త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రియల్ ఎస్టేట్ లాభాల కోసమే విధ్వంసం : కేటీఆర్‌

KTR | రియల్ ఎస్టేట్ లాభాల కోసమే వెలుమ‌గ‌ట్ల‌లో విధ్వంసం సృష్టించార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు విమ‌ర్శించారు. ఖమ్మంలోని వెలుగుమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలపై తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వ‌హించారు.

P

Telangana | Published On Mar 11, 2026, 7.12 pm IST

KTR | రియల్ ఎస్టేట్ లాభాల కోసమే విధ్వంసం : కేటీఆర్‌
Advertisement

KTR | రియల్ ఎస్టేట్ లాభాల కోసమే వెలుగుమట్లలో విధ్వంసం సృష్టించార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు విమ‌ర్శించారు. ఖమ్మంలోని వెలుగుమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలపై తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఖ‌మ్మంలోని వెలుగుమట్లలో మంత్రుల బినామీల ప్రయోజనాల కోసం వెయ్యి మంది పేదల ఇళ్లను కూలగొట్టడం అత్యంత దారుణమని ధ్వజమెత్తారు. భూమి చరిత్రను వివరిస్తూ 1950వ దశకంలో భూదానోద్యమ స్ఫూర్తితో ఇద్దరు పెద్దలు 62 ఎకరాలను భూదాన్ బోర్డుకు ఇచ్చారని, అందులో 31 ఎకరాలను గతంలోనే కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు.

మిగ‌తా భూమిలో చట్టబద్ధంగా పట్టాలు పొంది, గత పదేళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను ఇప్పుడు కూల్చివేయడం ప్రభుత్వ వినాశకర ఆలోచనకు నిదర్శనమని విమర్శించారు. ప‌క్కనే ఉన్న కాంగ్రెస్ మంత్రుల విల్లాలకు వ్యూ అడ్డం వస్తుందనే నెపంతో, మంత్రుల బినామీలైన వేజెళ్ళ సురేష్, ముల్లా కిషోర్, దామోదర్ రావుల రియల్ ఎస్టేట్ లాభాల కోసమే ఈ విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. శత్రు దేశం మీద దండయాత్రకు వెళ్లినట్లు 3వేల‌మంది పోలీసులతో తెల్లవారుజామున వచ్చి, ఆడబిడ్డలు వేడుకుంటున్నా కనికరించకుండా ఇళ్లను నేలమట్టం చేయడం అమానుషమన్నారు. బాధితులను 'పెయిడ్ ఆర్టిస్టులు' అని అవమానించిన మంత్రుల తీరును నిరసిస్తూ.. అసలైన పెయిడ్ ఆర్టిస్టులు ప్రభుత్వ సొమ్మును పందికొక్కుల్లా దోచుకుంటున్న వారేనని మండిపడ్డారు. వెయ్యి మంది ఇళ్లను కూలగొట్టి, ఇప్పుడు కేవలం 310 మందికి 75 గజాల చొప్పున పట్టాలు ఇవ్వడం ద్వారా మిగిలిన భూమిని ఎవరు నొక్కుతున్నారని నిలదీశారు.

గ‌తంలో 100 గజాల పట్టా ఉన్న వారికి ఇప్పుడు తక్కువ భూమి ఇవ్వడం ఏంటని, ఇది సర్కార్ నడుపుతున్నారా లేక సర్కస్ నడుపుతున్నారా అని ఎద్దేవా చేశారు. బాధితులకు భోజనం పెడుతున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని, బాధితులను కిడ్నాప్ చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఆ కేసులను ఉపసంహరించుకోవాలని, పోలీసులు తమ దాష్టికాలను ఆపాలని డిమాండ్ చేశారు. ఎక్కడైతే ఇళ్లు కూలగొట్టారో, అక్కడే తిరిగి పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఇవ్వాలని, ఆస్తి నష్టానికి గానూ ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల తక్షణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీస్తామని, బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని కేటీఆర్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement