త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Excise Commissioner Controversy | ఎక్సైజ్ శాఖలో ముదురుతున్న వివాదం: కమిషనర్ క్షమాపణలు కంటితుడుపే – డీసీ సోమిరెడ్డి సంచలన లేఖ

ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ బదిలీల సందర్భంగా తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ వ్యవహరించిన తీరుపై, ఆయన పెట్టిన మానసిక క్షోభపై నిజామాబాద్ డీసీ సోమిరెడ్డి సంచలన బహిరంగ లేఖ విడుదల చేశారు. కమిషనర్ క్షమాపణలు కేవలం కంటితుడుపు చర్య అని, జేఏసీ నాయకులు తనను సంప్రదించకుండానే సమస్య సద్దుమణిగిందని ప్రకటించడం దారుణమని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

J

Telangana | Published On Apr 15, 2026, 8.50 pm IST

Excise Commissioner Controversy | ఎక్సైజ్ శాఖలో ముదురుతున్న వివాదం: కమిషనర్ క్షమాపణలు కంటితుడుపే – డీసీ సోమిరెడ్డి సంచలన లేఖ
Advertisement

Excise Commissioner controversy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుళ్ల బదిలీల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇటీవల బదిలీల కౌన్సెలింగ్ సందర్భంగా ఎక్సైజ్ కమిషనర్ అసభ్య పదజాలంతో దూషించారని మనస్తాపం చెంది ఆసుపత్రి పాలైన నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ (DC) వి. సోమిరెడ్డి తాజాగా ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ లేఖ ఎక్సైజ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

కమిషనర్ తన పట్ల వ్యవహరించిన తీరు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై సోమిరెడ్డి తన లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ కుటుంబ సభ్యులను, మిత్రులను ఉద్దేశించి ఆయన రాసిన లేఖలోని ముఖ్యాంశాలు ఇవే.

అది నా ఒక్కడి సమస్య కాదు.. అందరిదీ

కమిషనర్ ఛాంబర్‌లో జరిగిన సంఘటనను తన వ్యక్తిగత సమస్యగా భావించడం లేదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. తన కంటే ముందు కమిషనర్ గదిలోకి వెళ్లిన అధికారులందరినీ ఆయన అత్యంత అసభ్యంగా, ఘోరంగా దూషించారని ఆరోపించారు. జిల్లా అధికారులు, డివిజన్ అధికారులు మనుషులు కారా? వారికి ఆత్మాభిమానం ఉండదా? అని ప్రశ్నించారు. పని ఒత్తిడిలో ఏదో పొరపాటున అన్నానని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని కమిషనర్ చెప్పడం కేవలం తాత్కాలికంగా సమస్య నుంచి తప్పించుకోవడానికేనని ఆయన మండిపడ్డారు.

పదే పదే 'వెధవ' అనిపించాలని చూశారు

కమిషనర్ ఛాంబర్‌లో దాదాపు 10 నిమిషాల పాటు తనను 'వెధవ' అంటూ పదే పదే దూషించారని, తనతో తాను 'వెధవ' అని ఒప్పించాలని కమిషనర్ ప్రయత్నించారని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా కమిషనర్ ఆఫీసులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ఆయన చేతిలో అవమానాలకు, మానసిక క్షోభకు గురవుతున్నారని కుండబద్దలు కొట్టారు. ఇందులో కుల, మత బేధాలు లేవని, అందరినీ ఆయన తన వ్యంగ్య, అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని ఆరోపించారు.

నా ప్రమేయం లేకుండా జేఏసీ (JAC) ప్రకటన

ఎక్సైజ్ శాఖలో తలెత్తిన ఈ తీవ్రమైన సమస్య పరిష్కారమైందని జేఏసీ (Joint Action Committee) నాయకులు, కనీసం తనను సంప్రదించకుండానే ప్రకటించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. సంఘటన జరిగిన రోజు అక్కడ ఉన్న జిల్లా/డివిజన్ అధికారులు (ES, AC, DC, JC, Addl Commissioner) ఎవరూ ఈ రోజు కమిషనర్‌ను కలిసిన జేఏసీ బృందంలో లేరని ఆయన గుర్తు చేశారు. బాధితులపైనే మళ్లీ దాడి చేసేలా జేఏసీ తీరు ఉందని, కింది స్థాయి సిబ్బందిని అధికారులే దూషించినట్లుగా సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

బతికి ఉన్నాను కాబట్టే ఇవన్నీ చెప్పగలుగుతున్నాను

ఆ రోజు జరిగిన అవమానానికి తన హృదయం ఎంతలా క్షోభించిందో ఆసుపత్రిలో తనను చూసిన వారికి మాత్రమే తెలుస్తుందని సోమిరెడ్డి కంటతడి పెట్టారు. "ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నాను కాబట్టే ఇవన్నీ రాయగలుగుతున్నాను.. లేదంటే కమిషనర్ ఏ తప్పూ చేయలేదని నిరూపించుకునేవారు" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆత్మాభిమానానికి మించిన జీవితం లేదని, మనిషిని మనిషిగా గౌరవించడమే కనీస సంస్కారమన్న మహాత్ముని మాటలను ఆయన ఉదహరించారు.

ప్రభుత్వ పెద్దలను కలిసి న్యాయం అడుగుతా

గత 30 ఏళ్లుగా ఎక్సైజ్ శాఖ ప్రతిష్ట కోసం, నమ్మిన సిద్ధాంతంతో పనిచేస్తున్నానని సోమిరెడ్డి తెలిపారు. తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత త్వరలోనే ప్రభుత్వ ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి తన ఆవేదనను వివరిస్తానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు తనకు తప్పక న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యను తాను రాజకీయం చేయదలచుకోలేదని, అందుకే మీడియాకు దూరంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తన బాధను అర్థం చేసుకుని మద్దతుగా నిలిచే ఉద్యోగ సంఘాల నాయకులను స్వాగతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

ఈ లేఖతో ఎక్సైజ్ శాఖలో కమిషనర్ తీరుపై అధికారుల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి బహిర్గతమైంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement
Advertisement