త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Tummala | ద‌ళారుల జోక్యం లేకుండా పత్తి కొనుగోళ్లు

Minister Tummala | రానున్న 2026–27 పత్తి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లలో మధ్యవర్తుల జోక్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేశారు.

P

Telangana | Published On Aug 11, 2026, 4.04 pm IST

Minister Tummala | ద‌ళారుల జోక్యం లేకుండా పత్తి కొనుగోళ్లు
Advertisement
  • 15–30 రోజుల్లో అన్ని జిల్లాల్లో మిల్లులు ప్రారంభించాలి..
  • రైతులకు నేరుగా ఎంఎస్‌పీ అందాలి
  • వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు
  • సీసీఐ అధికారుల‌తో స‌మీక్ష‌

Minister Tummala | రానున్న 2026–27 పత్తి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లలో మధ్యవర్తుల జోక్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. రైతుల నుంచి నేరుగా పత్తి కొనుగోలు జరిగేలా పటిష్ఠ పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో సీసీఐ అధికారులతో పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కష్టపడి పంట పండించిన రైతుకు మార్కెటింగ్‌లో ఇబ్బంది కలగకూడదని, గత సీజన్లలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించిన లోపాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘‘మనం బతకాలంటే రైతు బతకాలి’’ అనే విషయాన్ని గుర్తుంచుకుని అధికారులు పనిచేయాలన్నారు.

25.85ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ఉత్ప‌త్తి

ఈ సీజన్‌లో రాష్ట్రంలో 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు, 25.85 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి ఉంటుందని అంచనా వేశారు. లాంగ్‌ స్టేపుల్‌ పత్తికి కేంద్రం క్వింటాల్‌కు రూ.8,667 ఎంఎస్‌పీ ప్రకటించిందని, గత ఏడాదితో పోలిస్తే రూ.557 పెరిగిందని తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకూ ఎంఎస్‌పీ ప్రయోజనం అందేలా చూడాలని, ఎంఎస్‌పీ కంటే తక్కువ ధరకు విక్రయించే పరిస్థితి రాకూడదని ఆదేశించారు. రాష్ట్రంలోని 356 జిన్నింగ్‌ మిల్లులను నోటిఫై చేసి, ఎల్‌1 నుంచి ఎల్12 వరకు అన్ని కేటగిరీల మిల్లులను అవసరానికి అనుగుణంగా అందుబాటులోకి తేవాలని సూచించారు. 15–30 రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో మిల్లులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత సీజన్‌లో 122గా ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఈసారి 131కి పెంచినట్లు తెలిపారు. పత్తి రాక అధికంగా ఉండే ప్రాంతాల్లో అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మానిటరింగ్‌ కమిటీలు సమర్థంగా పనిచేయాలని, వాటిలో రైతుల ప్రతినిధులకు కూడా చోటు కల్పించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. జిన్నింగ్‌ మిల్లు అందుబాటులో లేని ప్రాంతాలను సమీపంలోని నోటిఫైడ్‌ మిల్లులకు అనుసంధానించి రైతులు ఎక్కువ దూరం వెళ్లకుండా చూడాలని ఆదేశించారు.

స్లాట్ బుకింగ్ స‌ర‌ళ‌త‌రం

కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుకింగ్‌ను మరింత సరళీకృతం చేయాలని మంత్రి సూచించారు. స్లాట్లు తెరిచే ముందు కలెక్టర్లు, జిల్లా మార్కెటింగ్‌ అధికారులకు సమాచారం ఇచ్చి విస్తృత ప్రచారం చేయాలన్నారు. అవసరానికి అనుగుణంగా ఒక రైతు లేదా మొబైల్‌ నంబర్‌కు మల్టిపుల్‌ బార్‌కోడ్‌ సౌకర్యం కల్పించాలని, పంట బుకింగ్‌ డేటాను ఎన్‌ఐసీ ద్వారా యాప్‌కు వేగంగా బదిలీ చేయాలని ఆదేశించారు. అన్ని నోటిఫైడ్‌ జిన్నింగ్‌ మిల్లుల్లో నాణ్యత పరీక్ష పరికరాలు, కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బరువు యంత్రాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పత్తి అధికంగా వచ్చే జిల్లాల్లో అవసరమైన కాటన్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర సగటు దిగుబడికంటే అధిక దిగుబడి పొందిన రైతులకు ఏఈవోల ద్వారా డిజిటల్‌ యీల్డ్‌ సర్టిఫికెట్లు వెంటనే జారీ చేయాలని చెప్పారు.

రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆదేశం

రైతులకు ఎంఎస్‌పీ, కొనుగోలు కేంద్రాలు, నాణ్యత ప్రమాణాలు, స్లాట్‌ బుకింగ్‌పై విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం 1800 599 5779 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌, 88972 81111 వాట్సాప్‌ చాట్‌బాట్‌ సేవలను వినియోగించుకునేలా ప్రచారం చేయాలని సూచించారు. మార్కెట్‌ యార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను సమర్థంగా నిర్వహించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రద్దీ, పెండింగ్‌ ఏర్పడితే తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు, సీసీఐ సమన్వయంతో పనిచేయాలన్నారు. పత్తి కొనుగోళ్లలో రైతుకు నష్టం కలిగించే అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల హెచ్చరించారు.

Advertisement
Advertisement