త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | తెలంగాణ‌ను క్రీడా శ‌క్తిగా తీర్చిదిద్దుతాం

Vakiti Srihari | తెలంగాణలో క్రీడలను విద్యతో అనుసంధానం చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

S

Telangana | Published On Sep 12, 2026, 3.35 pm IST

Vakiti Srihari | తెలంగాణ‌ను క్రీడా శ‌క్తిగా తీర్చిదిద్దుతాం
Advertisement

అంత‌ర్జాతీయ స్థాయి క్రీడాకారుల‌ను త‌యారు చేస్తాం
శాసన మండలిలో మంత్రి వాకిటి శ్రీహరి

Vakiti Srihari | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణలో క్రీడలను విద్యతో అనుసంధానం చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శాసనమండలిలో సభ్యులు బల్మూర్ వెంకట నర్సింగరావు, మహేష్ కుమార్, శ్రీపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి శాస్త్రీయ శిక్షణ, అత్యుత్తమ కోచింగ్ అందించడంతో పాటు స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పరిశోధన వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే YIPESU ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు దేశీయ, అంతర్జాతీయ ప్రముఖ క్రీడా విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా *కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీ (KNSU)తో సహకారానికి సంబంధించిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

క్రీడా విజ్ఞానంతో పాటు ఉపాధి అవకాశాలు

క్రీడాకారులకు కేవలం మైదానంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆధునిక క్రీడా విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన ఆధారిత శిక్షణ అందించే విధంగా YIPESUలో కోర్సులను రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి అంతర్జాతీయ పోటీలకు తెలంగాణ క్రీడాకారులను సిద్ధం చేసేందుకు హై ప‌ర్మార్పెన్స్ సెంట‌ర్స్‌తో పాటు ఆధునిక శిక్షణ విధానాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల నుంచే క్రీడా ప్రతిభను వెలికితీస్తాం

క్రీడా ప్రతిభ పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా తెలంగాణలోని ప్రతి గ్రామం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న మైదానాల ఆధునీకరణ, క్రీడా పరికరాల సమకూర్పు, పాఠశాల స్థాయి నుంచే క్రీడా ప్రతిభను గుర్తించడం, మండల, జిల్లా స్థాయిలో ప్రతిభా అన్వేషణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. అలాగే స్థానిక కోచ్‌లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు అథ్లెటిక్స్, హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో తదితర క్రీడలకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.

ఇప్పటికే సీఎం కప్ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఐదు అంచెలలో నిర్వహించామని, 2024 లో 12 కోట్ల వ్యయంతో 36 క్రీడ అంశాలతో 2 లక్షల 90 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. 2025లో 38.50 కోట్లతో 46 క్రీడాంశాలతో 5.42 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని వెల్లడించారు. గ్రామీణ క్రీడా పోటీలను నిర్వహించి, ప్రతిభావంతులైన క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర స్థాయి అకాడమీలతో అనుసంధానం చేస్తామని తెలిపారు. బాలికలు, యువత క్రీడల్లో మరింతగా పాల్గొనేలా ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడతామని మంత్రి వెల్లడించారు.

క్రీడాకారులకు ప్రోత్సాహం

క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 145 మంది క్రీడాకారులకు 16 కోట్ల 60 లక్షలు ఇచ్చి, స్పోర్ట్స్ కోట ద్వారా 304 మంది అథ్లెట్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. మహమ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్లకు డిఎస్పి స్థాయి ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో క్రీడా మైదానం - ప్రతి యువకుడిలో క్రీడా ప్రతిభను పెంచి తద్వారా తెలంగాణను దేశంలోనే క్రీడా శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం క్రీడా రంగాన్ని బలోపేతం చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

YIPESU ద్వారా క్రీడలు–విద్య–ఉపాధి–పరిశోధనలను అనుసంధానం చేసి, తెలంగాణ యువతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవకాశాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మూడు బడ్జెట్లలోనే క్రీడారంగానికి 1,535 కోట్లు కేటాయించగా, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో కేటాయించిన మొత్తం కంటే ఈ ఒక్క ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ క్రీడా బడ్జెట్ ఎక్కువగా ఉందని తెలిపారు. గత కేటాయింపులతో పోలిస్తే క్రీడా బడ్జెట్ నాలుగు రెట్లు పెరిగిందన్నారు. గచ్చిబౌలిలో నూతన హాకీ స్టేడియం కోసం 2 టర్ఫులను ఏర్పాటు చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌న‌ర్‌షిప్‌తో 700 కోట్లతో ఆధునీకరిస్తున్నామన్నారు.

13 కొత్త అకాడమీలు ఏర్పాటు

క్రీడా అకాడమీల సంఖ్య 6 నుంచి 19కి పెరిగాయని, 2024 -26 మధ్య 13 కొత్త అకాడమీలు ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. ఇందులో రెండు ఎలైట్ ఫిఫా ఫుట్‌బాల్ అకాడమీలు ఉన్నాయని, మహిళల ఫిఫా అకాడమీ దేశంలోనే మొట్టమొదటిదని మంత్రి స్పష్టం చేశారు. హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్‌లో ఇప్పటికే మూడు స్పోర్ట్స్ స్కూల్స్ ఉండగా హనుమకొండలో కొత్త స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభం అయ్యిందని తెలిపారు. హైదరాబాదులో తొలిసారిగా FIH హాకీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్స్ నిర్వహించామన్నారు. హైదరాబాద్ వేదిక నుంచి టాప్ మూడు జట్లు ప్రపంచ కప్ కు అర్హత సాధించాయని మంత్రి వెల్లడించారు.

డిసెంబర్ 11 నుండి 22 వరకు 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణ ను 272 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతోందని తెలియజేశారు. ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హాకీ ఇండియా లీగ్ ,వరల్డ్ పికిల్ బాల్ లీగ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్, టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లు ఈ ఏడాది తెలంగాణలో నిర్వహించనున్నామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement