త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar Babu | మీ సేవా కేంద్రాలే డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లు : మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

Sridhar Babu | రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాలను డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లుగా తీర్చిదిద్దనున్నట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. స్థానిక చిన్న, మధ్య తరహా వ్యాపారులకు తక్కువ ఖర్చుతో డిజిటల్ ప్రచార సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.

P

Telangana | Published On Aug 26, 2026, 6.12 pm IST

Sridhar Babu | మీ సేవా కేంద్రాలే డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లు : మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు
Advertisement

Sridhar Babu | రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాలను డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లుగా తీర్చిదిద్దనున్నట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. స్థానిక చిన్న, మధ్య తరహా వ్యాపారులకు తక్కువ ఖర్చుతో డిజిటల్ ప్రచార సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. మీ సేవా–మెటా సంయుక్తంగా చేపడుతున్న డిజిటల్ మార్కెటింగ్ కార్యక్రమాన్ని అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. గచ్చిబౌలిలోని షెరటాన్‌ హోటల్‌లో బుధవారం మీ సేవా డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ రెండో దశ కార్యక్రమం జరిగింది. వివిధ జిల్లాల నుంచి 140 మందికి పైగా మీ సేవా విలేజ్‌ లెవల్‌ ఎంటర్‌ప్రెన్యూర్లు (వీఎల్‌ఈలు) పాల్గొన్నారు. వీరికి ‘డిజిటల్ బిజినెస్ అంబాసిడర్లుగా’ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డంలో ముందుంటాం..

ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ముందుంటుందని చెప్పారు. రాష్ట్రంలో 5 వేలకుపైగా మీ సేవా కేంద్రాలు ఉన్నాయని, వాటి ద్వారా స్వీట్‌ షాపులు, టెక్స్‌టైల్‌ దుకాణాలు, నైపుణ్య వృత్తిదారులు, ఇతర చిన్న వ్యాపారులకు డిజిటల్ మార్కెటింగ్ సేవలను చేరువ చేయవచ్చన్నారు. మీ సేవా కేంద్రాలు పౌర సేవలకే పరిమితం కాకుండా డిజిటల్ అవగాహన, ఆదాయ అవకాశాలను పెంచే వేదికలుగా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని తొలుత హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ/క్యూర్‌ పరిధిలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేశారు. సుమారు 120 మంది వీఎల్‌ఈలకు డిజిటల్ మార్కెటింగ్, సోషల్‌ మీడియా ప్రకటనలపై శిక్షణ ఇచ్చారు. వారిలో 10 మందికిపైగా ఇప్పటికే డిజిటల్ ప్రకటనల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక వ్యాపారులకు 17కుపైగా ప్రకటనలను రూపొందించి ప్రచురించారు. దీంతో వీఎల్‌ఈలకు అదనపు ఆదాయ మార్గం ఏర్పడగా.. వ్యాపారులు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తక్కువ వ్యయంతో తమ ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేసుకునే అవకాశం ల‌భించింద‌న్నారు.

జిల్లాల‌కు విస్త‌ర‌ణ‌..

పైలట్‌ కార్యక్రమానికి వచ్చిన స్పందనతో రెండో దశను అన్ని జిల్లాలకు విస్త‌రిస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. ప్రతి జిల్లా నుంచి నలుగురు నుంచి ఐదుగురు వీఎల్‌ఈలను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వీరు ఆయా జిల్లాల్లో ‘డిజిటల్ బిజినెస్ అంబాసిడర్లుగా’ పనిచేస్తారు. స్థానిక వ్యాపార అవసరాలను గుర్తించడం, డిజిటల్ మార్కెటింగ్ ప్రయోజనాలను వివరించడం, ప్రకటనల రూపకల్పనలో సహకరించడం, లక్ష్య వినియోగదారులను గుర్తించడం వంటి సేవలను అందిస్తారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ (ఈఎస్‌డీ), ఐటీ అండ్‌ సీ శాఖ, మెటా సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో మీ సేవా డిజిటల్ మార్కెటింగ్ కార్యక్రమంలో భాగస్వామ్యం అధికారికంగా ప్రారంభమైంది. మీ సేవా కమిషనర్‌, ఈఎస్‌డీ అధికారి టి.రవికిరణ్‌, ఐఎఫ్‌ఎస్‌, మెటా మేనేజింగ్‌ డైరెక్టర్‌, కంట్రీ హెడ్‌ అరుణ్‌ శ్రీనివాస్‌, స్ట్రాటజిక్‌ ప్రోగ్రామ్స్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ హెడ్‌ దివ్య ఖేమాని వధేరా, మీడియా, ట్రావెల్‌ అండ్‌ సర్వీసెస్‌ ఎకోసిస్టమ్‌ వర్టికల్‌ హెడ్‌ రిషాద్‌ చిందమడ తదితరులు పాల్గొన్నారు.

కొత్త పోర్టల్‌, హెల్ప్‌లైన్‌

స్థానిక వ్యాపారులు మీ సేవా ద్వారా నేరుగా డిజిటల్ మార్కెటింగ్ సహాయం కోరేలా కొత్త పోర్టల్‌, హెల్ప్‌లైన్‌ సదుపాయాలను మంత్రి ప్రారంభించారు. పోర్టల్ meeseva.telangana.gov.in, టోల్‌ఫ్రీ 1100 / 1800-425-1110లో సంప్ర‌దించాల‌న్నారు. ప్రతి శిక్షణ పొందిన వీఎల్‌ఈ తొలుత ఒక వ్యాపారంతో సేవలు ప్రారంభించి.. ఆ తర్వాత 10, 100 వ్యాపారాలకు విస్తరించేలా పనిచేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి జిల్లాలో డిజిటల్ మార్కెటింగ్‌లో శిక్షణ పొందిన వీఎల్‌ఈలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక వ్యాపారులకు అందుబాటు ధరలో డిజిటల్ ప్రచార సేవలు అందించడం ద్వారా రాష్ట్రంలో డిజిటల్ వ్యాపార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement