త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

పరకాల రగడ నుంచి ప్రజాభవన్ పవర్‌పాలిటిక్స్ వరకు: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా వర్సెస్ సీఎం వార్! తుది అంకానికి చేరిన రాజకీయం

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరితరం కావడం లేదు! సరిగ్గా ఏడాది క్రితం అడపాదడపా వినిపించిన చిన్న చిన్న నిప్పులు.. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని కుదిపేసే మహోగ్ర జ్వాలగా మారాయి. పవర్‌ పాలిటిక్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌, హైకమాండ్ వార్‌ నడుమ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన ఆ సంచలన కథనం మీ కోసం!

S

Telangana | Published On Aug 26, 2026, 5.50 pm IST

పరకాల రగడ నుంచి ప్రజాభవన్ పవర్‌పాలిటిక్స్ వరకు: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా వర్సెస్ సీఎం వార్! తుది అంకానికి చేరిన రాజకీయం

సంక్షిప్త సారాంశం

కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా కుటుంబం మధ్య బహిరంగ యుద్ధానికి దారితీశాయి. ఈ వివాదం నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో డిప్యూటేషన్ల రద్దుతో పాటు, క్రమశిక్షణ కమిటీ ద్వారా పార్టీ యంత్రాంగం వేగంగా పావులు కదిపింది. బెంగళూరులో ఖర్గే భేటీ, ప్రజాభవన్‌లో కీలక నేతల మంతనాల నడుమ కాంగ్రెస్‌లో తదుపరి రాజకీయ పరిణామాలు ఏంటనే ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.

Advertisement

                                పరకాల  నుంచి ప్రజాభవన్ దాకా.. కొండా ఫ్యామిలీ వర్సెస్ సీఎం రేవంత్ పవర్ గేమ్!

 

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి కొండా సురేఖ కుటుంబం మధ్య నడుస్తున్న రాజకీయం తారాస్థాయికి చేరింది!

"మీరు, మీ తండ్రి, మీ తాత ఎవరొచ్చినా నేనే పరకాల ఎమ్మెల్యే... రేవంత్ రెడ్డి ఎవరు నాకు టికెట్ నిర్ణయించడానికి? అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా" అంటూ కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలమే రేపాయి. అంతేకాకుండా, ప్రభుత్వంపై రూ. 200 కోట్ల భూ ఆరోపణలు చేయడం, తమను అణచివేస్తున్నారంటూ కులాల ప్రస్తావన తేవడం హాట్ టాపిక్‌గా మారింది. ఒక రాష్ట్ర మంత్రి సొంత కూతురే నేరుగా ముఖ్యమంత్రిపై ఇంత బహిరంగంగా విమర్శలు గుప్పించడం తెలంగాణ కాంగ్రెస్ చరిత్రలో ఇదే మొదటిసారి. అడపాదడపా వినిపించిన ఈ విభేదాలు, ఇప్పుడు అక్షరాలా ప్రభుత్వ అధినాయకత్వానికి, ఒక మంత్రి కుటుంబానికి మధ్య జరుగుతున్న బహిరంగ యుద్ధంగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్న ఈ రాజకీయ పరిణామాల వెనుక అసలు ఏం జరుగుతోంది? మొదటి నుంచి ఉన్న కథ ఏమిటి? వరుసగా సాగుతున్న ఆ వివరాలు చూద్దాం:

1. నేపథ్యం: పరకాల సీటు చుట్టూ తిరుగుతున్న అసలు వివాదం

ఈ రాజకీయ రగడ అకస్మాత్తుగా మొదలైంది కాదు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ కొండా సురేఖ కుటుంబం తమ నియోజకవర్గంలో, పార్టీలో పట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉంది. అయితే, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో కొండా మురళి తమ కుమార్తె సుస్మితను రాజకీయ వారసురాలిగా ప్రకటించి, వచ్చే ఎన్నికల్లో ఆమెకే టికెట్ రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం స్థానికంగా వేరే నేత అయిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం ఈ వివాదానికి అసలు కారణం. ఎన్నికల సమయంలో సర్దుకుపోయినప్పటికీ, రాబోయే ఎన్నికల టికెట్ల అంశం వచ్చేసరికి కొండా కుటుంబం ముందుగానే ఈ "ప్లాన్- ఏ" పేరుతో తమ కుమార్తెను తెరపైకి తెచ్చింది. ఇలా అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఓ మంత్రి కుటుంబమే, ఏకంగా ప్రభుత్వ నాయకత్వంపై ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది.

2. విదేశీ పర్యటన ముగించుకుని రాగానే.. సీఎం వైపు నుంచి వేగంగా మారిన పావులు

విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తిరిగొచ్చిన వెంటనే పరిపాలనాపరంగా, పార్టీ పరంగా వేగం పెరిగింది. సీఎం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. మీడియా ముందు నేరుగా పెద్ద విమర్శలు చేయకుండా, "ఇది పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది" అని వదిలేశారు. అదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. మంత్రి కొండా సురేఖ నిర్వహిస్తున్న అటవీ, దేవాదాయ శాఖలలో ఆమెకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కీలక అధికారుల డిప్యూటేషన్లు రద్దయ్యాయి. అంతేకాకుండా, గతంలో కొండా సురేఖ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ అనే వ్యక్తిపై వచ్చిన కేసులో పోలీసులు వేగంగా స్పందించడంతో పాటు దర్యాప్తులో భాగంగా జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్ వేటు కూడా పడింది. మరోవైపు, పార్టీలోని 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా సమావేశమై కొండా సురేఖ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేఖ తన కూతురు వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం, కమిటీ హుటాహుటిన విచారణ జరిపి నివేదికను ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు పంపడం చకచకా జరిగిపోయాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. గతంలో కొండా సురేఖను కాపాడామని, కానీ ఈసారి హద్దు దాటి నేరుగా సీఎంపై ఆరోపణలు చేసినందున ఉపేక్షించేది లేదని స్పష్టం చేయడం గమనార్హం.

3. బెంగళూరులో ఖర్గే భేటీ.. ఢిల్లీ పెద్దల వద్దకు చేరిన పంచాయతీ

ఈ రాజకీయ పరిణామాల నేపధ్యంలో, రాష్ట్రంలో తన శాఖలపరమైన అంశాలలోనూ, పార్టీలోనూ తాము ఒంటరవుతున్నామనే సంకేతాలు రావడంతో మంత్రి కొండా సురేఖ వెంటనే అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి హైదరాబాద్ రాకముందే ఆమె నేరుగా బెంగళూరు వెళ్లి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. తమ కుటుంబం గాంధీ కుటుంబానికి మొదటి నుంచి విధేయులని, తాను బీసీ మహిళా నాయకురాలననే కారణంతోనే రాష్ట్రంలో తమను అణచివేసేందుకు కొన్ని వర్గాలు కుట్ర పన్నుతున్నాయని ఆమె ఖర్గే ముందు వాపోయినట్లు సమాచారం. అయితే, ముఖ్యమంత్రిపై బహిరంగంగా మాట్లాడకూడదని, టికెట్ల వంటి విషయాలు పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆమెకు స్పష్టమైన సంకేతాలు అందినట్లు తెలిసింది. మరోవైపు సురేఖ బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కావడంతో, పార్టీ హైకమాండ్ తక్షణమే కఠిన చర్యలు తీసుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

4. కొండా మురళి భేటీ.. అసంతృప్త నేతల కలయిక?

మరోవైపు ఈ రాజకీయ డ్రామా నడుమ మంత్రి భర్త కొండా మురళి రంగంలోకి దిగి చేసిన పనులు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. "మా బిడ్డ సుస్మిత వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు" అంటూ ఆయన ఒకవైపు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, మరోవైపు తెరవెనుక వేగంగా పావులు కదిపారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు.. గతంలో ముఖ్యమంత్రి నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకించిన సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. అయితే ఇద్దరు మంత్రులతోనే కొండా మురళి భేటి అయి ఉంటే తాజ పరిణామాలపై చర్చించారనో లేక సమస్య పరిష్కారానికి రాయబారం నడుపుతున్నారనో అర్థం చేసుకోవచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ ఈ భేటీలో ఉండటం ఈ సమావేశం ఆసక్తికరమైన చర్చలకు . పార్టీలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న అసంతృప్త నేతలంతా ఇప్పుడు ఒక్కటవుతున్నారా? అనే అనుమానాలకు ఈ భేటీ తావిచ్చింది. అయితే  ఈ భేటీ  రాయబారమా లేక మరో  కారణమా అన్నది ఆ నేతలే తెల్చి చెప్పాలి.

కాంగ్రెస్ హైకమాండ్ ఏం తేల్చనుంది?

ఇది కేవలం ఒక మంత్రి పదవిని కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటం కాదు; తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును, రాజకీయ సమీకరణాలను మార్చేయగల పెద్ద అంశం. ఒకవైపు క్రమశిక్షణే ముఖ్యమని సీఎం రేవంత్ వర్గం అడుగులు వేస్తుంటే.. మరోవైపు ఢిల్లీ లాబీయింగ్, బీసీ సామాజిక వర్గం అండతో కొండా కుటుంబం తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఈ మొత్తం వివాదంపై ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మంత్రివర్గం నుంచి సురేఖను తొలగిస్తారా? లేక హెచ్చరికలతో సరిపెడతారా? రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది!

Advertisement
Advertisement