త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | ఎల్‌నినోతో అప్రమత్తంగా ఉండాలి.. రైతులకు మంత్రి ఉత్తమ్ కీలక సూచనలు

Uttam Kumar Reddy | ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.

P

Telangana | Published On Jul 3, 2026, 6.48 pm IST

Uttam Kumar Reddy | ఎల్‌నినోతో అప్రమత్తంగా ఉండాలి.. రైతులకు మంత్రి ఉత్తమ్ కీలక సూచనలు
Advertisement

Uttam Kumar Reddy | ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప‌లు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో వ్యవసాయం ఒక పండుగలా మారిందని మంత్రి అన్నారు. రికార్డు స్థాయిలో వరి దిగుబడి సాధించడంతో పాటు భారీగా ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఏడురకాల సన్న వరిధాన్యాలకు బోనస్ కొనసాగుతోందని, ఇది రైతులకు మరింత మేలు చేస్తుందని పేర్కొన్నారు.

అయితే, ఎల్‌నినో ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం తగ్గిందని ఆయన హెచ్చరించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ పద్ధతుల్లో అవసరమైన మార్పులు చేసుకోవాలని రైతులకు సూచించారు. నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో 2026 జూన్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణంతో పోలిస్తే సుమారు 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని మంత్రి తెలిపారు. ఇది ఇటీవలి సంవత్సరాల్లో అత్యంత పొడి జూన్ నెలల్లో ఒకటిగా నిలిచిందన్నారు. తెలంగాణలో కూడా జూన్‌లో సుమారు 22 శాతం తక్కువ వర్షపాతం నమోదవడంతో పలు ప్రాంతాల్లో విత్తనాల విత్తడం ఆలస్యమైందని చెప్పారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అధిక భాగం మహారాష్ట్రలో ఉండటంతో అక్కడ వర్షాలు తగ్గడం వల్ల తెలంగాణకు గోదావరి జలాల ప్రవాహం కూడా ఆలస్యమవుతోందని మంత్రి వివరించారు.

నీటి లభ్యత అనిశ్చితంగా ఉన్న ప్రాంతాల్లో అధిక నీరు అవసరమయ్యే పంటల బదులు తక్కువ నీటితో సాగు చేయగల, ఎండలను తట్టుకునే పంటలను ఎంచుకోవాలని రైతులకు సూచించారు. రిజర్వాయర్లలో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని, ముందుగా తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చి అనంతరం సాగునీటి అవసరాలను తీర్చేలా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వర్షపాతం తక్కువగా కొనసాగితే సమర్థవంతమైన నీటి నిర్వహణ కీలకమని మంత్రి పేర్కొన్నారు. జలాశయాల్లో నీటి నిల్వలు, వర్షపాతం పరిస్థితులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, అవసరాన్ని బట్టి తగిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. పొడి వాతావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు చేపడతామని రైతులకు భరోసా ఇచ్చారు.

సరైన ప్రణాళిక, రైతుల సహకారంతో ఎల్‌నినో సవాళ్లను అధిగమించి తెలంగాణ వ్యవసాయం అభివృద్ధి పథంలో కొనసాగుతుందనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా గడ్డిపల్లి గ్రామంలో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సమీకృత పాఠశాల పనులను మంత్రి పరిశీలించారు. హుజూర్‌నగర్ పట్టణంలో రూ.7.25 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, రూ.4.50 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం పనులను కూడా ఆయన పరిశీలించారు. అలాగే, చిలుకూరు–జెర్రిపోతులగూడ మధ్య నిర్మించిన బీటీ రహదారిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.

Advertisement
Advertisement