త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | క్యాబినెట్ మీటింగ్‌లోనైనా క‌ళ్లు తెర‌వండి.. ధాన్యం కొనండి: కేటీఆర్‌

KTR | ఈనెల 23న నిర్వ‌హించే కేబినెట్ మీటింగ్‌లోనైనా పంట కొనుగోళ్ల‌పై సీఎం రేవంత్‌రెడ్డి కండ్లు తెర‌వాల‌ని, కొనుగోళ్ల సంక్షోభంపై మొద్దునిద్ర‌ను వీడాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. కాంటా పెట్ట‌ని కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ మొద‌లైద‌ని హెచ్చ‌రించారు.

S

Telangana | Published On May 21, 2026, 12.44 pm IST

KTR | క్యాబినెట్ మీటింగ్‌లోనైనా క‌ళ్లు తెర‌వండి.. ధాన్యం కొనండి: కేటీఆర్‌
Advertisement
  • పంట కొనుగోళ్ల సంక్షోభంపై ఎన్నాళ్లీ మొద్దు నిద్ర
  • రైతుల ప్రాణాలు పోతున్నా.. పంటలు కొనరా?
  • కొనుగోలు కేంద్రాల్లో అన్న‌దాత‌లు కుప్పకూలుతున్నా కనికరించరా?
  • ధాన్యం తగలబెట్టుకుంటున్నా తండ్లాట తీర్చరా?
  • రోడ్డెక్కని రైతు లేడు.. రాస్తారోకో జరగని రహదారి లేదు
  • కాంటా పెట్ట‌ని కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొద‌లైంది
  • పంట కొనుగోళ్ల‌పై సీఎం రేవంత్ కు రాసిన లేఖలో నిప్పులు చెరిగిన కేటీఆర్

KTR |  త్రినేత్ర‌.న్యూస్: ఈనెల 23న నిర్వ‌హించే కేబినెట్ మీటింగ్‌లోనైనా పంట కొనుగోళ్ల‌పై సీఎం రేవంత్‌రెడ్డి కండ్లు తెర‌వాల‌ని, కొనుగోళ్ల సంక్షోభంపై మొద్దునిద్ర‌ను వీడాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. నేడు రోడ్డెక్క‌ని రైతు లేడు, రాస్తారోకో జ‌ర‌గ‌ని ర‌హ‌దారి లేద‌ని విమ‌ర్శించారు. ఇవాళ బూతులు తిడుతున్న రైతులే.. రేపు వాతలు పెడతారని.. కాంటా పెట్ట‌ని కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ మొద‌లైద‌ని హెచ్చ‌రించారు. ఈ మేర‌కు ఆయ‌న గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి బ‌హిరంగ లేఖ రాశారు.

ఇవీ లేఖ వివ‌రాలు..

తెలంగాణ‌లో తొమ్మిదిన్న‌రేళ్ల పాటు ధైర్యంగా బ‌తికిన రైత‌న్న ఇవాళ రోడ్డున ప‌డ్డాడు. ఆరు ద‌శాబ్దాల పాటు ప‌డ్డ క‌ష్టాలు శాశ్వ‌తంగా తీరిపోయాయ‌ని సంబరంగా సాగు చేసుకుంటున్న రైతు నోట్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మ‌ట్టి కొట్టింది. కేసీఆర్ అమ‌లు చేసిన ఒక్కో ప‌థ‌కానికి గ‌త రెండేళ్లుగా పాత‌రేసి అన్న‌దాత వెన్నువిరిచారు. ఇవాళ మీ అరాచ‌క పాల‌న ఆన‌వాళ్లు ప‌రాకాష్ట‌కు చేరాయి.

అష్ట‌క‌ష్టాలు ప‌డి పండించిన పంట‌ను కొనే దిక్కులేక రెండు నెల‌లుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్థ‌నాదాలు చేస్తున్నారు. ఏ మూల‌న చూసినా రైతులు నిత్యం ధ‌ర్నాలు, రాస్తారోకోలు, నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్నారు. పంట అమ్ముకుందామ‌నే ఆశ‌తో వ‌చ్చిన రైతులు రోజుల త‌ర‌బ‌డి ప‌డిగాపులు ప‌డ‌లేక కొనుగోలు కేంద్రాల్లోనే గుండెప‌గిలి కుప్ప‌కూలుతున్నా మీ స‌ర్కారుకు చీమ‌కుట్టిన‌ట్టు కూడా లేదు అని కేటీఆర్ లేఖ‌లో మండిప‌డ్డారు.

ప‌ది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు..

70 సార్లు ఢిల్లీకి చ‌క్క‌ర్లు కొట్ట‌డంలో మీకున్న శ్ర‌ద్ధ‌లో ఒక్క శాతం రైతుల‌పై పెట్టి ఉంటే ఈ దుస్థితి వ‌చ్చేది కాదు. మీ కుర్చీని కాపాడుకోవ‌డానికి ఢిల్లీకి మూట‌లు మోయ‌డం త‌ప్పా రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనాల‌న్న సోయి మీలో క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే కొనుగోలు కేంద్రాల వ‌ద్ద దాదాపు ప‌ది మంది రైతులు త‌మ నిండు ప్రాణాల‌ను కోల్పోయారు. క‌నీసం ఒక్క‌సారైనా మీరు ఏ ఒక్క కొనుగోలు కేంద్రం వైపు క‌న్నెత్తి చూసిన దాఖలా లేదు.

చివ‌రికి మీ సొంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్ లో కూడా రైతులు రోడ్డెక్కి దుమ్మెత్తి పోసే దుస్థితి వ‌చ్చిందంటే సాగు ఎంత‌టి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. కేసీఆర్ హ‌యాంలో మూడు నెల‌ల ముందు నుంచే పంట‌ల కొనుగోలు ప్ర‌ణాళిక‌ల‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేసేవారు. గ‌న్నీ బ్యాగుల నుంచి మొద‌లుకొని రైతుల ఖాతాల్లో పంట డ‌బ్బులు స‌కాలంలో జ‌మ‌య్యే దాకా నిరంత‌ర స‌మీక్ష‌లు చేసేవారు.

మీ పాల‌న‌కు రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి..

రైతుల ఆర్థ‌నాదాలు ఏమాత్రం వినిపించుకునే తీరిక లేని మీ పాల‌న‌కు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి. మొత్తంగానే వ్య‌వ‌సాయాన్ని పాతాళంలోకి నెట్టిన మీ ద‌ద్ద‌మ్మ పాల‌న‌పై ఇప్ప‌టికే రైతుల్లో తిరుగుబాటు మొద‌లైంది. 60 రోజులు గ‌డిచినా కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్ట‌ని కాంగ్రెస్ స‌ర్కారుకు మ‌ర‌ణ‌శాస‌నం రాసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.

రూ.25 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించు..

ఈనెల 23న నిర్వ‌హించే కేబినెట్ స‌మావేశంలోనైనా లెంప‌లేసుకొని దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టండి. వేలాది కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయింది. ఆ ధాన్యాన్ని కొని రైతుల క‌ష్టానికి ప్ర‌తిఫ‌లాన్ని అందించండి. మీరు చేసిన పాపాల‌కు ఇప్ప‌టికే కొనుగోలు కేంద్రాల వ‌ద్ద క‌న్నుమూసిన రైతుల కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించండి. లేక‌పోతే మీరు చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ రైతు ద్రోహిగానే మిగిలిపోతారు అని ఆ లేఖ‌లో కేటీఆర్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement