త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ‘మిషన్ భగీరథ’ అనేది పథకం కాదు.. ప్రజల జీవితాలను మార్చిన మహత్తర ప్రణాళిక

Harish Rao | మిష‌న్ భ‌గీర‌థ అనేది ప‌థ‌కం కాద‌ని.. తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల‌ను మార్చిన మ‌హ‌త్త‌ర ప్ర‌ణాళిక అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. మిషన్ భగీరథను కేవలం ప్రభుత్వ పథకంగా చూడలేమ‌ని.. అదొక అమృత జ‌ల ప్ర‌ణాళిక అని వ్యాఖ్యానించారు. దేశానికి రోల్ మోడల్‌గా నిలిచి హర్ ఘర్ జల్ పథకం అయిందని కొనియాడారు.

S

Telangana | Published On Aug 7, 2026, 4.14 pm IST

Harish Rao | ‘మిషన్ భగీరథ’ అనేది పథకం కాదు.. ప్రజల జీవితాలను మార్చిన మహత్తర ప్రణాళిక
Advertisement
  • ఇంటింటికీ తాగునీటి విప్లవానికి ప‌దేళ్లు పూర్త‌వ‌డం సంతోష‌క‌రం
  • కేసీఆర్ దూరదృష్టితో రూపుదిద్దుకుంది.. తెలంగాణ ఫ్లోరోసిస్ రక్కసి రూపుమాపిన సుజల వ్యవస్థ అది
  • ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేసి ఆనందం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: మిష‌న్ భ‌గీర‌థ అనేది ప‌థ‌కం కాద‌ని.. తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల‌ను మార్చిన మ‌హ‌త్త‌ర ప్ర‌ణాళిక అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. మిషన్ భగీరథను కేవలం ప్రభుత్వ పథకంగా చూడలేమ‌ని.. అదొక అమృత జ‌ల ప్ర‌ణాళిక అని వ్యాఖ్యానించారు. దేశానికి రోల్ మోడల్‌గా నిలిచి హర్ ఘర్ జల్ పథకం అయిందని కొనియాడారు. కేసీఆర్ దూర‌దృష్టితో రూపుదిద్దుకున్న ఈ ప‌థ‌కం కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంతో నిర్వీర్య‌మ‌వుతోంద‌ని మండిప‌డ్డారు. పథకాన్ని నిర్మించడం ఎంత ముఖ్యమో.. దాన్ని నిరంతరం నిర్వహించడం అంతకంటే ముఖ్యమ‌ని నొక్కి చెప్పారు. మిష‌న్ భ‌గీర‌థ‌కు ప‌దేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా శుక్ర‌వారం ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేసి ఆయ‌న‌ ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణలో ప్రతి ఇంటికీ సురక్షిత, స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన మిషన్ భగీరథకు నేటితో పదేళ్లు పూర్తి కావడం సంతోషకరం. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజు ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభం అయిన ఈ పథకం ప్రజల తాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపింది. మిషన్ భగీరథ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న అతిపెద్ద తాగునీటి మౌలిక వసతుల ప్రాజెక్టుగా నిలిచింది. దేశానికి రోల్ మోడల్‌గా నిలిచి హర్ ఘర్ జల్ పథకం అయింది అని మాజీ మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏ ఇంట్లోనూ తాగునీటి కోసం ఇబ్బంది ఉండొద్ద‌ని, ఏ తల్లి కూడా బిందె పట్టుకుని కిలోమీటర్ల దూరం నడవొద్ద‌ని, ఏ గ్రామం కూడా వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కోవ‌ద్ద‌నే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ బృహత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు అనేక గ్రామాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో తాగునీటి పరిస్థితి దయనీయంగా ఉండేది. తాగు నీటి కోసం బిందెలు మోసుకుంటూ కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం మహిళలకు నిత్యకృత్యంగా ఉండేది. చాలా గ్రామాల్లో చేతిపంపులు, బోర్లు, స్థానిక నీటి వనరులపైనే ప్రజలు ఆధారపడేవారు. భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది అని హ‌రీశ్ వాపోయారు.

ఫ్లోరైడ్ సమస్య ఉన్న ప్రాంతాల్లో విషపూరితమైన నీటినే తాగాల్సిన పరిస్థితులు ఉండేవి. దానివల్ల ఎముకలు వంకర్లు తిరిగి ఎదుగుదల ఆగిపోయేది. మారుమూల ప్రాంతాల్లో కలుషిత నీటి కారణంగా మలేరియా, డెంగీ, డయేరియాతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు. ఈ దుస్థితిని మార్చాలంటే తాత్కాలిక చర్యలు సరిపోవని కేసీఆర్ గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక సమగ్ర తాగునీటి గ్రిడ్‌ను నిర్మించాలనే ఆలోచన చేశారు. ఆ బృహత్తర యజ్ఞమే మిషన్ భగీరథ అని హ‌రీశ్‌రావు తెలిపారు.

