త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar vs Modi | తెలంగాణకు మీరేం చేశారు మోదీ? రాహుల్‌పై కేటీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే: మంత్రి పొన్నం ఫైర్

ప్రధాని మోదీ పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీని విమర్శించిన కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

J

Karimnagar | Published On May 6, 2026, 7.00 pm IST

Ponnam Prabhakar vs Modi | తెలంగాణకు మీరేం చేశారు మోదీ? రాహుల్‌పై కేటీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే: మంత్రి పొన్నం ఫైర్
Advertisement
  • హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం
  • 12 ఏళ్లుగా రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని, నిధుల కేటాయింపులో వివక్ష చూపుతోందని మోదీపై ఫైర్
  • రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ విచారణ వేస్తే బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న

Ponnam Prabhakar vs Modi | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ పర్యటనకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Narendra Modi) హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా తాను స్వాగతం పలుకుతున్నానని, అది రాజకీయ వ్యవస్థీకృత విధానమని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, తెలంగాణ మంత్రిగా మోదీని కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నానని ఆయన చెప్పారు. హుస్నాబాద్ (Husnabad) ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ (BRS) పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

నిధుల కేటాయింపులో తెలంగాణపై వివక్ష

గత 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏంచేసిందని పొన్నం ప్రశ్నించారు. ఫెడరల్ సిస్టమ్ లో భాగంగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అంతా ఢిల్లీ వెళ్లి వినతులు ఇస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇవ్వడంపై తమకు ఎలాంటి ఆక్షేపణ లేదని, అయితే తెలంగాణకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే అని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రం నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నా అభివృద్ధికి సహకరించడం లేదని, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. "అమరవీరుల ఆకాంక్షలను అవమానించేలా ఒక ఎంపీ తెలంగాణను పాకిస్తాన్ విభజనతో పోలుస్తున్నారు. బీజేపీకి తెలంగాణపై ఎంత అక్కసు ఉందో దీన్ని బట్టే తెలుస్తోంది," అని ఆయన విమర్శించారు.

Minister Ponnam Prabhakar Slams PM Modi and KTR Over Telangana Issues

రాహుల్ గాంధీకి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ లాంటి మానవతావాది దేశంలోనే లేరని, ఆయనపై విమర్శలు చేస్తే కేటీఆర్ కు ఏదో ఖ్యాతి దొరుకుతుందని అనుకోవడం దురదృష్టకరం అని అన్నారు. అభివృద్ధిలో తెలంగాణను ముందుకు తీసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై ఇష్టారీతిన మాట్లాడటం మానుకోవాలని, కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదని, నైరాశ్యంలో ఉన్న పార్టీని నడిపించలేకే ఇలా కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ధాన్యం కొనుగోళ్లపై నిరంతర సమీక్ష

రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై (Paddy procurement) సీఎం రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖ మంత్రి, సీఎస్ ప్రతిరోజూ కలెక్టర్లతో సమీక్షిస్తున్నారని పొన్నం స్పష్టం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని, ప్రతి గింజ కొంటామని భరోసా ఇచ్చారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దేనని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా కాకుండా ఏకంగా రూ.21 వేల కోట్లు మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణలో ఉందన్నారు.

సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) లో బీఆర్ఎస్ అవినీతి చేసిందని ఆరోపించిన నడ్డా, అమిత్ షా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ (CBI) విచారణ కోరితే ఎందుకు మౌనంగా ఉన్నారని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను పొన్నం నిలదీశారు. విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణంపై విచారణ వేస్తే బీజేపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిజాలు నిగ్గుతేల్చాలని, కేసీఆర్ దోషి అయితే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ జరపకుండా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగుతున్నాయని, రెండు పార్టీలు ఒకే ట్యూన్ వినిపిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement