త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Education Commission | విద్యా కమిషన్ సిఫార్సులు ఏమైనట్టు!

Telangana Education Commission | విద్యా సంవత్సరం మొదలైంది. పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల బుక్కుల కోసం, బట్టల కోసం, ఫీజుల కోసం ప్రయాస పడుతున్నారు. ప్రైవేట్ బడుల్లో ఫీజులు నియంత్రిస్తాం అన్న రేవంత్ రెడ్డి హామీ మిగతా హామీల లాగానే, ఆయనే స్వయంగా విధించిన విద్యా కమిషన్ నివేదికతో పాటే బుట్ట దాఖలైంది.

S

Telangana | Published On Jun 17, 2026, 1.29 pm IST

Telangana Education Commission | విద్యా కమిషన్ సిఫార్సులు ఏమైనట్టు!
Advertisement

Telangana Education Commission | విద్యా సంవత్సరం మొదలైంది. పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల బుక్కుల కోసం, బట్టల కోసం, ఫీజుల కోసం ప్రయాస పడుతున్నారు. ప్రైవేట్ బడుల్లో ఫీజులు నియంత్రిస్తాం అన్న రేవంత్ రెడ్డి హామీ మిగతా హామీల లాగానే, ఆయనే స్వయంగా విధించిన విద్యా కమిషన్ నివేదికతో పాటే బుట్ట దాఖలైంది. పైపెచ్చు విద్యాశాఖలో సంస్కరణల పేరుతో రేవంత్ అమలు చేస్తామంటున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో ప్రభుత్వ పాఠశాలలను ఒకే చోటికి విలీనం (క్లస్టరింగ్) చేయాలని భావిస్తున్నామన్న సీఎం ప్రకటన ప్రజాస్వామ్య విద్యా వేదికలపై పెద్ద వివాదాన్ని రేపింది.

రాష్ట్రంలోని దాదాపు 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000 మెగా క్లస్టర్ స్కూళ్లుగా (తెలంగాణ పబ్లిక్ స్కూల్స్) మారుస్తామని రేవంత్ రెడ్డి బెంగళూరులో ఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటన విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే. ప్రతి చిన్నారికి తమ ఇంటికి సమీపంలో (1 నుండి 3 కిలోమీటర్ల లోపు) ప్రాథమిక విద్యా సౌకర్యం అందుబాటులో ఉండాలని 'ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం-2009' స్పష్టం చేస్తోంది. మండల కేంద్రాల్లో పెద్ద స్కూళ్లు పెట్టి, గ్రామాల్లోని బడులను ఎత్తివేయడం ఈ ప్రాథమిక హక్కును కాలరాయడమే అవుతుంది.

ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెబుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితి, భద్రతా కారణాల దృష్ట్యా చిన్న పిల్లలను, ముఖ్యంగా ఆడపిల్లలను మైళ్ల దూరంలో ఉన్న మండల కేంద్రాలకు పంపడానికి తల్లిదండ్రులు వెనుకాడతారు. ఇది అంతిమంగా డ్రాపౌట్స్ (బడి మానేసే వారి) సంఖ్య పెరగడానికి కారణమవుతుంది.

అసలు ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యమే. మౌలిక వసతులు లేకపోవడం, టీచర్ల కొరతను నివారించకుండా, రోగానికి మందు వేయాల్సింది పోయి రోగిని నిర్బంధించినట్లుగా బడులను మూసివేయడం లేదా విలీనం చేయడం సరైన సంస్కరణ అనిపించుకోదు.

​తెలంగాణ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, ఫీజులను నియంత్రించడానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళితో కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై 8 శాతం క్యాపింగ్ విధించడంతో పాటు, విద్యా రంగంలో పారదర్శకత కోసం ఆకునూరి మురళి కమిషన్ అనేక అద్భుతమైన సిఫార్సులతో కూడిన ముసాయిదా బిల్లును ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో ఏదైనా అద్భుతం జరిగితే మనం తెలంగాణ ప్రజలు ఆశపడ్డారు. కానీ, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల ఒత్తిళ్లకు లొంగిపోయిన ప్రభుత్వం, ఆ సిఫార్సులను పూర్తిగా పక్కన పెట్టేసింది.

తాను ఎంతో నిబద్ధతతో రూపొందించిన నివేదికను, పేద విద్యార్థులకు మేలు చేసే సిఫార్సులను ప్రభుత్వం బుట్టదాఖలు చేయడాన్ని ఆకునూరి మురళి తట్టుకోలేకపోయారు. విద్యా కమిషన్ చైర్మన్ పదవి కేవలం అలంకారప్రాయంగా మారిందని, ప్రభుత్వానికి విద్యా సంస్కరణలపై నిజాయితీ లేదని నిరసిస్తూ ఆయన తన పదవి నుండి అభ్యంతరకరంగా, తీవ్ర అసంతృప్తితో తప్పుకున్నారు. విద్యా రంగంపై కనీస అవగాహన లేని అధికారుల చేతుల్లోకి వ్యవస్థ వెళ్తోందని ఆయన బహిరంగంగానే విమర్శించడం ప్రభుత్వ విధానాలకు పెద్ద చెంపపెట్టుగా మారింది.

​ఆకునూరి మురళి రాజీనామా తర్వాత 'ఫీజు నియంత్రణ చట్టం' (Fee Regulation Act) కథ పూర్తిగా కంచికి చేరినట్లయింది. రెండేళ్లకు ఒకసారి కేవలం 8 శాతమే ఫీజులు పెంచాలనే నిబంధన, ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా వంటి కఠిన నిబంధనలతో కూడిన బిల్లు కేబినెట్ ఆమోదం కోసం నెలల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోయింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రైవేట్ స్కూళ్లు ఇష్టానుసారంగా 20 శాతం నుండి 30 శాతం వరకు ఫీజులు పెంచేస్తున్నా ప్రభుత్వం ఈ బిల్లును చట్టసభల ముందుకు తీసుకురాకపోవడం వెనుక పెద్ద ఎత్తున ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల లాబీయింగ్ ఉందనే విమర్శలు నిజమని రుజువవుతున్నాయి.

ఒకవైపు నాణ్యత లేదనే నెపంతో ప్రభుత్వ బడులను నమ్ముకోలేక, మరోవైపు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు భరించలేక మధ్యతరగతి కుటుంబాలు అప్పులపాలు అవుతున్నాయి. ​తెలంగాణ ప్రభుత్వ విద్యా విధానం ప్రస్తుతం పరస్పర విరుద్ధమైన దిశలో పయనిస్తోంది. ఒకవైపు ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను కట్టడి చేయడంలో, దానికి సంబంధించిన చట్టాలను రూపొందించిన ఆకునూరి మురళి లాంటి నిపుణుల సిఫార్సులను అమలు చేయడంలో విఫలమవ్వడం, మరోవైపు పేదవాడికి అందుబాటులో ఉండే ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించాలని చూడటం వల్ల సమాజంలో విద్యా అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

​ప్రభుత్వం కేవలం 'మోడల్ స్కూల్స్' అనే గ్లామర్ ప్రాజెక్టులపైనే కాకుండా, ప్రతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. ఆకునూరి మురళి వంటి విద్యావేత్తల రాజీనామా ఇచ్చిన హెచ్చరికలను గమనంలోకి తీసుకుని, కార్పొరేట్ శక్తులకు లొంగకుండా వెంటనే ఫీజు నియంత్రణ బిల్లును చట్టంగా మార్చాలి. విద్య అనేది వ్యాపార సరుకు కాదని, అది పౌరుల ప్రాథమిక హక్కనే విషయాన్ని పాలకులు విస్మరించకూడదు.

నవీన్ రెడ్డి
అధ్యక్షుడు, ఎన్నారై బీఆర్ఎస్ యూకే(లండన్)

Advertisement
Advertisement