త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy | పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారు నివసిస్తున్న ప్రాంతాలకు దగ్గర్లోనే గృహాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను వినియోగిస్తూ పేదలకు గౌరవప్రదమైన జీవన వసతి కల్పించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

P

Telangana | Published On Jun 5, 2026, 7.33 pm IST

Ponguleti Srinivas Reddy | కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి
Advertisement

Ponguleti Srinivas Reddy | పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారు నివసిస్తున్న ప్రాంతాలకు దగ్గర్లోనే గృహాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను వినియోగిస్తూ పేదలకు గౌరవప్రదమైన జీవన వసతి కల్పించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి క్యూర్ పరిధిలో 1 లక్ష ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్లు కలిపి మొత్తం 3.50 లక్షల ఇళ్లకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, నగరానికి 30–40 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించడంతో పేదల జీవన వాస్తవాలను విస్మరించారని మంత్రి వ్యాఖ్యానించారు. ఇల్లు మాత్రమే కాదు, ఉపాధి కూడా ముఖ్యమనే అంశాన్ని అప్పటి పాలకులు పట్టించుకోలేదని అన్నారు. దూర ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లకు వెళ్లలేక పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి గుర్తుచేశారు. రోజువారీ కూలి పనులు, చిన్న వ్యాపారాలు, విద్య, వైద్యం, రవాణా సమస్యల కారణంగా అనేక కుటుంబాలు ఆ ఇళ్లను వాడుకోలేకపోయాయని తెలిపారు. ఫలితంగా వేలాది ఇళ్లు ఖాళీగానే మిగిలిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఈ తప్పిదాలను పునరావృతం చేయకుండా, పేదలు ఇప్పటికే నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణం చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. విలువైన ప్రభుత్వ భూములను పేదల సంక్షేమానికి వినియోగిస్తూ లక్ష ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు.

పేద కుటుంబాల మహిళలకు సొంతింటిపై హక్కు కల్పించడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక భద్రత మరింత బలపడుతుందని మంత్రి అన్నారు. సొంత ఇల్లు మహిళ సాధికారతకు, కుటుంబ స్థిరత్వానికి పునాది అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇళ్ల డిజైన్ పేదల అవసరాలకు అనుగుణంగా ఉండాలని, కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement