త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tungathurthi Congress Politics | తుంగతుర్తి కాంగ్రెస్‌లో రచ్చ.. బీఆర్ఎస్ నేతలకు పట్టాభిషేకమా? పీసీసీ చీఫ్‌కు ఎంపీ చామల లేఖ

తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు రేగాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే మండల పదవులు కట్టబెట్టడంపై రచ్చ మొదలవడంతో అధిష్టానానికి ఎంపీ చామల కీలక లేఖ రాశారు.

J

Telangana | Published On Jul 7, 2026, 10.00 pm IST

Tungathurthi Congress Politics | తుంగతుర్తి కాంగ్రెస్‌లో రచ్చ.. బీఆర్ఎస్ నేతలకు పట్టాభిషేకమా? పీసీసీ చీఫ్‌కు ఎంపీ చామల లేఖ
Advertisement
  • 9 మండలాలకు గానూ, ఎక్కువ శాతం పదవులు బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నేతలకే కేటాయించడంపై వివాదం
  • పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వారిని కాదని 'జంప్ జలానీ'లకు ప్రాధాన్యం ఇవ్వడంపై స్థానిక కేడర్ ఫైర్
  • స్థానిక పరిణామాల నేపథ్యంలో.. మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాన్ని తక్షణమే నిలిపివేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఎంపీ లేఖ
  • మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే సామేలు సహా ఇతర సీనియర్లతో చర్చించాకే నియామకాలపై నిర్ణయం తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి

Tungathurthi Congress Politics | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ కాంగ్రెస్‌లో (Telangana Congress) పదవుల పంపకం చిచ్చు రేపుతోంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా పరిధిలోని తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో (Tungathurthi constituency) స్థానిక కేడర్‌లో అసంతృప్తి భగ్గుమంది. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కనపెట్టి.. బీఆర్ఎస్ (BRS) నుంచి వలస వచ్చిన నేతలకు మండల పార్టీ అధ్యక్ష పదవులు (Mandal President posts) కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. పరిస్థితి చేయిదాటుతుండటంతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ వివాదంపై స్పందిస్తూ పీసీసీ (TPCC) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు కీలక లేఖ రాశారు.

'జంప్ జలానీ'లకే పెద్ద పీట?

తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలో (యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల పరిధి) మొత్తం తొమ్మిది మండలాలు ఉన్నాయి. అయితే, తాజాగా పార్టీ సిఫార్సు చేసిన మండల పార్టీ అధ్యక్షుల జాబితాలో ఒకట్రెండు మండలాలు మినహా.. మిగతా అన్ని చోట్లా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికే పెద్దపీట వేశారనే ప్రచారం స్థానికంగా అగ్గిరాజేసింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, స్థానిక కేడర్ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పీసీసీ చీఫ్‌కు ఎంపీ చామల లేఖ

క్షేత్రస్థాయిలో కార్యకర్తల ఆగ్రహాన్ని గ్రహించిన ఎంపీ చామల అధిష్టానాన్ని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం తాను అధికారిక పర్యటనలో (Official tour) ఉన్నానని, తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తి, అభిప్రాయ భేదాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు రాసిన లేఖలో వినయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

అందరి ఏకాభిప్రాయంతోనే నిర్ణయం

ఈ సున్నితమైన అంశంపై ఏకపక్షంగా కాకుండా.. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నేతలతో సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని ఎంపీ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, పార్లమెంట్ ఇంచార్జ్ బన్నూరాజ నర్సయ్య, అసెంబ్లీ ఇంచార్జ్ కొండేటి మల్లయ్య, అలాగే సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల డీసీసీ (DCC) అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, బీర్ల ఐలయ్య తదితరులతో సంప్రదింపులు జరపాలని ఆ లేఖలో సూచించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా, అందరి ఏకాభిప్రాయం (Consensus) ఏర్పడే వరకు ఈ నియామకాల ప్రకటనను హోల్డ్‌లో పెట్టాలని ఎంపీ చామల స్పష్టం చేశారు.

Advertisement
Advertisement