గోదావరి, కృష్ణా నదుల నుంచి ఉపరితల ప్రవాహ జలాన్ని సేకరించి, శుద్ధి చేసి, భారీ పైప్‌లైన్ల ద్వారా గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలకు తరలించి.. ఇంటింటికీ సరఫరా చేసే సమగ్ర తాగునీటి వ్యవస్థను నిర్మించారు. వేల కిలోమీటర్ల పైప్‌లైన్లు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులతో ఒక భారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఒక రాష్ట్రం మొత్తం తాగునీటి అవసరాలను ఒకే సమగ్ర వ్యవస్థతో పరిష్కరించాలనే ఆలోచన అప్పట్లో దేశంలోనే అరుదైనది. అందుకే మిషన్ భగీరథ తెలంగాణ అభివృద్ధి చరిత్రలో మాత్రమే కాదు.. దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది అని మాజీ మంత్రి పేర్కొన్నారు.

ఫ్లోరైడ్ రహిత తెలంగాణ..

మిషన్ భగీరథ ప్రభావంతో గ్రామీణ తెలంగాణలో మహిళలు తాగునీటి కోసం పడే కష్టాలు తగ్గాయి. సురక్షిత తాగునీరు, ఇంటి వద్దకే నల్లా ద్వారా నీరు అందుబాటులోకి రావడంతో మహిళలకు సమయం ఆదా అయింది. ఆరోగ్య బాధలు తగ్గిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాణాలు నిలిచాయి. పిల్లలు తాగు నీటి కోసం వెళ్లకుండా చదువుపై దృష్టి పెట్టే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీటిని అందించడంలో మిషన్ భగీరథ కీలక పాత్ర పోషించింది. ఫ్లోరైడ్ రహిత తెలంగాణకు మిషన్ భగీరథ సాధించిన ఖ్యాతి అని ఆయ‌న కొనియాడారు.

మిషన్ భగీరథను కేవలం ఒక ప్రభుత్వ పథకంగా చూడలేం. ఇది తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మార్చిన సమగ్ర వ్యవస్థ. తాగునీటితో ప్రజల ఆరోగ్యాలను కాపాడిన అమృత జల ప్రణాళిక. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నేడు మిషన్ భగీరథ పథకానికి శాపంగా మారింది. అనేక ప్రాంతాల్లో పైప్‌లైన్ల లీకేజీలు, మోటార్ల సమస్యలు, పంపింగ్ వ్యవస్థలో ఇబ్బందులు, విద్యుత్ అంతరాయాలు, మరమ్మతుల జాప్యం, నీటి సరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన మిషన్ భగీరథను నిర్వహించే సమర్థత లేకపోవడం సిగ్గుచేటు. పథకాలను రాజకీయ కక్షలకు బలి చేయొద్దు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి మిషన్ భగీరథను నిర్లక్ష్యం చేయడం క్రిమినల్ నెగ్లిజెన్స్ అని హ‌రీశ్‌రావు ఫైర‌య్యారు.

ప్రభుత్వాలు మారుతాయి.. కానీ ప్రజల అవసరాలు మారవు. రాజకీయ కక్షలు, వ్యక్తిగత విమర్శలను పక్కనపెట్టి ప్రజలకు ఉపయోగపడుతున్న పథకాలను సజావుగా నిర్వహించాలి. మిషన్ భగీరథ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి. దెబ్బతిన్న పైప్‌లైన్లు, మోటార్లు, పంపింగ్ వ్యవస్థలను వెంటనే మరమ్మతు చేయాలి. నీటి సరఫరాలో ఎక్కడ అంతరాయం ఏర్పడినా వెంటనే స్పందించేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పదేళ్ల క్రితం కేసీఆర్ ఏర్పాటు చేసిన సమగ్ర తాగు నీటి వ్యవస్థను కాపాడుతూ.. రాబోయే తరాలకు కూడా సురక్షితమైన తాగునీరు అందించాలి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సమగ్ర చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంతో నిర్వీర్యం చేయకుండా మిషన్ భగీరథ పథకాన్ని మరింత బలోపేతం చేయాలి అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement