త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | న‌గ‌రం న‌డిబొడ్డున భారీ భూ కుంభ‌కోణం.. అజామాబాద్‌లో రూ. 500 కోట్ల ఆయిల్ ఫెడ్ భూములపై రేవంత్ న‌జ‌ర్‌

Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అజామాబాద్‌లో సుమారు రూ. 500 కోట్ల విలువైన ప్రభుత్వ తెలంగాణ ఆయిల్ ఫెడ్ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్ రావు చెప్పారు.

S

Telangana | Published On Aug 30, 2026, 2.04 pm IST

Harish Rao | న‌గ‌రం న‌డిబొడ్డున భారీ భూ కుంభ‌కోణం.. అజామాబాద్‌లో రూ. 500 కోట్ల ఆయిల్ ఫెడ్ భూములపై రేవంత్ న‌జ‌ర్‌
Advertisement
  • కాంగ్రెస్ స‌ర్కార్ రియ‌ల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయింది
  • నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, లేదంటే పోరాటం తప్పదు
  • సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అజామాబాద్‌లో సుమారు రూ. 500 కోట్ల విలువైన ప్రభుత్వ తెలంగాణ ఆయిల్ ఫెడ్ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్ రావు చెప్పారు. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తులను కమీషన్ల కోసం ప్రైవేటుపరం చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈమేర‌కు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయ‌న బహిరంగ లేఖ రాశారు.

లేఖలోని ముఖ్యంశాలివే..

కాంగ్రెస్ ప్రభుత్వం నగరం నడిబొడ్డున‌ మరో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తోంది. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అజామాబాద్‌లో ఉన్న రూ.500 కోట్ల విలువైన ఆయిల్‌ఫెడ్ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తోంది. బహిరంగ మార్కెట్లో 500 కోట్ల రూపాయలు పలికే భూమిని.. కేవలం 87 కోట్లకే ఓ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే భారీ కుట్ర జ‌రుగుతోంది. ఆ 87 కోట్లు చెల్లించడానికి సొంత ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ఫెడ్ సిద్ధంగా ఉన్నా.. వారిని కాదని ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడం వెనుక ఉన్న కుంభకోణం ఏంటి?

మూడు దశాబ్దాలుగా ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్న 3 ఎకరాల 23 గుంటల (15,984 గజాలు) భూమిని లాక్కునేందుకు దుర్మార్గపు ఆలోచ‌న చేస్తున్నారు. 1987లో సుప్రీంకోర్టు ప్రైవేట్ సంస్థకు మొట్టికాయలు వేసి ప్రభుత్వానిదే హక్కు అని తేల్చినా.. కమీషన్ల కోసం కాంగ్రెస్ నేతలు తీర్పులనే తుంగలో తొక్కారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ప్రైవేట్ శక్తులకు తలొగ్గకుండా వందల కోట్ల ప్రభుత్వ ఆస్తిని చిత్తశుద్ధితో కాపాడాం.

పల్లీలు, బఠానీల్లా భూముల పందేరం..

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. పేదల పొట్టగొట్టి పెద్దలకు పల్లీలు, బఠానీల్లా వేల కోట్ల భూముల పందేరం చేస్తున్నారు. ఒకవైపు సామాన్యుల ఇండ్లను 22A జాబితాలో పెట్టి వేధింపులు.. మరోవైపు ఖరీదైన ప్రభుత్వ భూములను కమీషన్ల కోసం కారుచౌకగా ప్రైవేట్‌కు దారాదత్తం చేస్తున్నారు. ఇది ఒక్క అజామాబాద్ భూమి కథే కాదు.. కోకాపేట, రాయదుర్గం, గచ్చిబౌలిలోనూ కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ దందానే నడుస్తోంది.

ఇలా స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా ఆస్తులు అమ్ముకుంటూ పోతే.. భవిష్యత్తులో గుడికి, బడికి, చివరికి స్మశానానికి కూడా రాష్ట్రంలో స్థలం మిగలదు. తక్షణమే ముఖ్యమంత్రి ఈ అక్రమ కేటాయింపును రద్దు చేసి, ఆ భూమిని ఆయిల్‌ఫెడ్‌కే దక్కేలా ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలి. ప్రజల సొత్తును ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు.. ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మహా పోరాటం చేస్తాం.

1954లో ఆయిల్ మిల్లు నడపడం కోసం ఈ ప్లాటును ఒక ప్రైవేటు సంస్థకు లీజుకు ఇస్తే.. వారు నిబంధనలను తుంగలో తొక్కి అధిక అద్దెలకు సబ్‌లీజ్ చేసుకున్నారు. మొదటి ఏడాదిలోనే మిల్లును మూసేసి సొమ్ము చేసుకున్న ఆ సంస్థ లీజును 1974లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై ఆ ప్రైవేటు సంస్థ కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లినా వారికి చుక్కెదురైంది. 1987 నాటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ ప్రైవేట్ సంస్థకు మిగిలింది కేవలం 1,277 గజాల భూమి మాత్రమే.

మిగిలిన 15,984 గజాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, 1991లో జీవో నంబర్ 93 ద్వారా ఆయిల్‌ఫెడ్‌కు అప్పగించింది. అప్పటి నుంచి మూడు దశాబ్దాలుగా ఆ భూమిలో ఆయిల్‌ఫెడ్ (ప్రస్తుత తెలంగాణ ఆయిల్‌ఫెడ్) తన కార్యకలాపాలను కొనసాగిస్తూ, ఆ ప్రభుత్వ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.

అయితే రద్దయిన లీజును 2003లో జీవో నంబర్ 366 ద్వారా పునరుద్ధరించే ప్రయత్నం జరగ్గా.. ఆ జీవోను ఎందుకు ఉపసంహరించకూడదో చెప్పాలంటూ 2015లో ప్రభుత్వమే షోకాజ్ నోటీసు ఇచ్చింది. 2022లో హైకోర్టు సైతం ఈ నోటీసుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అంటే చట్టం, న్యాయస్థానం, రికార్డులు అన్నీ స్పష్టంగా ప్రభుత్వ సంస్థ వైపే నిలిచాయి.

కానీ, నేడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులనే తుంగలో తొక్కుతూ అడ్డగోలు నిర్ణయాలకు తెర తీసింది. ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్న 15,984 గజాల భూమిని కాదని, ఆ సంస్థకు కేవలం 1,800 గజాలు మాత్రమే ఇచ్చి, మిగతా అత్యంత విలువైన భూమినంతా అక్రమంగా అదే ప్రైవేట్ వ్యక్తికి ధారాదత్తం చేయాలని చూస్తుండటం వెనుక ఉన్న మతలబు ఏమిటో రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి.

దశాబ్దాలుగా న్యాయపోరాటం చేసి దక్కించుకున్న ప్రభుత్వ ఆస్తిని, రాత్రికి రాత్రే ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడానికి ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి ఏమిటో బయటపెట్టాలి. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోండి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని హ‌రీశ్ రావు ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement