త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alleti Maheshwar Reddy | కొన్న‌ది 24 శాత‌మే.. 80 శాతం ఎక్క‌డ కొన్నారో చెప్పండి: సీఎం రేవంత్‌కు ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి ప్ర‌శ్న

Alleti Maheshwar Reddy | రాష్ట్రంలో 80 శాతం వ‌డ్లు కొన్నామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నార‌ని.. ఎక్క‌డ కొన్నారో నిరూపించాల‌ని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి నిల‌దీశారు. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 24 శాతమే వ‌డ్లు కొన్నార‌ని చెప్పారు. ఈ త‌ప్పుడు లెక్క‌లు, గార‌డీ మాట‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

S

Telangana | Published On May 22, 2026, 1.36 pm IST

Alleti Maheshwar Reddy | కొన్న‌ది 24 శాత‌మే.. 80 శాతం ఎక్క‌డ కొన్నారో చెప్పండి: సీఎం రేవంత్‌కు ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి ప్ర‌శ్న
Advertisement
  • మీతో ఎక్క‌డికంటే అక్క‌డికి వ‌స్తాం
  • ఎంత ధాన్యం కొన్నారో చూపించండి
  • లేదా మాతో రండి.. మీరు చెప్పింది అబ‌ద్ద‌మ‌ని నిరూపిస్తాం
  • రైతు గోస-బీజేపీ భ‌రోసా యాత్ర చేయ‌బోతున్నాం
  • సోమ‌వారం నుంచి కొనుగోలు కేంద్రాల్లో ప‌ర్య‌టిస్తాం
  • బ‌స్తాకు నాలుగు కిలోలు దోచుకుంటున్నారు
  • ఈ సొమ్మంతా ఎవ‌రి ఖాతాల్లోకి పోతుందో రేవంత్ చెప్పాలి
  • మీడియా స‌మావేశంలో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి ధ్వ‌జం

Alleti Maheshwar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో 80 శాతం వ‌డ్లు కొన్నామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నార‌ని.. ఎక్క‌డ కొన్నారో నిరూపించాల‌ని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి నిల‌దీశారు. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 24 శాతమే వ‌డ్లు కొన్నార‌ని చెప్పారు. సీఎంతో ఎక్క‌డికంటే అక్క‌డికి వ‌స్తామ‌ని 80 శాతం కొన్న‌ట్లు నిరూపించాల‌ని స‌వాల్ విసిరారు. ఈ త‌ప్పుడు లెక్క‌లు, గార‌డీ మాట‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ఈ మేర‌కు ఆయ‌న బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించిన పంట‌ను ప్ర‌భుత్వం కొన‌క‌పోవ‌డంతో ద‌ళారుల చేతిలో రైతులు న‌ష్ట‌పోవ‌డం క‌ళ్లారా చూస్తున్నాం. ఒక‌వైపు అకాల వ‌ర్షాలు, జూన్‌లో మ‌ళ్లీ పంట‌ల సాగుకు రైతులు సిద్ధ‌మ‌వ్వాల్సిన త‌రుణంలో వ‌రి కొనుగోలు కేంద్రాల్లో, మ‌క్క‌ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎక్క‌డికక్క‌డే ఉంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల‌ను గోస పెడుతున్న‌ది. లారీలు లేని ప‌రిస్థితి కనిపిస్తుంది. రైతులు అరిగోస ప‌డుతున్న‌రు. ప్ర‌తి గింజ‌ను కొంటామ‌ని మోసం చేస్తున్నారు అని ఏలేటి ఫైర‌య్యారు.

జొన్న‌ల కొనుగోలు ప్రారంభ‌మే కాలేదు..

ఇంకా జొన్న‌ల కొనుగోలు కూడా ప్రారంభించ‌లే. మేం ప్ర‌భుత్వాన్ని అడుగుతున్నం. రైతుల‌కిచ్చిన హామీలు నెర‌వేర్చండి. గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాలి. ఎక‌రాకు రూ.7,500 రైతు భ‌రోసా ఇస్తామ‌ని ఒప్పుకున్నారు. అది కూడా ఎగ్గొడుతున్నారు. చివ‌రికి ఒక సంచికి 4 కిలోల ధాన్యం దోచుకుంటున్న‌ది వాస్త‌వం కాదా? మ‌క్క‌లు పూర్తిగా కొనుగోలు చేయ‌లేని ప‌రిస్థితి ఉన్న‌ది.. ఇది వాస్త‌వం కాదా? గ‌న్నీ బ్యాగుల కోసం తిప్ప‌లు ప‌డడేది నిజం కాదా? అని మ‌హేశ్వ‌ర్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

మాతో రండి మీకు చూపిస్తాం..

నిన్న సీఎం రేవంత్ మీడియా ముందు ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడారు. 80 శాతం కొనుగోలు చేసిన‌ట్లు చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. 80 శాతం ఎక్క‌డ కొన్నారో చూపించండి. మేం మీతో ఎక్క‌డికంటే అక్క‌డికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా మాతో రండి మీకు చూపిస్తాం. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 24 శాత‌మే వ‌డ్ల కొనుగోలు జ‌రిగింది. ల‌క్షా న‌ల‌భై ఒక్క‌ వేల మెట్రిక్ ట‌న్నుల వ‌డ్లు దిగుబ‌డి వ‌స్తే గ‌తేడాది 90 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యమే కొన్నారు. ఈసారి అదే ల‌క్ష్యం పెట్టుకున్నా మీరు కొన్న‌దెంత‌? ఏర‌కంగా 80 శాతం కొన్నారో చెప్పండి అని ఎమ్మెల్యే ఏలేటి ప్ర‌శ్నించారు.

ప‌ర్య‌ట‌న వివ‌రాలు రేపు ప్ర‌క‌టిస్తాం..

మాట‌ల గార‌డీతోటి ప్ర‌జ‌లను మ‌భ్య పెడుతున్న‌రు. దీంతో రైతులు గోస ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో మేం సోమ‌వారం నుంచి బీజేపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయ‌కులు అంతా క‌లిసి రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల‌ను ప‌రిశీలిస్తాం. మా ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను రేపు ప్ర‌క‌టిస్తాం. మొద‌టి రోజు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు మా వెంట వ‌స్తారు అని ఏలేటి తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు క‌లిసి కొనుగోలు కేంద్రాల్లో ప‌ర్య‌టిస్తాం. జొన్న‌లు ఎందుకు కొన‌లేదో, మ‌క్క‌లు ఎన్ని కొన్నారో నిరూపించ‌డానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే వెళ్తాం. రైత‌న్న స‌మ‌స్య‌లు తెలుసుకుంటాం. వారి గోస‌కు మేం భ‌రోసా ఇస్తాం. వారి వెంటే నిల‌బ‌డ‌తాం. మీరు అన్ని వ‌ర్గాల వారిని మోసం చేస్తున్నారు అని ఆరోపించారు.

సీఎం రేవంత్ స‌మాధానం చెప్పాలి..

రైతును ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం గాలి కొదిలేసింది. యూరియా బ‌స్తాల నుంచి ధాన్యం అమ్ముకొనే వ‌ర‌కు ప్ర‌తి చోటా ద‌గా చేస్తున్నారు. బ‌స్తాకు నాలుగు కిలోలు దోచుకుంటున్న సొమ్ము ఎవ‌రి చేతుల్లోకి పోతుందో సీఎం రేవంత్ స‌మాధానం చెప్పాలి. 90 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ‌డ్ల కొనుగోలు జ‌రిగితే దాంట్లో 10 శాతం అంటే 9 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ‌డ్లు ఎవ‌రి జేబుల్లోకి పోతున్న‌య్‌? వేల కోట్ల రూపాయ‌లు ఎవ‌రి ఖాతాల్లోకి వెళ్తున్నాయో చెప్పాల‌ని అడుగుతున్నాం. రైతుల ప‌క్షాన కొట్లాడేందుకు రైతు గోస-బీజేపీ భ‌రోసా యాత్ర‌ను ప్రారంభించ‌బోతున్నాం అని ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement