిపారు.

Advertisement
Advertisement