త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medaram Jatara Incident |మేడారం జాతరలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసు.. సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్

మేడారం జాతరలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తలపై జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్రంగా స్పందించింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తక్షణ విచారణకు ప్రత్యేక కమిటీని నియమించింది.

J

Telangana | Published On Feb 4, 2026, 7.40 pm IST

Medaram Jatara Incident |మేడారం జాతరలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసు.. సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్
Advertisement

Medaram Jatara Incident | త్రినేత్ర.న్యూస్: తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న మేడారంలో ఇటీవల జరిగిన ప్రసిద్ధ సమ్మక్క సారలమ్మ జాతరలో చోటుచేసుకున్నట్లుగా చెబుతున్న ఓ అమానుష ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతర సమయంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వస్తున్న మీడియా కథనాలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది.

అసలేం జరిగింది?

సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. మేడారంలో ఇటీవల జరిగిన జాతరలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వార్తలు కలకలం రేపడంతో మహిళా కమిషన్ తక్షణమే స్పందించింది.

విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్, నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఒక విచారణ కమిటీని నియమించారు.

ఈ కమిటీకి NCW సభ్యురాలు మిస్ డెలినా ఖోంగ్‌డప్ (Ms.Delina Khongdup) నేతృత్వం వహిస్తారు. కమిటీ సభ్యురాలిగా NCW సీనియర్ కోఆర్డినేటర్ కాంచన్ ఖట్టర్ వ్యవహరిస్తారు. వీరికి న్యాయ సహకారం అందించడానికి ములుగు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) ద్వారా ఒక న్యాయవాదిని కూడా నియమించనున్నారు.

ఫిబ్రవరి 5 నుంచి విచారణ

ఈ విచారణ కమిటీ ఫిబ్రవరి 5, 2026 (గురువారం) నుంచే తమ విచారణను ప్రారంభించనుంది. కమిటీ సభ్యులు ములుగుకు వెళ్లి, బాధితురాలిని, సంబంధిత అధికారులను, ప్రత్యక్ష సాక్షులను కలుసుకుని వివరాలు సేకరిస్తారు. అసలు ఏం జరిగింది? పోలీసులు ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటి? భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అనే అంశాలపై నివేదికను కమిషన్‌కు సమర్పిస్తారు.

మహిళలు, మైనర్ బాలికల రక్షణే తమ ధ్యేయమని, ఈ కేసులో వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూస్తామని జాతీయ మహిళా కమిషన్ స్పష్టం చేసింది.

https://x.com/DDNewslive/status/2019025131713225130

 

Advertisement
Advertisement